ఇక్కడ కనిపిస్తున్న భవనం కరీంనగర్ జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలోని బడి. నిన్న మొన్నటి వరకు అధ్వానంగా ఉండేది. పరిసరాల్లో చెట్లు, చెదారం ఉండి విద్యార్థులు బయట తిరిగే పరిస్థితి ఉండేది కాదు. 240 మంది విద్యార్థులు ఉన్న ఈ ప్రాథమిక పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు – మన బడి’ కింద ఎంపిక చేశారు. రూ.4.44 లక్షలతో పనులు ప్రారంభించారు. విద్యుత్ వైరింగ్ పునరుద్ధరించారు. మూత్రశాలలో టైల్స్ వేశారు. కార్యాలయంతో పాటు ఐదు తరగతి గదులకు మల్టీ కలర్స్ వేశారు. ఇంకా పాఠశాల భవనంపై వాటర్ ట్యాంక్, సంప్లో మోటర్ బిగింపు, బడి గ్యాలరీలో ఆకర్శణీయమైన బొమ్మలు వేయడం వంటి పనులు మాత్రమే మిగిలాయి. ఇవి పూర్తయితే త్వరలోనే బడికి కొత్త రూపు రానున్నది.
ఇలా ఈ ఒక్క చింతకుంట బడే కాదు. మన ఊరు మన బడి కింద ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే అనేక పాఠశాలలు సరికొత్తగా మారుతున్నాయి. 12 రకాల మౌలిక వసతులు సమకూర్చుకుంటున్నాయి. మెజార్టీ స్కూళ్లలో పనులు తుది దశకు చేరగా, పూర్తయితే ఆకర్షణీయంగా కనిపించనున్నాయి.
కరీంనగర్, డిసెంబర్ 4(నమస్తే తెలంగాణ) : మన ఊరు మన బడితో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య, నమోదు పెంచడం, హాజరు శాతం కొనసాగింపుతోపాటు దశల వారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాన్ని మెరుగు పర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ద్వారా మౌలిక వసతులను కల్పిస్తోంది. మూడేళ్ల వ్యవధిలో ఏడాదికో దశగా తీసుకుని విద్యాశాఖ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగు పర్చాలని నిర్ణయించింది. నీటి సౌకర్యంతో కూడిన లాయిలెట్లు, విద్యుద్ధీకరణ, తాగు నీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బందికి సరిపడా ఫర్నీచర్, పాఠశాల మొత్తం పెయింటింగ్ వేయడం, మైనర్, మేజర్ మరమ్మతులు, గ్రీన్ చాక్ బోర్డులు ఏర్పాటు చేయడం, ప్రహరీలు, కిచెన్ షెడ్లు, శిథిలమైన తరగతి గుదుల స్థానంలో కొత్త క్లాస్ రూంలు, ఉన్నత పాఠశాలల్లో డైసింగ్ హాల్స్ నిర్మాణం, డిజిటల్ విద్య మొదలైన 12 రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు.
ఇక్కడ కార్పొరేట్ స్థాయిలో కనిపిస్తున్నది రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని సర్కారు బడి. మొన్నటిదాకా శిథిలావస్థలో చాలా అధ్వానంగా ఉండేది. నాటి సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో అరకొర సౌకర్యాల మధ్యన 6 నుంచి 10వ తరగతి వరకు విద్యాబోధన జరిగేది. డిగ్రీ చదువుకోవాలంటే సిద్దిపేట లేదా కామారెడ్డికి వెళ్లాల్సి వచ్చేది. ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా మంది పేదలు మధ్యలోనే చదువు మానేసే వారు. కానీ ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ పాఠశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ‘మన ఊరు – మనబడి’లో భాగంగా శిథిలమైన భవనాన్ని తొలగించి రూ.5 కోట్లతో ఆధునిక హంగులతో కార్పొరేట్ను తలదన్నేలా పలుకతో వచ్చి పట్టాతో వెళ్లేలా కేజీ నుంచి పీజీ క్యాంపస్ నిర్మించారు.
గివ్ తెలంగాణ పౌండేషన్తో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు బడి నిర్మాణానికి తమవంతు సహకారం అందించాయి. మొత్తం 72 తరగతి గదుల్లో 3500 మంది తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలో అభ్యసించేందుకు ఆధునిక హంగులతో ఎడ్యుకేషన్ హబ్లా నిర్మాణాలు పూర్తి చేశారు. 250 మంది చిన్నారులకు సరిపడేలా అంగన్వాడీ కేంద్రం.. చిన్నారులకు ప్రీ ప్రైమరీ, క్రీడా మైదానంతో పాటు ప్రైమరీ, ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలతో పాటు పీజీ కళాశాలకు అనుగుణంగా భవన సముదాయాలు సిద్ధం చేశారు. అంతే కాకుండా ప్రాంగణంలో డిజిటల్ లైబ్రరీ, 100 కంప్యూటర్లతో ల్యాబ్, స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రం, 1000 మంది ఒకేసారి కూర్చోని తినే విధంగా డైనింగ్ హాల్ ఏర్పాటు చేశారు.
అంతర్జాతీయ వసతులతో 4500 చదరపు అడుగుల్లో క్రీడా మైదానాన్ని సిద్ధం చేశారు. 45వేల చదరపు అడుగులలో క్రికెట్, వాలీబాల్, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్ కోర్టులతో పాటు అథ్లెటిక్ ట్రాక్తో కూడిన ఎఫ్ఐఎఫ్ఏ స్టాండర్డ్ ఆస్ట్రో టర్ఫ్ ప్లే మైదానంగా తీర్చిదిద్దారు. ఓనమాల నుంచి ఉన్నత చదువుల వరకు చదువుకునే అవకాశం ఉండేలా రూపుదిద్దుకున్న ఈ క్యాంపస్ను అమాత్యుడి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో అందుబాటులోకి రానుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఒక గంభీరావుపేట మండలంలోనే కాదు జిల్లాలోని అన్ని గ్రామాల్లో అధునాతన సదుపాయాలతో పాఠశాలల భవన నిర్మాణాలు జరుగుతున్నాయి.
‘మన ఊరు మన బడి’లో భాగంగా పాఠశాలన్నింటికీ ఒకే కలర్ కోడ్ను అమలు చేస్తున్నారు. పాఠశాలల ఆరు బయట, ప్రహరీలకు ఒకే రకం రంగు, తరగతి గదుల్లో ఐదు రకాల రంగులను వినియోగిస్తున్నారు. గోడల సీలింగ్, తలుపులు, కిటికీలు, గ్రిల్స్, గేట్లు, మూత్రశాలలు ఇలా అన్నింటికీ రంగులు వేస్తున్నారు. ఆరు బయట వేసేందుకు నీలం, తెలుపు రంగులను ఎంపిక చేయగా, ప్రహరీలకు సైతం అదే రంగు వేస్తున్నారు. గదుల్లో మార్నింగ్ గ్లోరీ, నట్ బ్రౌన్, ఎనామిల్ ఓక్వుడ్, ఎనామిల్ వైల్డ్ మష్రూమ్, మిస్ట్రీవ్యాలీ, ఎనామిల్ ఇండియన్ స్పైస్, కాపర్ కోస్ట్, తదితర రంగులను ఎంపిక చేశారు. అంతే కాకుండా బిల్డింగ్ యూజ్ ఏ లర్నింగ్ ఎయిడ్ కాన్సెప్ట్తో పాఠశాలల గోడలపై అందమైన బొమ్మలను చిత్రీకరించనున్నారు.
గోడలకు రంగులు వేయడంతోపాటు పాఠ్యాంశ సంబంధమైన పటాలు, చిత్రాలు, అక్షరమాల, ఇతరత్ర బోధనాభ్యాసన సామగ్రి బొమ్మలను వేయనున్నారు. ఉన్నత పాఠశాలల్లో మూత్ర పిండాలు, గుండె, మల్టిపులేషన్ చార్ట్, సౌర కుటుంబం వంటి చిత్రాలు, ప్రాథమిక తరగతుల్లో జంతువులు, రంగులు, తెలుగు, ఆంగ్ల అక్షమాల, పండ్లు, కూరగాయలు, నెలలు, వారాలు వంటి ప్రాథమిక అంశాలపై అవగాహన కల్పించేలా బొమ్మలు వేయనున్నారు. ఇలా పిల్లలను ఆకట్టుకునే విధంగా పాఠశాలలను తీర్చిదిద్దిన తర్వాత దశల వారీగా డిజిటల్ క్లాస్లు కూడా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
కరీంనగర్ జిల్లాలో మొత్తం 651 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 120 ప్రాథమిక, 16 ప్రాథమికోన్నత, 94 ఉన్నత పాఠశాలలను మొదటి దశలో ‘మన ఊరు – మన బడి- మన బస్తీ’ మన బడి కార్యక్రమం కింద తీసుకున్నారు. ఇందులో 182 రూరల్, 48 అర్బన్ ఏరియాలో ఉన్న పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలల్లో ఉన్న సమస్యలను గుర్తించి ఏయే పనులు అవస రం ఉంటాయనేది గుర్తించేందుకు సంబంధిత ఇంజినీరింగ్ అధికారితోపాటు పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసీ)లకు బాధ్యతలు అప్పగించారు. అభివృద్ధి సంఘాలలో ఇద్దరు క్రియాశీల పూర్వ విద్యార్థులు, ఇద్దరు ఎస్ఎంసీ సభ్యులు, గ్రామ సర్పంచ్, హెచ్ఎం స భ్యులుగా ఉన్నారు.
వీరి ఆధ్వర్యంలోనే పనులు గుర్తించి త్వరితగతిన పూర్తి చేసే విధం గా పర్యవేక్షణ జరుగుతోంది. ఈ రకంగా జిల్లాలోని 230 పాఠశాలల్లో మొదటి దశలో 31 కోట్లతో 12 రకాల పనులు చేపట్టారు. ఇప్పటికే 5 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు అన్ని పాఠశాలల్లో పనులు ప్రారంభమయ్యాయి. 52 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పూర్తి చేసుకుని రంగులు వేసే పనులు ప్రారంభించారు. కొత్తపల్లి మండలం చింతకుంట, శాంతినగర్, మానకొండూర్ మండలం చెంజర్ల, నిజాయితీగూడెం గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలో రంగులు వేసే పనులు కూడా పూర్తి కావస్తున్నాయి.
‘మన ఊరు – మన బడి’ కింద మా పాఠశాలకు 4.44 లక్షలు కేటాయించారు. మా కమిటీ సభ్యులంతా సమావేశమై అవసరమైన పనులను ఎంపిక చేశాం. ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తయ్యాయి. నీటి వసతి కోసం కొత్తగా సంప్ నిర్మించాం. విద్యుత్ వైరింగ్ పునరుద్ధరించుకున్నాం. మూత్రశాలల్లో టైల్స్ వేయించుకున్నాం. అన్ని గదులకు రంగులు వేసుకున్నాం.
ఇక సంపులో మోటర్ బిగించుకోవడం, భవనంపై ట్యాంక్ ఏర్పాటు చేయడం, గోడల గ్యాలరీల్లో బొమ్మలు వేసే పనులను త్వరలోనే పూర్తి చేసుకుంటాం. గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రాథమికంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి బడులను అందంగా తీర్చిదిద్దుతున్నందుకు సంతోషంగా ఉంది.
– ఎం నారాయణ స్వామి, ప్రధానోపాధ్యాయుడు (చింతకుంట పీఎస్)