కరీంనగర్ రూరల్: మొగ్దుంపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారం పంపిణీ చేస్తున్న మంత్రి గంగుల కమలాకర్
చక్కని చదువు కోసం ఉదయాన్నే విద్యార్థుల కడుపు నింపాలన్న గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన ‘సీఎం బ్రేక్ఫాస్ట్’ శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభమైంది. కరీంనగర్రూరల్ మండలం మొగ్దుంపూర్ జడ్పీహైస్కూల్లో మంత్రి గంగుల కమలాకర్, గొల్లపల్లి మండలం చందోళి జడ్పీహెచ్ఎస్ స్కూల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్, మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ప్రారంభించి, స్వయంగా విద్యార్థులకు వడ్డించారు. అనంతరం పిల్లలతో కలిసి అల్పాహారం ఆరగించారు.
కరీంనగర్ రూరల్/ మానకొండూర్/ గంగాధర/ హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 6 :చక్కని చదువు కోసం ఉదయాన్నే విద్యార్థుల కడుపు నింపాలన్న గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న ‘సీఎం బ్రేక్ఫాస్ట్’ను శుక్రవారం అట్టహాసంగా ప్రారంభించారు. నియోజకవర్గ కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాఠశాలల్లో ప్రారంభించిన అనంతరం పిల్లలకు అల్పాహారాన్ని వడ్డించడమే గాకుండా వారితో కలిసి ఆరగించారు. కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్ జడ్పీ హై స్కూల్లో మంత్రి గంగుల కమలాకర్ ప్రా రంభించారు. విద్యార్థులకు వడ్డించిన తర్వాత వారితో కలిసి టిఫిన్ చేశారు.
హు జూరాబాద్ జడ్పీహెచ్ఎస్లో మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి, మానకొండూర్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే రసమయి బాలకిష న్, చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని గంగాధర ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చందోళి జడ్పీహెచ్ఎస్ స్కూల్ లో మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించి, విద్యార్థులకు వడ్డించారు. రుచి బాగున్నదని నిర్వాహకులను ప్రశంసించారు. కోరుట్ల రూరల్ మండలం మాదాపూర్ జడ్పీహెచ్ఎస్లో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జగిత్యాలలో ధరూర్ క్యాంపు జడ్పీ స్కూల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ ప్రారంభించారు.
వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ జడ్పీ ఉన్నత పాఠశాలలో బీఆర్ఎస్ ఎమ్మె ల్యే అభ్యర్థి చెల్మెడ లక్ష్మీనర్సింహారావుతో కలిసి వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు శ్రీకారం చుట్టారు. సిరిసిల్ల నెహ్రూనగర్ జడ్పీ పాఠశాలలో కలెక్టర్ అనురాగ్ జయం తి, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావుతో కలిసి సీఎం బ్రేక్ఫాస్ట్ను ప్రారంభించారు. పెద్దపల్లి అమర్నగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ప్రారంభించి, పిల్లలకు వడ్డించారు. రామగుండం బల్దియా పరిధిలోని అంగడీబజార్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మంథని మండలం కాకర్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో పెద్దపల్లి జడ్పీచైర్మన్ పుట్ట మధూకర్ ప్రారంభించి, విద్యార్థులకు వడ్డించారు.