రాజన్న సిరిసిల్ల, జూలై 12 (నమస్తే తెలంగాణ): చేనేత, మరమగ్గాల కార్మికుల జీవన ప్రమాణాలు పెంచేలా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. రూ.వేల కోట్లతో బతుకమ్మ చీరలు, క్రిస్మస్, రంజాన్, విద్యార్థుల యూనిఫాం వస్ర్తాల తయారీతో చేతి నిండా పనికల్పించింది. సంపాదించిన కూలీ డబ్బులను పొదుపు చేసుకునేలా త్రిఫ్ట్ పథకంతో ప్రోత్సహిస్తున్నది. కార్మికుడు 8శాతం, ప్రభుత్వం 8శాతం డబ్బులు కార్మికుడి ఖాతాలో జమయ్యేలా చేసింది. చేనేత మిత్ర పథకం ద్వారా మరమగ్గాల కార్మికులకు పదిశాతం యారన్ సబ్సిడీ అందిస్తున్నది. ఈ పథకం కింద ఒక్కో కార్మికుడు రూ.30వేల నుంచి రూ.40వేల దాకా లబ్ధిపొందాడు. ఆసరా పింఛన్ కూడా 50 ఏళ్లకే వర్తింపచేసింది. రైతుల మాదిరిగా నేతన్నకు రూ.5లక్షల బీమా సౌకర్యం కల్పించింది. నేతన్నలు వివిధ బ్యాంకుల్లో తీసుకున్న రూ.లక్ష లోపు రుణాలు సైతం తెలంగాణ ప్రభుత్వం మా ఫీ చేసి అప్పుల్లో కూరుకు పోకుండా ఆదుకున్నది. సంక్షేమ పథకాలు కార్మికులందరికీ వర్తింపజేసేలా సర్కారు చర్యలు తీసుకుంటున్నది.
ఘనంగా జాతీయ వారోత్సవాలు
ఆగస్టు 7న నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు జిల్లాలో ఘనంగా జరిపేలా చేనేత జౌళీశాఖ ప్రణాళికలు రూపొందిస్తున్నది. నేతన్నలు అధికంగా ఉండే చోట వారోత్సవాలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్ ఇటీవల హైదరాబాద్లో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో దిశానిర్ధేశం చేశారు. పథకాలు సరళీకృతం చేసేలా కార్యచరణ చేపడుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కార్మికులకు తెలియజేసేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు జౌళీశాఖ అధికారి అశోక్రావు తెలిపారు. జిల్లాలో 30,352 మరమగ్గాలున్నాయి. వస్త్ర పరిశ్రమకు అనుబంధంగా ఉన్న పరిశ్రమలను కలుపుకుని సుమారు 10వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. 204 చేనేత మగ్గాలుండగా, 325 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరందరికీ నేతన్న బీమా సౌకర్యం, త్రిఫ్ట్, చేనేత మిత్ర, ఆసరా పింఛన్ల పథకాలు వర్తింపజేసింది. జాతీయ దినత్సవ వేడుకలను పురస్కరించుకుని వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి తీసుకోవాల్సిన అంశాలపై అధికారులు నివేదికలు రూపొందిస్తున్నారు.
నేడు టెక్స్టైల్స్ పార్కులో అవగాహన
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కార్మికులకు అవగాహన కల్పించేందుకు చేనేత జౌళీశాఖ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. అందులో భాగంగా సిరిసిల్ల టెక్స్టైల్స్ పార్కులోని అడ్మినిస్ట్రేటివ్ భవనంలో ఉదయం 10.30 గంటలకు కార్మికులు, యజమానులతో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నది. చేనేత జౌళిశాఖ చైర్మన్ ఉన్నతాధికారులు, హాజరుకానున్నట్లు ఆశోక్రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వస్త్ర పరిశ్రమ అభివృద్ధిపై అవగాహన కల్పించనుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.