కమాన్చౌరస్తా జూన్ 11: రాష్ట్రంలో గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి గాను ఆదివారం నిర్వహించిన పరీక్షల ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10.30 నుంచి ఒంటి గంటల వరకు పరీక్ష నిర్వహించగా, సెంటర్ల వద్ద పోలీస్శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 88 సెంటర్లు ఏర్పాటు చేయగా, 34,041 మంది అభ్యర్థులకు గాను 22,148 మంది పరీక్ష రాశారు. కరీంనగర్ జిల్లాలోని 34 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 16,828 అభ్యర్థులకు గాను 10,955 మంది పరీక్షకు హాజరయ్యారు.
5873 మంది అభ్యర్థులు గైర్హాజరు కాగా, 65.10 హాజరు శాతం నమోదైందని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వివరించారు. అలాగే జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన 21 పరీక్ష కేంద్రాల్లో 4,525 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 6,885 మంది అభ్యర్థులకు గాను 2,360 మంది గైర్హాజరు కాగా, 65.72 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 17 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, 2,915 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. మొత్తం 4,261 మంది అభ్యర్థులకు గాను 1,346 మంది గైర్హాజరు కాగా, 68.41శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. పెద్దపల్లి జిల్లాలో 16 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, 3,753 మంది హాజరయ్యారు. మొత్తం 6,067 మంది అభ్యర్థులకు గాను 2,314 మంది గైర్హాజరయ్యారు. 61.86 శాతం హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఆయాచోట్ల సెంటర్లను కలెక్టర్లు, పోలీస్ అధికారులు పరిశీలించారు. పరీక్షల నిర్వహ ణపై ఆరా తీశారు.