నేతన్న చౌరస్తా, నవంబర్ 13 : ఆ చిన్నారులు తమకు అచ్చొచ్చిన రంగాల్లో విశేషంగా రాణిస్తున్నారు.. స్కూళ్లకు వెళ్లి బుద్ధిగా చదువుకుంటూనే ప్రతిభకు పదును పెడుతూ ఇష్టమైన విభాగాల్లో మెరుస్తున్నారు. సిరిసిల్లకు చెందిన ఎలిగేటి మహాలక్ష్మి, దాసరి శ్రీమేధ కూచిపూడి నృత్య ప్రదర్శనతో పలువురిని మెప్పిస్తున్నారు. వాసం సుచిత్ కరాటేలో పతకాల పంట పండిస్తున్నాడు. కొత్తపల్లికి చెందిన వైష్ణవి, వినయ్ ఇంటింటా ఇన్నోవేటర్లో అద్భుతమైన ఆవిష్కరణలతో సత్తాచాటారు. నేడు బాలల దినోత్సవం సందర్భంగా ఈ చిన్నారి చిచ్చర పిడుగులపై నమస్తే ప్రత్యేక కథనం..
కూచిపూడిలో మెరికలు..
సిరిసిల్లకు చెందిన ఎలిగేటి మహాలక్ష్మి, దాసరి శ్రీమేధ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నారు. వీరికి చిన్నప్పటి నుంచే కూచిపూడి నృత్యమంటే మక్కువ. నాలుగేండ్లుగా వివిధ కళావేదికలపై నృత్యంతో ఆహూతులను మెప్పించారు. ఇటీవలి వినాయక చవితి, దసరా వేడుకల్లో ప్రదర్శనలు ఇచ్చారు. వేములవాడ శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో తెలంగాణ భాషా సాంస్కతిక శాఖ నిర్వహించిన శివార్చన వేడుకల్లో నత్యంతో భక్తులను కట్టిపడేశారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా సిరిసిల్లలో నిర్వహించిన సాంస్కృతిక వేడుకల్లో 75 మంది కళాకారులతో కలిసి వందేమాతరం పాటకు నృత్యం చేసి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికెట్ పొందారు.
కరాటేలో సుచిత్ సత్తా..
సిరిసిల్లకు చెందిన వాసం సుచిత్ పట్టణంలోని మాస్టర్ మైండ్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఈ బాలుడు తల్లిదండ్రులు ప్రోత్సాహంతో కరాటే కుంగ్పూలో సత్తా చాటుతున్నాడు. రెండేండ్ల నుంచి పట్టణానికి చెందిన వడ్నాల శ్రీనివాస్ వద్ద శిక్షణ తీసుకుంటున్న సుచిత్ స్కూల్స్థాయి పోటీల్లో పలుమార్లు బంగారు పతకాలను గెలుచుకున్నాడు. సౌత్ ఇండియాస్థాయి కుంగ్పూ పోటీల్లో రజత పతకాన్ని ఒడిసిపట్టాడు.
మల్టీపర్పస్ స్టేర్ ైక్లెంబింగ్ ట్రాలీ..
గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన సీహెచ్ వైష్ణవి స్థానిక జడ్పీస్కూల్లో పదో తరగతి చదువుతున్నది. ఈ బాలిక బరువులు మోసేందుకు అమ్మానాన్నలు పడుతున్న ఇబ్బందులను చూసి వినూత్న ఆవిష్కరణకు పూనుకున్నది. సులభంగా బరువుమోసే మల్టీపర్పస్ స్టేర్ ైక్లెంబింగ్ యంత్రాన్ని రూపొందించి ఔరా అనిపించింది. ఇనుప పట్టిలతో స్టాండ్ను తయారు చేసి దీనికి ఇరువైపులా మూడుచక్రాలనును అమర్చింది. ఈ పరికరంతో చాలా ఈజీగా సిలిండర్లు, వాటర్ బబుల్స్ లాంటి వస్తువులను మెట్లపై నుంచి తీసుకెళ్లవచ్చు. అలాగే తక్కువ శ్రమతో వృద్ధులైన పేషెంట్లను ఒకచోటి నుంచి మరోచోటికి తరలించవచ్చు. ఈ ప్రాజెక్టు 49వ జిల్లాస్థాయి జాతీయ సైన్స్ఫెయిర్లో రాష్ట్రస్థాయికి ఎంపికైంది.
సులభంగా కలుపుతీసే యంత్రం..
గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన పిడుగు వినయ్ గ్రామంలోని జడ్పీస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. అతడి తల్లిదండ్రులకు వ్యవసాయమే జీవనాధారం. వారు పొలంలో కలుపుతీసేందుకు పడుతున్న కష్టాలను స్వయంగా చూసి ఈజీగా కలుపుతీసే యంత్రానికి రూపకల్పన చేశాడు. కర్రబొంగులు, జే వైర్సాయంతో ఈ పరికరాన్ని తయారుచేశాడు. దీంతో ఒక్కరే సులభంగా కలుపు తీయవచ్చు. ఈ ప్రాజెక్టు ఇంటింటా ఇన్నోవేటర్లో జిల్లాస్థాయికి ఎంపికైంది.