కొత్తపల్లి, జూన్ 7: వేసవి సెలవుల నేపథ్యంలో నగరపాలక సంస్థ ఐదేళ్లుగా ఉచితంగా సమ్మర్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రశంసించారు. ఇలాంటి క్యాంపులతో చిన్నారుల్లో ఉత్సాహం నిండుతుందని చెప్పారు. మన బిడ్డల బంగారు భవిష్యత్తుకే సీఎం కేసీఆర్ తెలంగాణాను సాధించి పెట్టారని, ప్రత్యేక తెలంగాణ సాధనతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల ఉచిత విద్యుత్, పుష్కలమైన సాగునీరు, రైతులకు సంక్షేమ పథకాలు అందించగలుగుతున్నామన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నెల రోజులకు పైగా నిర్వహించిన ఉచిత సమ్మర్ క్యాంపు ముగియగా, బుధవారం రాత్రి అంబేద్కర్ స్టేడియంలో ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. వేసవి సెలవుల నేపథ్యంలో నగరపాలక సంస్థ ఐదేళ్లుగా ఉచితంగా సమ్మర్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమని, ఇలాంటి క్యాంపుల్లో చిన్నారుల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు వారిని క్రీడలపై దృష్టిసారించేలా చేస్తాయన్నారు. క్యాంపును సమర్థవంతంగా నిర్వహించిన మేయర్ వై సునీల్రావు, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, జిల్లా యువజన క్రీడాశాఖాధికారి కీర్తి రాజవీరును ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
ఏటా ఇలాగే సమ్మర్ క్యాంపు నిర్వహించేలా తీర్మానం చేయాలని సూచించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కరీంనగర్ జిల్లా యంత్రాంగం గొప్ప పనికి శ్రీకారం చుట్టిందని, ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులను ప్రాజెక్టుల సందర్శనకు నిర్ణయించడం అభినందనీయమని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కలెక్టర్, యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, తెలంగాణాలో ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ, సాధించిన ఫలితాలు, విజయాలను సబ్జెక్ట్గా రూపొందించాలని జేఎన్టీయూ వీసీకి సూచించినట్లు వినోద్కుమార్ తెలిపారు. రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, స్మార్ట్సిటీ, మానేరు రివర్ఫ్రంట్, కేబుల్బ్రిడ్జి, టీటీడీ ఆలయం నిర్మాణం దీనికి నిదర్శనమన్నారు. అలాగే మంత్రి గంగుల కమలాకర్ సహకారంతో త్వరలోనే అద్భుతమైన క్రికెట్ స్టేడియం నగరవాసులకు అందుబాటులోకి వస్తుందన్నారు. వచ్చే సంవత్సరం మరింత ఘనంగా సమ్మర్ క్యాంపులను నిర్వహించాలని సూచించారు. అలాగే, జిల్లా కేంద్రంలో ఒలింపిక్ సంఘ భవనానికి వినోద్కుమార్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. నగర మేయర్ వై సునీల్రావు మాట్లాడుతూ, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరాభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నామన్నారు.
మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ సహకారంతో ఓపెన్జిమ్లు, వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేసి నగరవాసులను ఫిట్గా, ఆరోగ్యంగా ఉంచేందుకు కృషిచేస్తున్నామన్నారు. కలెక్టర్ క్రీడా మైదానాలను అందిస్తే మున్సిపల్ ఆధ్వర్యంలో సంవత్సరం పొడవునా క్రీడా శిక్షణ కొనసాగేలా చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ, ఈ సమ్మర్ క్యాంపు విద్యార్థుల నుంచి విశేషంగా స్పందన రావడం ఆనందందగా ఉందని, సుమారు 3200 మంది విద్యార్థులు నెల రోజులపాటు 27 క్రీడాంశాల్లో శిక్షణలు తీసుకోవడం అభినందనీయమన్నారు. సుడా చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ, కరీంనగర్ అభివృద్ధిలో మంత్రి గంగుల కమలాకర్, వినోద్కుమార్ సహకారం మరువలేనిదన్నారు. అనంతరం పలు క్రీడా శిక్షణను పూర్తి చేసిన చిన్నారులకు ప్రశంసాపత్రాలను అందించారు. జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, డీవైఎస్వో కీర్తి రాజవీరు, బేస్బాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జనార్దన్రెడ్డి, ఉపాధ్యక్షుడు రమేశ్రెడ్డి, కోశాధికారి నాగిరెడ్డి సిద్ధారెడ్డి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.