తెలంగాణ సర్కారు ప్రత్యేక చొరవతో మత్స్య సహకార సంఘాలకు ఆర్థిక పరిపుష్టి లభిస్తున్నది. గతంలో పదుల సంఖ్యలో ఉన్న సభ్యుల సంఖ్య సర్కారు ఇచ్చిన సడలింపులతో రెండింతలు పెరిగింది. ఇంకా మిషన్కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి మత్స్య సంపద దినదినాభివృద్ధి చెందుతున్నది. గతంలో ఒకటి రెండు లక్షల ఆదాయం మాత్రమే లభించిన సొసైటీలకు నేడు ఆరు రెట్లకు పైగా పెరిగింది. పెద్దపల్లి జిల్లా మంథని సంఘానికి నాడు రూ.3 లక్షల ఆదాయం రాగా, ప్రస్తుతం రూ.20 లక్షలు రావడం ఉదాహరణగా నిలుస్తున్నది.
– పెద్దపల్లి, ఫిబ్రవరి 19(నమస్తే తెలంగాణ)
పెద్దపల్లి, ఫిబ్రవరి 19(నమస్తే తెలంగాణ): కుల వృత్తులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ముం దుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి మత్స్యకారుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు సిద్ధమైంది. మంథని మత్స్య సహకార సంఘంలో 2016 కు ముందు 155 మంది సభ్యులు మాత్రమే ఉండేవారు. సభ్యత్వం దక్కాలంటే చెరువు విస్తీర్ణంలో హెక్టార్కు ఒకరి చొప్పున మాత్రమే మెంబర్ షిప్ ఇవ్వాలనే నిబంధన ఉండేది. దీంతో సభ్యుల సంఖ్య పరిమితంగానే ఉండేది. ఇక కొత్తవారు చేరాలంటే సభ్యుల్లో ఎవరైనా మరణిస్తే మాత్రమే అవకాశం వచ్చేది. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ సర్కారు ఈ నిబంధనను సడలించింది. హెక్టార్కు ఒకరు కాదని, ఎకరానికి ఒకరి చొప్పున సభ్య త్వం ఉండాలనే నిబంధన విధించింది. దీంతో సభ్యుల సంఖ్య ఒకటిన్నర రెట్లు పెరిగింది. ఇలా మత్స్యకారులందరికీ ప్రయోజనం కలిగింది.
మిషన్ కాకతీయతో పునర్జీవం..
అప్పటి సమైక్య ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఒకప్పు డు ఓ వెలుగు వెలిగిన చెరువులన్నీ వట్టిపోయా యి. కింద ఆయకట్టుకు నీరందించక లేక.. మత్స్యకారులకు ఉపాధిలేక అధ్వానంగా ఉండేవి. ఫలితంగా ఏటా సీజన్లో మత్స్యకారులు చేప పి ల్లలు పోసుకున్నా చెరువులో పూడికతో చేప పిల్లల సైజు పెరిగేది కాదు. తక్కువ కాలం మాత్రమే నీళ్లు నిలిచే సామర్థ్యం ఉండడం వల్ల ఎండకు చనిపోయేవి. దీంతో చేప పిల్లలు పెరగకముందే పట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అయితే మిషన్ కాకతీయతో చెరువులు, కుంటలన్నీ ఆధునీకరించడం తో చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది.
చేప పిల్లలు భారీగా పెరుగుతున్నాయి. ఏడాదికి 200-500 గ్రాముల దాకా పెరిగే చేప పిల్లలు ఇప్పుడు ఏడాదికి కిలోకు పైగా పెరుగుతున్నాయి. మంథని సొసైటీ పరిధిలో రెడ్డి చెరువు, శిలసముద్రం, అయ్యగారి చెరువు, బన్నెచెరువులు ఉండగా 230మంది సభ్యులు ఉన్నారు. గతంలో ఈ నాలుగు చెరువుల్లో చేపలు పట్టడం ద్వారా వచ్చే ఆదాయం రూ.3లక్షలు దాటేది కాదు. కానీ, ఇప్పుడు ప్రతి వేసవి సీజన్లో రూ.20 లక్షల దాకా ఆదాయం లభిస్తున్నది. ఇంకా మత్స్య కారులకు అండగా నిలిచేందుకు సమీకృత మత్స్య అభివృద్ధి పథకం (ఐఎఫ్డీఎస్) పథకం కింద 75 శాతం సబ్సిడీపై వలలు, మార్కెటింగ్ కోసం మోపెడ్లు, ఆటో ట్రాలీలు అందిస్తున్నది.
ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది..
మత్స్యకారులు, సహకార సంఘాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం బాగున్నది. గతంతో పోల్చితే ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నాం. ఉచిత చేప పిల్లలతో పాటుగా ఎక్సెల్ వాహనాలు, ట్రాలీ ఆటోలు ఇవ్వడం వల్ల వ్యాపారంపై చాలా మంది దృష్టి పెట్టా రు. ప్రతి రోజు చేపల వ్యాపారం చేస్తున్నారు. చేప పిల్లలను సకాలంలో ప్రభుత్వం పంపిణీ చేస్తే ఇంకా మేలు కలుగుతుంది.
– పీ క్రాంతి, మత్స్య సొసైటీ అధ్యక్షుడు, మంథని
పద్నాలుగు వందలే వచ్చేది..
ప్రతి సీజన్లో మేం చేప లు పట్టడం ద్వారా ఒక్కొక్కరికి దాదాపుగా రూ.1400 మాత్రమే వచ్చేది. చేపలు పెరగకపోయేది. పావుకిలో దాటక పోయేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక్కొక్కరికి ఇప్పుడు రూ.7 వేల దాకా వస్తున్నాయి. మాకు ఎక్సెల్లు, ట్రాలీలు, వలలు కూడా ప్రభుత్వం నుంచి వచ్చినవి. చెరువుల పూడికతీత వల్ల మంచి ప్రయోజనం కలిగింది.
– జీ వెంకటస్వామి, మత్స్యకారుడు, మంథని