కోరుట్ల, మే 20 : భానుడు భగ్గుమంటున్నడు. పది రోజులుగా దంచికొడుతున్నడు. బుధవారం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రికార్డు స్థాయిలో నమోదైన ఉష్ణోగ్రతలు భయపెట్టాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా కోరుట్లతోపాటు అయిలాపూర్లో 46.5 డిగ్రీలు నమోదయ్యాయి. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోనూ 45 డిగ్రీలకుపైనే రికార్డయ్యాయి. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోయారు. పొద్దంతా ఎండ వేడితోపాటు వేడిగాలులతో ఉక్కిరిబిక్కిరయ్యారు. మరో నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి ఉండొచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికతో బెంబేలెత్తిపోతున్నారు.