జగిత్యాల టౌన్, ఆగస్టు 7 : తెలంగాణ ఏర్పడ్డ తర్వాతనే చేనేత కార్మికుల జీవితాల్లో అనూహ్యమైన మార్పులు వచ్చాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాల పట్టణంలోని చేనేత సహకార సంఘంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అధ్యక్షతన జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించగా, మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై మార్కండేయ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గతంలో ఉన్న పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు పద్మశాలీలు గమనించాలన్నారు. ఉద్యమ కాలంలో ఆకలి చావులు జరుగుతున్న సమయంలో సిరిసిల్లలో 2001-02లో మీటింగ్ ఏర్పాటు చేసి రూ.50 లక్షల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి ధైర్యం అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఉన్న నేతన్నలకు చేనేత బంధు ప్రకటించి, నేత కార్మికుడు మరణిస్తే రూ. 5 లక్షలు ఇచ్చే బీమా పథకం దేశచరిత్రలో ఎక్కడా లేదన్నారు. కాగా ఈ సందర్భంగా జగిత్యాల చేనేత సహకార సంఘం భూమి పద్మశాలీలకు కేటాయించేలా చూడాలని అధికారులను, సంఘ సభ్యులను కోరారు. అనంతరం చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులను సన్మానించి, పలు పాఠశాలల్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ మాట్లాడుతూ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత బంధు పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయడం ఆనందదాయకమన్నారు. బతుకమ్మ చీరలు, పవర్లూమ్స్, 24 గంటల కరెంట్ ద్వారా లాభం చేకూరుతున్నదన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు మాట్లాడుతూ 50 సంవత్సరాలు దాటిన నేత కార్మికులకు పెన్షన్ ఇవ్వడం అభినందనీయమన్నారు. ప్రతి సోమవారం చేనేత వస్ర్తాలు ధరించి చేనేత కార్మికులకు బాసటగా నిలువాలన్నారు. జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ చేనేత వృత్తి కనుమరుగై పోతున్న తరుణంలో వారిని తెలంగాణ ప్రభుత్వం అక్కున చేర్చుకున్నదన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జీ రవి, జిల్లా పద్మశాలీ సంఘం అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు గౌరి శ్రీనివాస్, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ లక్ష్మీనారాయణ, పద్మశాలీ సంఘ సభ్యులు పాల్గొన్నారు.