చొప్పదండి, (రామడుగు)11: ‘’60 ఏండ్ల కాంగ్రెస్పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి శూన్యం. అవినీతి తప్ప వారు చేసిందేమీ లేదు. తెలంగాణ సాధించుకున్న తర్వాతనే సీఎం కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్లలో అన్ని వర్గాలను అభివృద్ధి చేస్తున్నారు. ఆ దిశగానే రానున్న రోజుల్లో ప్రజాభివృద్ధే ఎజెండాగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది” అని చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. శనివారం రామడుగు మండలం తిర్మలాపూర్, శ్రీరాములపల్లి గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఉచితంగా నిరంతర విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని స్పష్టం చేశారు. అయితే, 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని కాంగ్రెస్, బీజేపీ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, వారు ఎప్పుడైనా ఎకడైనా కరెంటు తీగలు పట్టుకోవాలని సవాల్ విసిరారు.
ఓట్ల రాజకీయం చేసేవారిని నిలదీయాలని పిలుపునిచ్చారు. తాను స్థానిక బిడ్డనని, నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నానని చెప్పారు. గతంలో స్థానికేతరులు ఎమ్మెల్యేలుగా గెలిచి నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో అభివృద్ధి ఆమడ దూరంలో ఉండేదని గుర్తు చేశారు. ఎన్నికల ముందు వచ్చి తర్వాత వెళ్లిపోయే నాయకులకు ఈ ప్రాంతం మీద మమకారం ఉండదని, తాను పార్టీలకతీతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందజేస్తున్నానని చెప్పారు.
తిర్మలాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకొని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బకశెట్టి నరసయ్య, ఉప సర్పంచ్ పన్యాల రమ్య మహేందర్, వార్డు సభ్యులు కటకం శ్రీనివాస్, మాజీ మారెట్ కమిటీ చైర్మన్ తడగొండ అజయ్, గ్రామ శాఖ అధ్యక్షుడు బకశెట్టి శ్రీనివాస్, నాయకులు కట్ల అనురాగ్, తడగొండ రాజు, తడగొండ విష్ణువర్ధన్, బుర్ర శ్రీనివాస్, కురుమళ్ళ మల్లయ్య, ఖాసిం షరీఫ్ పాల్గొన్నారు.