గోదావరిఖని, మే 9: ‘రామగుండం ప్రజల సేవ కోసమే ఈ జీవితం. నా చివరి శ్వాస వరకు వారి వెంటే ఉంట. ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుత’ అని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. ఒక్క పిలుపుతో వేలాదిగా తరలివచ్చి రామగుండం నవ నిర్మాణ సభను విజయవంతం చేసిన ప్రజలకు, కృషి చేసిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులకు ఎమ్మెల్యే చందర్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత రామగుండం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని తెలిపేందుకే రామగుండం నవ నిర్మాణ సభ నిర్వహించామని చెప్పారు.
సమయాభావం వల్ల వేదికపై నియోజకవర్గంలో ఇంకా సమకూర్చాల్సిన సౌకర్యాలపై చెప్పలేకపోయినా వాటికి సంబంధించిన వినతి పత్రాలను సభకు హాజరైన మంత్రి కేటీఆర్కు ఇచ్చినట్లు చెప్పారు. అంతర్గాం మండల కేంద్రంలో ఇండస్ట్రియల్, రామగుండంలో ఐటీ పార్కుకు రెండు నెలల్లో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. ఆర్డీవో కార్యాలయాన్ని మంజూరు చేయాలని, రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని, పాలిటెక్నిక్, మైనింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని విన్నవించినట్లు చెప్పారు. ఇంకా వానాకాలంలో గోదావరి నదికి వరదలు వచ్చినప్పుడు రామగుండంలో కొన్ని ప్రాంతాలు ముంపునకు గరవుతున్నాయని, నదికి కరకట్టను నిర్మించాలని, సింగరేణి కార్మిక వాడల్లో మురుగు నీరు సరఫరా కాకుండా మంజూరు చేసిన 20 కోట్లతో ఫిల్టరైజేషన్ పనులు నిర్వహించేలా యాజమాన్యానికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.
మెడికల్ కళాశాల, సబ్ రిజిస్ట్రార్, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు గురించి సభా ముఖంగా ప్రజలకు చెప్పే అవకాశం కలిగిందన్నారు. రామగుండం అభివృద్ధి కోసం 100 కోట్లు కేటాయించాలని కోరిన వెంటనే స్పందించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సభ విజయవంతానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్కు మరోమారు పట్టం కట్టాలని కోరారు. ఇక్కడ మేయర్ బంగి అనిల్కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, కార్పొరేటర్లు ఇంజపురి పులెందర్, పెంట రాజేశ్, రాజ్కుమార్, శంకర్ నాయక్,మేకల సదానందం, కో-ఆప్షన్ బుచ్చిరెడ్డి, నాయకులు పొన్నం లక్ష్మణ్, నూతి తిరుపతి, సదానందం, చల్ల రవీందర్, అడప శ్రీనివాస్, గోపు ఐలయ్య, బెందె నాగభూషణం గౌడ్ ఉన్నారు.