కరీంనగర్ కలెక్టరేట్, జనవరి 29 : పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు, రీయింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, కేజీబీవీల్లో కొంతకాలంగా మెస్చార్జీలు పెండింగ్లో ఉన్నాయని ఆవేదన చెందారు.
బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం కావడంతో భోజన నాణ్యతలో తేడా వస్తున్నదని, సరైన పౌష్టికాహారం అందడం లేదని మండిపడ్డారు. బకాయిలు సత్వరమే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని కోరారు. పెరిగిన ధరలకనుగుణంగా కాస్మొటిక్ చార్జీలు చెల్లించాలన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఇక్కడ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజనీకాంత్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కంపెల్లి అరవింద్, గజ్జెల శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.