మల్యాల, ఫిబ్రవరి 22 : కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేసి, ఇచ్చి మాటకు కట్టుబడి ఉండాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ 17 గెలిచి కేంద్రంలో అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని సీఎం అంటున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నుంచి వినోద్కుమార్ను మరోసారి గెలిపిస్తే ఈ ప్రాంత సమస్యలన్నింటినీ పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకగా మారి పరిష్కారం చూపుతారని చెప్పారు. మల్యాల మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది పూర్తయ్యేలోగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి, నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నారు.
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నీరందక పంటలు ఎండిపోతున్నాయని, కరెంట్ కోతలు మొదలయ్యాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వం సాగునీరు, నిరంతర కరెంట్ ఇచ్చి రైతులకు అండగా ఉండాలని సూ చించారు. కరీంగనర్ ఎంపీగా బోయినపల్లి వినోద్కుమార్ ఉన్న సమయంలో కరీంనగర్ను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చి అభివృద్ధి దిశ గా చర్యలు చేపట్టారని, కొత్తపల్లి-మనోహరాబాద్కు ప్రత్యేక లైన్ మంజూరులో చొరవ చూపారని, ప్రస్తుతం ఆ మార్గంలో సిద్దిపేట వరకు రైలు ప్రయాణాలు ప్రారంభమయ్యాయన్నారు. అనంతరం మానాలలోని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. తర్వాత ఇటీవల దుబాయి నుం చి క్షమాభిక్షపై స్వదేశానికి వచ్చిన మానాలకు చెందిన శివరాత్రి హన్మంతును కలిసి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జనగం శ్రీనివాస్, జడ్పీటీసీ కొండపలుకుల రాంమోహన్రావు, సహకార సంఘాల అధ్యక్షులు అయిల్నేని సాగర్రావు, బోయినిపల్లి మధుసూదన్రావు, బీఆర్ఎస్ నాయకులు మిట్టపల్లి సుదర్శన్, గడ్డం మల్లారెడ్డి, బద్దం తిరుపతిరెడ్డి, అజహరొద్దీన్, బద్దం తిరుపతి, దూస వెంకన్న, బోడ గోవర్ధన్, గాజుల రాములు, పోతురాజు శ్రీనివాస్, రియాజ్, అలంకార్, రంజిత్ పాల్గొన్నారు.
కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వానికి ఏం చేసిందో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చెప్పాలి. ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టిన ఆయన నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చారో ప్రకటించాలి. రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టుకైనా జాతీయహోదా కల్పించారా..? కొండగట్టు అంజన్న ఆలయానికి ఎన్ని నిధులు తెచ్చారు? తెలంగాణకు ఎన్ని జాతీయ రహదారులు, ఎన్ని రైల్వేలైన్లు మంజూరు చేయించారు? చెప్పాలి. ప్రతి ఎన్నికల సందర్భంలో ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడం తప్ప చేసిందేమీ లేదు. ప్రస్తుతానికి రాష్ట్రంలో సమ్మక్క జాతర నడుస్తున్నది. కనీసం దానిని జాతీయ జాతరగా గుర్తించి, నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలి.
– సుంకె రవిశంకర్