korutla | కోరుట్ల, ఆగస్టు 25 : కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సహకారంతో కోరుట్ల, మెట్ పల్లి విద్యార్థులు సోమవారం హైదరాబాదులోని టీ హబ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో వివిధ బస్సుల్లో రెండు పట్టణాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు చెందిన విద్యార్థులను హైదరాబాద్ కు తీసుకెళ్లారు. హైదరాబాద్లోని టీ-హబ్, టీ-వర్క్స్ సందర్శించిన విద్యార్థులతో ఎమ్మెల్యే మాట్లాడారు.
ప్రపంచ స్థాయి టెక్నాలజీ, ఇన్నోవేషన్ సెంటర్లు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడటం రాష్ట్రానికి గర్వకారణమని తెలిపారు. టీ-హబ్, టీ-వర్క్స్ లాంటి వేదికలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచి, భవిష్యత్తులో స్టార్టప్ల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తాయన్నారు. కోరుట్ల నియోజకవర్గ విద్యార్థులు ఈ వేదికల ద్వారా కొత్త ఆవిష్కరణలకు ముందడుగు వేయాలని ఆకాంక్షించారు.
విద్యార్థులు ఈ సందర్శనలో భాగంగా స్టార్టప్ ప్రాజెక్టులు, ఆధునిక టెక్నాలజీ విభాగాలు, ఇన్నోవేషన్ ల్యాబ్లు ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ అనుభవం భవిష్యత్తులో వారికి ఉపాధి అవకాశాలపై అవగాహన కలగడానికి దోహదపడనుండగా, విద్యార్థులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట కోరుట్ల నియోజకవర్గం లోని వివిధ కళాశాలకు చెందిన విద్యార్థులు, కరస్పాండెంట్లు, ప్రిన్సిపల్స్ ఉన్నారు.