గిరిజనుల దశాబ్దాల కల సాకారం అవుతున్నది. పోడు రైతులకు ప్రభుత్వం నేడు పట్టాలు అందించనున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1614 మందికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్, రాష్ట్ర ఎస్సీ, దివ్యాంగులు, వృద్ధులు, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా గురువారం జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో హక్కు పత్రాలు పంపిణీ చేసేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేసింది. దీంతో గిరిజనం సంబురపడుతున్నది. సీఎం కేసీఆర్, అమాత్యుడు కేటీఆర్కు రుణపడి ఉంటామని చెబుతున్నది.
– రాజన్న సిరిసిల్ల, జూలై 5 (నమస్తే తెలంగాణ)
రాజన్న సిరిసిల్ల, జూలై 5 (నమస్తే తెలంగాణ) : మారుమూల తండాలు, గూడేల్లో గిరిపుత్రులు దశాబ్దాలుగా భూములను సాగు చేసుకుంటున్నారు. కానీ హక్కు పత్రాలు లేక అరిగోస పడు తున్నారు. ఎలాంటి సంక్షేమ పథకాలు వర్తించక నష్టపోతున్నారు. మరోవైపు అటవీశాఖ అధికారులు బెదిరింపులు, కేసులతో ఆగమవుతున్నారు. అయినా నాడు ఎవరూ పట్టించుకోలేదు. కానీ, తె లంగాణ ప్రభుత్వం భరోసాగా నిలిచింది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తండాలను పంచాయతీలుగా చేసి అభివృద్ధికి బాటలు వేశారు. అలాగే ఇచ్చిన హామీ మేరకు గత నెల (జూన్) 30న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వేదికగా పోడు పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 1614 మంది పోడు రైతులకు మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి అమాత్యుడు కేటీఆర్ హక్కు పత్రాలను పంపిణీ చేయనున్నారు. సిరిసిల్ల నియోజకవర్గం వీర్నపల్లి, గంభీరావుపేట మండ లాలు, వేములవాడ నియోజకవర్గంలోని రుద్రంగి, కోనరావుపేట, మానాల ప్రస్తుతం (బాల్కొండ) నియోజకవర్గ పరిధిలో 2,859.34 ఎకరాలకు సంబంధించి పట్టాలు అందించనుండగా, ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దాంతో గిరిజనులు సంబురంలో మునిగిపోయారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని రెండు చేతులా జోడించి మొక్కుతున్నారు.
రుణపడి ఉంటం
పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు న్యాయం చేయాలని ఏండ్ల సంది మొరపెట్టుకున్నం. మా తాతలు, తండ్రులు చేసిన విజ్ఞప్తులను ఎవరూ పట్టించుకోలేదు. మమ్మల్ని ఓట్ల కోసమే వాడుకున్నరు తప్పా మా సమస్యలకు పరిష్కారం చూపలేదు. సాగు చేసుకున్నపుడల్లా కేసులతో కోర్టుల చుట్టుతిప్పిన్రు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ చొరవతో మాసమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. తండాలను పంచాయతీలుగా చేసిన్రు. తాగునీటి గోస తీర్రిన్రు. ఇప్పుడు పోడు భూములకు పట్టాలిస్తున్రు. మా గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న కేసీఆర్, మంత్రి కేటీఆర్ సార్లకు రుణపడి ఉంటం.
– భాస్కర్ నాయక్, ఆల్ఇండియా బంజారా సంఘం గంభీరావుపేట మండలశాఖ అధ్యక్షుడు
మా బతుకుల్లో వెలుగులు
మామాతలు, తండ్రుల నుంచి సాగు చేసుకుంటున్న భూములకు మీకెలాంటి హక్కులు లేవని ఫారెస్టు అధికారులు ఇబ్బంది పెట్టిన్రు. ఎక్కడో దూరాన ఉండె మాతండాల్లో ఎవుసం తప్ప మాకింకేం పని ఉంటది. ఆ ఎవుసం చేసుకుంటనే పొట్ట గడుస్తది. పోడు భూములకు హక్కు కల్పించి ఆదుకోవాలని నలభై ఏండ్ల సంది మొరపెట్టుకుంటున్నం. నాటి సర్కారు గిరిజనులను ఏనాడూ పట్టించుకోలేదు. తెలంగాణ సర్కారు మాత్రం గిరిజనుల సమస్యలపై సానుకూలంగా స్పందించింది. మా ఇబ్బందులను గుర్తించి వెలుగులు నింపుతున్నది. మంత్రి రామన్న కృషి ఫలితంగా రాష్ట్రంలోని గిరిజనులకు పట్టాలొస్తున్నయ్. మా గిరిజనుల తరపున శతకోటి వందనాలు
– మాలోతు రాందాస్, బీఆర్ఎస్ ఎస్టీసెల్ రుద్రంగి మండలాధ్యాక్షుడు
మనసున్న మనిషి కేటీఆర్
మా నాయిన నుంచి మూడెకరాల పోడు భూమిని 30 ఏళ్ల సంది సాగు చేసుకుంటున్నం. సీజన్ బట్టి పంట వేసుకుంటున్నం. అయితే ఇన్నేండ్ల సంది మేం ఎన్నో ఇబ్బందులు పడ్డం. గోస పడ్డం. తాతలు పోయిన్రు. అయినా మా ఇబ్బందులు తీరలేదు. తెలంగాణ సర్కారు దయతో పోడు గోస తీరుతున్నది. ఇప్పుడు సంతోషంగా ఉన్నం. మనసున్న మనిషి మంత్రి కేటీఆర్ సారుకు రెండు చేతులెత్తి దండం పెట్టుకుంటున్న. రెండు రోజుల్లో పట్టాలిస్తరని సార్లు చెబుతున్నరు. మా కుటుంబమంతా సార్కు రుణపడి ఉంటం.
– గుగులోతు గజన్, బడితండా (రుద్రంగి మండలం)