అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తారీఖునే వేతనాలు చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించింది. మ్యానిఫెస్టోలోనూ ఆ హామీని పొందుపరించింది. కానీ, ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఎంతో మంది వేతన జీవులకు నిరాశే మిగిలింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొందరికే వేతనాలు చెల్లించినట్టు తెలుస్తుండగా, చాలా శాఖల ఉద్యోగులకు ఇప్పటి వరకు జీతాలు పడలేదు. ఐదో తారీఖు దాటినా ఎదురుచూపులు తప్పడం లేదు. తమ ఫోన్లలో ఏ మెసేజ్ వచ్చినా ఆత్రుతగా చూసుకోవడం కనిపిస్తున్నది. అయితే కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో అందరికీ వేతనాలు విడుదలైనట్లు ప్రచారం జరుగుతుండగా, ప్రభుత్వ ఉద్యోగులే దీనిని ఖండిస్తున్నారు. అనేక మంది తిరిగి కౌంటర్లు ఇవ్వడంతో పెట్టిన పోస్టులు తొలిగిస్తున్నారు.
కరీంనగర్, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని వివిధ శాఖల హెచ్వోడీలు 010 పద్దు కిందికి వచ్చే బిల్లులు చేసి ట్రెజరీలకు సమర్పించారు. అయితే, వీటిలో ఒకే జిల్లా పరిధిలో ఉన్న ఎస్టీవోల్లో ఒకదాని పరిధిలో వేతనాలు వచ్చాయి. మరోదాని పరిధిలో ఇప్పటివరకు రాలేదు. సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ సబ్ ట్రెజరీ ఆఫీస్ (ఎస్టీవో)లో అన్ని శాఖల ఉద్యోగులకు వేతనాలు వచ్చినా.. అదే సిరిసిల్ల ఎస్టీవో పరిధిలో ఒక్క శాఖకు కూడా ఇప్పటి వరకు పడలేదు. ఇక జగిత్యాల జిల్లా పరిధిలోని మెట్పల్లి ఎస్టీవో లో వేతనాలు చెల్లించినా.. జగిత్యాల, కోరుట్ల, మల్యాల ఎస్టీవో పరిధిలో ఇంకా అందలేదు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎస్టీవో పరిధిలో ఉద్యోగులకు వేతనాలు చెల్లించారు.
పెద్దపల్లి, మంథని ఎస్టీవో పరిధిలో ఉన్న రెవెన్యూ, వైద్య విధాన పరిషత్తు ఉద్యోగులకు మాత్రమే వేతనాలు అందించారు. మిగతా శాఖలకు ఇంకా చెల్లించలేదు. ఇక కరీంనగర్ జిల్లాలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ జిల్లాలో కరీంనగర్లో డీటీ వో, గంగాధర, హుజూరాబాద్, జమ్మికుంటలో ఎస్టీవో కార్యాలయాలు ఉన్నాయి. ఒక్క కరీంనగర్ డిస్ట్రి క్ ట్రె జరీ ఆఫీస్ (డీటీవో)లో వైద్య విధాన పరిషత్తు ఉద్యోగులకు మాత్రమే వేతనాలు అందాయి. మిగతా అన్ని ఎస్టీవోల పరిధిలో ఒక్క శాఖకు కూడా వేతనాలు ఇవ్వని పరిస్థితి ఉన్నది. అయితే, అన్ని ట్రెజరీల్లో విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ మాత్రం ఇచ్చారు. ఇక చెక్కుల ద్వా రా వేతనాలు పొందే ఉద్యోగుల వేతనాల ఊసే లేకపోవడంతో సదరు ఉద్యోగులు నిరాశకు గురవుతున్నారు.
చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా వేతనాలు అందక ముందే కొన్ని పత్రికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఉద్యోగులకు మొదటి తారీఖున వేతనాలు అందినట్టు అర్థం వచ్చేలా కొన్ని పత్రికలు రాతలు రాస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ పోస్టులు అలాగే, వైరల్ అవుతున్నాయి. కానీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండగా, ఆ అసత్య ప్రచారాన్ని అనేక శాఖల ఉద్యోగులే ఖండిస్తున్నారు.
ఉద్యోగులు ఇచ్చే నెగటివ్ కౌంటర్లతో ఆ పోస్టులు డిలీట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ వాస్తవాలను పరిశీలించే ప్రయత్నం చేయగా, శుక్రవారం వరకు కొన్ని శాఖల ఉద్యోగులకే వేతనాలు అందినట్టు తెలిసింది. ఇంకా చాలా శాఖలకు చెందిన ఉద్యోగులు ఎదరుచూస్తున్నారు. గతంలో జిల్లాల వారీగా ఉన్న ఉద్యోగులకు వేతనాలు విడుదల చేసినా.. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనిపించలేదు. ఎస్టీవో కార్యాలయాల వారీగా వేతనాలు ఇస్తున్నట్టు స్పష్టమైంది.