కరీంనగర్ రూరల్, జూలై 20: కేజ్ కల్చర్ విధానంలో చేపల పెంపకంతో అధిక లాభాలు సాధించవచ్చని, అధునాతన పద్ధతుల్లో చేపల పెంపకం చేపట్టేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర మత్స్య ఫెడరేషన్ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ పిట్టల రవీందర్ తెలిపారు. 30 రకాల స్కీమ్లతో మత్స్యకారులను ప్రోత్సహిస్తున్నదని, ప్రభుత్వం అందించే అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. తెలంగాణలోని చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో పెంచిన చేపల్లో మంచి రుచితోపాటు, ప్రొటీన్స్, విటమిన్స్ అధికంగా ఉంటున్నాయని చెప్పారు. ప్రపంచ దేశాల్లో మన రాష్ట్ర చేపలకు మంచి డిమాండ్ ఉందన్నారు. కరీంనగర్లోని వాసర గార్డెన్లో గురువారం కరీంనగర్ జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో లోయర్ మానేర్ డ్యాం జలాశయంలో కేజ్ కల్చర్ ద్వారా చేపల పెంపకంపై మత్స్యకారులు, లైసెన్స్దారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పిట్టల రవీందర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటగా మత్సకారులకు ఉచితంగా చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు.
దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో నాన్వెజ్ తినేవారు 93శాతం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారని, అందులో చికెన్ తినేవారు 67 శాతం, మటన్ తినేవారు 30 శాతం, చేపలు తినేవారు 16 శాతం మాత్రమే ఉన్నారని తెలిపారు. సంఖ్య అధికంగా ఉందని, మన ఉత్పత్తి చేస్తున్న చేపలు మన రాష్ర్టానికి సరిపోవడం లేదని, ఇతర దేశాలకు సరఫరా చేసేంత వనరులు మన వద్ద ఉన్నా మనం బాధ్యతతో పని చేయడం లేదన్నారు. కోర్టు కేసులు, సొసైటీలో ఒకరిపై ఒకరు ఫిర్యాదుతో ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు. ఇక్కడ 2018లో కేజ్ కల్చర్ ద్వారా చేపలను పెంపకం చేసే పద్ధతిని ప్రారంభించి మనం విఫలం చెందామని, తిరిగి సఫలం కావాలనే ఆలోచనలో మత్స్య శాఖ అధికారులు ఇక్కడ కేజ్ కల్చర్ ద్వారా చేపల పెంపకం అవగాహన సదస్సును నిర్వహిస్తున్నారని తెలిపారు. కేజ్ కల్చర్ ద్వారా తక్కువ నీటిలో ఎక్కువ సంపాదన, ఏటా రెండు సార్లు పెంచి అమ్ముకునే అవకాశం ఉందని తెలిపారు. యేటా రెండు పంటల లాభం తీసే అవకాశం అధికంగా ఉంటుందని తెలిపారు.
అధునాతన పద్ధతుల ద్వారా అధిక లాభంతోపాటు ఏటా లక్ష రూపాయల లాభం వస్తుందని తెలిపారు. మన బాధ్యతగా చేపల ఉత్పత్తిని పెంపొందించేందుకు, అవసరమైన చర్యలు తీసుకోవాలని, 10 మంది సభ్యులుగా, కేజ్ కల్చర్ ఏర్పాటు చేసుకున్న వారికి లాభదాయకంగా ఉంటుందని, మన జిల్లాలోని లోయర్ మానేర్ డ్యామ్, మిడ్ మానేరు డ్యామ్లలో చేపల కేజీ కల్చర్ ద్వారా చేపల ఉత్పత్తి పెంచేందుకు మంచి అవకాశం ఉందని తెలిపారు. 2014 నుంచి 2023 నేటి వరకు నూతనం గా లక్ష 20 వేల మందికి నూతన సభ్యత్వం అందించామని తెలిపారు. నూతన సొసైటీలు గ్రామగ్రామానా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మనం వదులుకుంటే మల్టీ నేషనల్ కంపెనీలు వినియోగించే అవకాశం ఉందని, ప్రభుత్వం అందిస్తున్న 40 శాతం సబ్సిడీలపై కమిటీగా ఏర్పడి కేజ్ కల్చర్ను అభివృద్ధి చేసుకుంటే మంచి లాభం ఉంటుందని తెలిపారు.
మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఒక రోజు చేపల కూర వడ్డించేలా ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. సభ్యులు అందరు సమన్వయంతో ప్రభుత్వం అందిస్తున్న అధునాతన పద్ధతులతో ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేడీఎఫ్ ప్లానింగ్ హెడ్ మురళీకృష్ణ, నాబార్డ్ ఏజీఎం మనోహర్ రెడ్డి, ఎల్డీఎం కరీంనగర్ ఆంజనేయులు, ఎంపెడ హైదరాబాద్ డాక్టర్ బంగారమ్మ, ఏడీఎఫ్ హైదరాబాద్ చరిత, కేవీకే జమ్మికుంట శాస్త్రవేత్త ప్రభాకర్, ప్రకృతి టీఎస్జీవో సీఈవో జయశ్రీ, ప్రకృతి ప్రెసిడెంట్ మాధవరావు, ఏడీఎఫ్ బీ దేవేందర్, డీఎఫ్వో రాజన్న సిరిసిల్ల జిల్లా శివప్రసాద్, కేజ్ మ్యాన్ప్యాక్చర్ నిలేశ్కుమార్, గిరీశ్బాబు, ఆర్కే శ్రీకాంత్, జిల్లా మత్స్య సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
కేజ్ కల్చర్ ద్వారా చేపల పెంపకంపై రాష్ట్రంలో మూడు అవగాహన సదస్సులు నిర్వహించారు. మొదటది మూసీలో, రెండోది పోచంపాడ్లో, మూడోది కరీంనగర్లో నిర్వహించాం. కేజ్ కల్చర్ ద్వారా యేడాదికి రెండు సార్లు చేపల ఉత్పత్తి పెంచవచ్చు. కరీంనగర్లోని మిడ్మానేరు, లోయర్ మానేరులో కేజ్ కల్చర్కు మంచి అవకాశం ఉన్నది. సభ్యులు, పది నుంచి 300 మంది వరకు గ్రూప్గా ఏర్పడి కేజ్ కల్చర్ ద్వారా చేపల ఉత్పత్తిని పెంపొందించవచ్చు. రాష్ట్రం ఏర్పడక ముందు 16 వేల హైక్టార్లలో చేపల ఉత్పత్తి ఉన్నది. ప్రస్తుతం 23 వేల హైక్టార్లలో చేపల ఉత్పత్తి చేస్తున్నారు. తొమ్మిది నెలల ప్రత్యే డ్రైవ్ ఏర్పాటు చేసి, వెయ్యి సొసైటీలను ఏర్పాటు చేశాం. లక్ష మందికి నూతన సభ్యత్వం ఇచ్చాం. ప్రభుత్వం మత్స్యకారుల కోసం 30 రకాల స్కీమ్లు అమలు చేస్తున్నది. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. చేపల పంపిణీలో క్వాంటి టీ, నాణ్యత లేకుంటే అధికారుల నుంచి చేప పిల్లలను తీసుకోకుండా రిజెక్ట్ చేయాలి. మానేరు డ్యామ్ వద్ద 8 ఎకరాల స్థలం సేకరించాం. అందులో హోల్సేల్ మార్కెట్తోపాటు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తున్నాం.
– లచ్చిరాం నాయక్, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్