దళితబంధు అమలులో పూర్తి పారదర్శకతను పాటించేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న ప్రభుత్వం ఇక్కడ అమలులో ఎదురైన అనుభవాలను పరిగణలోకి తీసుకున్నది. ఈ నేపథ్యంలో కొన్ని బోగస్ సంస్థలు పుట్టుకొచ్చి జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేకుండానే లబ్ధిదారులకు కొటేషన్లు ఇస్తున్నట్లు అనుభవంలోకి వచ్చింది. అంతే కాకుండా, కమీషన్ తీసుకుని లబ్ధిదారులకు నగదు ఇస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఇలాంటి అక్రమ పద్ధతులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పంపిణీదారుల నుంచి అఫిడవిట్ తీసుకుని చట్ట పరమైన చర్యలు తీసుకునే వీలుగా నిబంధనలు రూపొందించింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో రెండో విడుత ఆర్థిక సహాయం అందించే విషయంలో ఈ నిబంధనలు విధిగా పాటించాలని నిర్ణయించింది.
– కరీంనగర్, మే 27 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, మే 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంలో కొందరు అక్రమార్కులు జోక్యం చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి మొత్తం 18,021 యూనిట్లు పంపిణీ చేశారు. నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీల పరిధిలో చూస్తే 14,080 యూనిట్లు గ్రౌండింగ్ చేశారు. ఇందులో సర్వీస్, ఇండస్ట్రీ, రిటైల్ సెక్టార్లలో యూనిట్లు ఎంపిక చేసుకున్న సుమారు 6 వేల లబ్ధిదారులకు మొదటి విడుతగా 50 శాతం కింద రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు మాత్రమే విడుదల చేశారు. పూర్తి యూనిట్ విలువ రూ.9.90 లక్షల్లో మిగతా మొత్తాన్ని విడుదల చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
క్లస్టర్ అధికారులు కొటేషన్ ప్రకారం ఫిజికల్గా ఉన్నాయా? లేదా? పరిశీలించిన తర్వాతనే ఈ ఆర్థిక సహాయాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే 2,900 యూనిట్లకు రెండో విడుత కింద ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇంకా 3,100 మందికి అందించాల్సి ఉన్నది. ఈ క్రమంలోనే కమీషన్కు ఆశపడి కొన్ని బోగస్ పంపిణీ సంస్థలు పుట్టుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. నిబంధనల ప్రకారం జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేని పంపిణీ సంస్థల నుంచి లబ్ధిదారులు కొటేషన్లు తెచ్చి అధికారులకు సమర్పించినట్లు వెలుగులోకి వచ్చింది. సదరు పంపిణీ సంస్థలకు దళితబంధు యూనిట్లు తగినట్లు సరుకులు సరఫరా చేసే సామర్ధ్యం లేకున్నా ఫేక్ కొటేషన్లు ఇస్తున్నట్లు గుర్తించారు. కొటేషన్ ఇచ్చిన ప్రతి పంపిణీ సంస్థను క్లస్టర్ అధికారులు తనిఖీ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.
కొటేషన్తోపాటు అఫిడవిట్
హుజూరాబాద్ నియోజకవర్గంలో వెలుగు చూసిన ఫేక్ కొటేషన్ల పరంపరను అరికట్టేందుకు న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఈ నెల 14న సర్క్యులర్ జారీ చేశారు. ఇందులో జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేకున్నా కొన్ని పంపిణీ సంస్థలు లబ్ధిదారులకు కొటేషన్లు ఇస్తున్నట్లు, పంపిణీ సంస్థలకు సరకులు సరఫరా చేసే సామర్ధ్యం లేకున్నా స్థోమతకు మించి కొటేషన్లు ఇస్తున్నట్లు, కొటేషన్లు ఇచ్చిన కొన్ని పంపిణీ సంస్థలు ఉనికిలో లేనట్లు, మరి కొన్ని సంస్థలు సరకులను సకాలంలో సరఫరా చేయడం లేదని పేర్కొన్నారు. వీటిని అరికట్టేందుకు న్యాయపరమైన చర్యలు తీసుకునేలా అధికారులను అప్రమత్తం చేశారు. పంపిణీ సంస్థలు కొటేషన్తోపాటు అఫిడవిట్ తప్పనిసరి చేశారు.
జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్న పంపిణీ సంస్థల కొటేషన్లు మాత్రమే ఆమోదించాలని, పంపిణీ సంస్థలు కొటేషన్ ఇచ్చిన ప్రకారంగా లబ్ధిదారులకు సకాలంలో సరఫరా చేస్తానని, కోడ్ చేసిన వస్తువులను లబ్ధిదారుల ఇంటికి చేర్చే బాధ్యతను తీసుకుంటానని, లబ్ధిదారులకు సరకులు సరఫరా చేసే సమయంలో సంబంధిత ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులకు సమాచారం అందిస్తానని, కొటేషన్లో పేర్కొన్నట్లు వస్తువుల మాత్రమే సరఫరా చేస్తానని, ఎట్టి పరిస్థితుల్లో లబ్ధిదారులకు నగదు ఇవ్వనని, ప్రభుత్వ నిబంధనలకులోబడి అంటే జీఎస్టీ రిజిస్ట్రేషన్, కమర్షియల్ టాక్స్ నియంత్రణ, దుకాణం నిర్వహణకు కలిగి ఉన్న మున్సిపల్ లైసెన్స్ కలిగి ఉన్నానని, వీటిని అతిక్రమించి ఉన్నట్లయితే తనపై చట్ట పరమైన చర్యలు తీసుకోవచ్చని పంపిణీ సంస్థల నిర్వాహకులు అఫిడవిట్లో పేర్కొనాల్సి ఉంటుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో గుర్తించిన ఈ లోపాలను కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇవే నిబంధనలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని దళితబంధు మేనేజింగ్ డైరెక్టర్ పీ కరుణాకర్ రూ.100 విలువైన స్టాంప్ పేపర్పై పంపిణీ సంస్థల నుంచి తప్పని సరిగా అఫిడవిట్ డిక్లరేషన్ తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు.
పథకంలో పారదర్శకత కోసమే..
దళితబంధు పథకం ద్వారా గుర్తించిన ఒక్కో దళిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలు పూర్తి ఉచితంగా ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఇందులో రూ.10 వేలు దళిత రక్షణ నిధి కింద జమచేసి రూ.9.90 లక్షలతో లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్లు అందిస్తున్నారు. దళితబంధు కింద లబ్ధిపొందిన వేలాది కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడుతున్నాయి. అధికారులు కూడా నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ప్రతి యూనిట్ స్థితిని ఎప్పటికప్పుడు దళితబంధు యాప్లో పొందుపర్చుతున్నారు. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి అధికారులు యాప్లో నిత్యం పర్యవేక్షిస్తున్నారు. దేశంలోనే అత్యంత గొప్ప పథకంగా ఉన్న దళితబంధు రెండో విడుత ఆర్థిక సహాయం అందించే క్రమం లో కొందరు లబ్ధిదారులు ఫేక్ పంపిణీ సంస్థల ద్వారా కొటేషన్లు పొంది అధికారులకు అప్పగిస్తున్నారు.
అధికారులు వీటిని గుడ్డిగా ఆమోదించ డం లేదు. కొటేషన్ ఇచ్చిన పంపిణీ సంస్థలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి క్లస్టర్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని సంస్థలు అసలు ఉనికిలోనే లేనట్లు అధికారుల దృష్టికి వచ్చింది. జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేకపోవడం, ఉన్నా పంపిణీ సామర్థ్యం లేకపోవడం వంటి లోపాలను అధికారులు గుర్తించారు. ముఖ్యంగా హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల్లోనే ఇలాంటి ఫేక్ పంపిణీ సంస్థల నుంచి కొటేషన్లు వచ్చినట్లు అధికారులు గమనించారు. దళితుల జీవితాల్లో ఆర్థిక వెలుగులు నింపుతున్న ఈ పథకం పూర్తిగా పారదర్శకంగా అమలు జరగాలనే ఉద్దేశంతో కలెక్టర్ కర్ణన్తోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.