Mana ooru Mana Badi | సర్కారు బడులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాఠశాలల్లో తిరిగి ప్రవేశాలు పెరుగుతున్నాయి. ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంతో గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లోనూ కార్పొరేట్ స్థాయి వసతులు సమకూర్చగా, తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల నిర్వహించిన ‘బడిబాట’లో ఉపాధ్యాయులు ఉచిత విద్యపై అవగాహన కల్పించగా, వందకు పైగా విద్యార్థులు ప్రవేశాలు పొందడం గమనార్హం.
తిమ్మాపూర్ మండలంలో 12 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 5 ప్రాథమికోన్నత పాఠశాలలు, 26 ప్రాథమిక పాఠశాలలు, కేజీబీవీ, మోడల్ స్కూల్ ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 3,512 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇటీవల నిర్వహించిన బడి బాటలో భాగంగా ఆయా పాఠశాలల్లో పరిధిలో ఉపాధ్యాయులు విస్తృత ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 181మంది విద్యార్థులు నూతన ప్రవేశాలు పొందారు.
వేగంగా అభివృద్ధి పనులు
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పోరండ్ల, పర్లపల్లి, నల్లగొండ ప్రాథమిక పాఠశాలలు, మొగిలిపాలెం, పర్లపల్లి జిల్లా పరిషత్ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. సుందరీకరంగా మారాయి. అలాగే పోలంపల్లి ప్రాథమిక, జిల్లా పరిషత్ పాఠశాలలు, రేణికుంట ఎస్సీ కాలనీ పాఠశాలతో పాటు మొగిలిపాలెం ప్రాథమిక పాఠశాలల్లో పనులు వేగంగా జరుగుతున్నాయి.
రూ.2.49 కోట్లతో అభివృద్ధి..
మండలంలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో 17పాఠశాలలను ఎంపిక చేశారు. అభివృద్ధి పనులు, మరమ్మతుల కోసం రూ.2.49కోట్ల అంచనాతో అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇందులో ఇప్పటి వరకు పాఠశాలల్లో మరమ్మతులు, తదితర సౌకర్యాల కోసం రూ.53లక్షలు ఖర్చు చేశారు. మిగిలిన పాఠశాలలకు విడుతల వారీగా మరమ్మతులు చేయనున్నారు.
మారిన రూపు రేఖలు..
ప్రభుత్వం చేపిట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో పాఠశాలలకు కొత్త శోభ వచ్చింది. భవనాలకు మరమ్మతు చేయించడంతో పాటు రంగులు వేసి తీర్చిదిద్దారు. విద్యుత్ సౌకర్యం కల్పించి, బెంచీలు ఏర్పాటు చేశారు. ఆవరణను మొక్కలు నాటి పచ్చదనంతో తీర్చిదిద్దారు. కొన్ని పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలల మాదిరి పేయింగ్స్ కూడా వేసి పిల్లలు ఇష్టపడేలా మార్పు చేశారు. దీంతో పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు.
ఇంగ్లిష్ మీడియంలో బోధన
మారుతున్న కాలానికనుగుణంగా విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం గతంలోనే అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. దీంతో కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో రూ.వేల ఫీజులు చెల్లించే బదులు స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే ఉచిత పుస్తకాలు, నోట్బుక్స్, డ్రెస్సులు, మధ్యాహ్న భోజనం గురించి వివరిస్తున్నారు. దీంతో చాలామంది తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు పంపేందుకు ఆసక్తి చూపుతుండడంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది.