సిరిసిల్ల రూరల్, జనవరి 9: తంగళ్లపల్లి మండల పరిషత్ నూతన భవనం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. మంగళవారం మంత్రి కేటీఆర్ చేతులమీదుగా అందుబాటులోకి రాబోతుండగా, యంత్రాంగం ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. జిల్లా ఆవిర్భావం తర్వాత తంగళ్లపల్లి మండలంగా ఏర్పాటైంది. మండల పరిషత్ కార్యాలయం అద్దెభవనంలో కొనసాగిస్తుండగా, మంత్రి కేటీఆర్ నూతన భవనం నిర్మాణానికి 1.20కోట్లు మంజూరు చేశారు. దీంతో మండల కేంద్రంలోని అంబభవాని ఆలయం సమీపంలో రెండెకరాల స్థలంలో జీ+1 పద్ధతిన ఆధునిక హంగులతో భవనాన్ని నిర్మించారు. మంగళవారం ఉదయం 11గంటలకు మంత్రి ప్రారంభించనున్నారు. మెరుగైన సౌకర్యాలతో నిర్మించిన ఈ భవనంలో అధికారులు నేటి నుంచి సేవలందించనున్నారు.
అభివృద్ధి పథంలో తంగళ్లపల్లి
మంత్రి కేటీఆర్కు 2009 నుంచే తంగళ్లపల్లితో ప్రత్యేక అనుబంధం ఉన్నది. తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించడంలో తంగళ్లపల్లి ప్రజల సహకారం ఎంతో ఉంది. తర్వాత ప్రతి ఎన్నికల్లో అధిక మెజార్టీ తంగళ్లపల్లి నుంచే వస్తున్నది. గతంలో సిరిసిల్ల రూరల్ మండలంగా ఉన్న సమయంలోనే తంగళ్లపల్లికి సముచిత స్థానం కల్పిస్తానని చెప్పి, మండలంగా ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నారు. అంతేకాకుండా తంగళ్లపల్లి మండలం పరిధిలోనే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ (ఐడీటీఆర్), వ్యవసాయ కళాశాల, ఐటీఐ కళాశాల, భారీగా గోదాంలు, కోల్డ్ స్టోరేజ్, వయోవృద్ధుల ఆశ్రమం, 1320 డబుల్ బెడ్ రూం ఇండ్లు (కేసీఆర్నగర్), రోడ్ల విస్తరణ, సెంట్రల్లైటింగ్, తదితర అభివృద్ధి పనులు చేశారు. తాజాగా ఆధునిక మండల పరిషత్ భవనం నిర్మించడంతోపాటు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఇక్కడే స్థానికంగా ఏర్పాటు చేయిస్తున్నారు.
మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు..
మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతోనే తంగళ్లపల్లి మండలం ఏర్పాటైంది. తొలి ఎంపీపీగా నాకే అవకాశం దక్కింది. కొత్త మండలం కావడంతో 1.20కోట్లతో మండల పరిషత్ నూతన భవనాన్ని సకల హంగులతో నిర్మించారు. దానిని మంత్రి కేటీఆర్ చేతులమీదుగా నేడు ప్రారంభిస్తుండడం సంతోషంగా ఉన్నది. మంత్రికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. సహకరించిన ప్రజాప్రతినిధులు, సభ్యులకు ధన్యవాదాలు.
– పడిగెల మానస, ఎంపీపీ (తంగళ్లపల్లి)