టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడుతున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి బాధ్యతారహితంగా వ్యవహరించిన ఆయన తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. పేపర్ లీకేజీ కుట్ర ఆయన డైరెక్షన్లో జరగడం దారుణమని, ఇది ఎంతమాత్రం సహించరానిదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. లీకేజీల విషయం బయటికి వచ్చినప్పటి నుంచి పిల్లలతోపాటు తామూ ఆందోళన చెందామని, పిల్లలు మరోసారి పరీక్షలు రాయాల్సి వస్తుందేమోనని భయపడ్డామన్నారు. కానీ, సర్కారు సకాలంలో స్పందించి నిందితులను అరెస్ట్ చేసి మంచి పని చేసిందని, పరీక్షలను యధాతథంగా కొనసాగించడంతో ఊపిరిపీల్చుకున్నామని చెప్పారు. రాజకీయాల పరంగా ఏదైనా ఉంటే వాళ్లు వాళ్లే చూసుకోవాలి గానీ, ఇంతలా దిగజారొద్దని హితవు పలికారు. విద్యార్థుల జీవితాలపై విషం చిమ్మితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని, సంజయ్ లోక్సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాల్సిందేనని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.
– కరీంనగర్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
పిలగాండ్ల ఉసురు తగుల్తది
నా బిడ్డ తరుణి హుజూరాబాద్లోని ఎంజేపీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నది. చానా కష్టపడి పరీక్షలకు ప్రిపేరైంది. కొందరు దుర్మార్గులు తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నరు. పేపర్ లీకైందని తెలిసినంక నేను ఆందోళన చెందిన. నా బిడ్డ కష్టవడి చదివిన చదువు వృథా అయితదా అని భయపడ్డ. ప్రభుత్వం సరైన టైంల స్పందించి పేపరు లీకులకు అడ్డుకట్ట వేయడం చానా మంచిదైంది. లేదంటే రోజూ ఇట్లనే పేపర్ లీకైందని పుకార్లు లేపి పిల్లల మానసిక ధైర్యాన్ని దెబ్బతీసెటోళ్లు. మా బిడ్డ లాంటి ఎందరో పిల్లలు ఆగమయ్యేటోళ్లు. పేపర్ల లీకేజీలో నిజంగా బండి సంజయ్ పాత్ర ఉంటే చట్ట ప్రకారం శిక్షించాల్చిందే. ఇంకెవరి పెద్దల పాత్ర ఉన్న కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఎగ్జామ్స్ ఎప్పటిలాగే జరగాల్నని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం. నేను, మాబిడ్డ ఊపిరి పీల్చుకున్నం. రెండు రోజులు బాధపడిన మా బిడ్డ మిగతా పరీక్షలకు ప్రిపేర్ కావాల్నంటే కొంచెం డిస్ట్రబ్ అయ్యింది. ఇప్పుడు ధైర్యం వచ్చింది. బాగానే ప్రిపేర్ అవుతున్నది. స్వలాభం కోసం విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయొద్దని రాజకీయ నాయకులను కోరుతున్న.
– కందాల కిరణ్, పదో తరగతి విద్యార్థిని తండ్రి (హుజూరాబాద్)
కరీంనగర్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కరీంనగర్ (నమస్తే తెలంగాణ)/ కమాన్చౌరస్తా/ హుజూరాబాద్ టౌన్: ఈ నెల 3న టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. నెలల తరబడి కష్టపడ్డ విద్యార్థులు తొలిరోజూ ఉత్సాహంగా పరీక్ష రాశారు. ముగిసిన వెంటనే ఇంటికి చేరుకున్న వారు పేపర్ లీకైందని టీవీల్లో వార్తలు రావడంతో కలవరానికి గురయ్యారు. వారి తల్లిదండ్రులు సైతం మనోవేదన చెందారు. అనుమానాల మధ్య రెండోరోజూ పరీక్షకు హాజరయ్యారు. మళ్లీ ఎం జరుగుతుందోనని సందేహాల నడుమ పరీక్ష రాశారు. వారు అనుకున్నట్లుగానే ఈ పరీక్ష కూడా లీకైందని వార్తలు రావడంతో మరింత ఆందోళన చెందారు. ఇక మిగిలిన పరీక్షలు వాయిదా పడతాయేమోనని భయపడ్డారు. మళ్లీ మొదటి నుంచి రాయాల్సి వస్తుందేమోనని గాబారపడ్డారు. తమ పిల్లల కష్టం వృథా అవుతుందని తల్లిదండ్రులు సైతం పరేషాన్ అయ్యారు. వారి మానసిక పరిస్థితిని చూసి ఒకింత ఇబ్బందిపడ్డారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అంతే వేగంగా స్పందించి లీకేజీ కుట్ర కోణాన్ని బట్టబయలు చేసింది. కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసింది.
ప్రధాన సూత్రధారి బండి సంజయ్తో పాటు మరో ముగ్గురు పాత్రదారులను కటకటాలకు పంపించింది. ఇదే సమయంలో పరీక్షలను యధాతథంగా నిర్వహిస్తున్నది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. సర్కారు స్పందించిన తీరుపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే లీకేజీ వ్యవహారంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. కొందరు విద్యార్థులైతే ఏకంగా ఠాణాలకు వెళ్లి ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులతో కలిసి నిందితుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. లీకేజీ కుట్రలో ప్రధాన నిందితుడుగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ వైఖరిపై విరుచుకుపడుతున్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న ఆయన డైరెక్షన్లోనే పేపర్ల లీకేజీ జరగడంపై మండిపడుతున్నారు. తన స్వార్థపూరిత రాజకీయాల కోసం పిల్లల బతుకులను బలిపెట్టడమేంటని నిలదీస్తున్నారు. తెలంగాణ సర్కారును బదనాం చేసేందుకు ఇంతలా దిగజారుడు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఆయనకు దమ్ముంటే సీఎం కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోవాలని, సమస్యలపై పోరాడాలని డిమాండ్ చేశారు. కానీ పిల్లల భవిష్యత్తో చెలగాటమాడడం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం లీకేజీకి కారణమైన వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మస్తు భయపడ్డం.. మా బిడ్డయితే ఏడ్చింది..
మాకు ముగ్గురు ఆడపిల్లలే. పెద్దబిడ్డకు పెండ్లి చేసినం. కూలీ నాలీ చేస్కొని అష్ట కష్టాలువడుతూ తతీమ ఇద్దర్ని చదివించుకుంటున్నం. నడిపి బిడ్డ అనూష చొప్పదండి సర్కార్ బల్లె పదో తరగతి, చిన్న బిడ్డ ఎనిమిదోది చదువుతంది. మేం చదువుకునే పరిస్థితి లేకుండె. కానీ, ఎన్ని ఇబ్బందులువడ్డా మా పిల్లల్ని చదివించాలని నిర్ణయించుకున్నం. పిల్లలకు స్కూల్ డ్రెస్సులు, మధ్యాహ్న భోజనం బడిలనే ఇస్తున్నరు. చదువు మంచిగ చెప్తున్నరు. మా పిల్లలుసుతం మంచిగ చదువుకుంటున్నరు. మా రెండో బిడ్డ పదో తరగతి పరీక్షలు రాస్తున్నది. పరీక్ష మొదలైన రోజే పేపర్ లీకయిందని మా బిడ్డ మాతోని చెప్పుకుంట బాధపడ్డది. మల్ల రెండో పేపర్ కూడా రాసింది. ఇంటికి వచ్చి ఈ పేపర్ సుతం లీకయిందని, నాకు మంచి మార్కులు వస్తయో రావోనని ఏడ్వవట్టింది. రెండు పరీక్షలు కష్టపడి రాసినా మంచి మార్కులస్తయి. పేపర్ లీకైతే అవి మళ్లీ రాయిమంటరు. అప్పుడు కొత్త ప్రశ్నలు ఇస్తరని బాధపడవట్టింది. మేం సుతం బాధపడ్డం. మా బిడ్డ ధైర్నం చెడినట్టు అనిపించింది.
నచ్చజెప్పి తతీమ పరీక్షలకు మంచిగ చదువుకో బిడ్డా అని చెప్పినం. బీజేపోళ్లు ఇట్ల పిలగాండ్లను బాధ పెట్టుడు ఎంత వరకు కరెక్టు? నా బిడ్డలెక్కనే చానా మంది బిడ్డలు బాధపడుతుంటరు కదా.. పేపర్ లీకేజీల భయం పెట్టుకుంటే చదివిన చదువు కుడా పోయెటట్టున్నది. రాసిన పరీక్షలు మళ్లీ రాసుడేమోనని పిల్లలు భయపడ్తున్నరు. సర్కారోళ్లను బద్నాం చేసేతందుకు గిట్లోంటి పనులు చేత్తరా..? జనంల పల్చనవుడు తప్ప పేరొస్తదా..? బీజేపోళ్లు ఎందుకిట్ల చేస్తున్నరు? వాళ్ల రాజకీయం కోసం పిల్లల భవిష్యత్తు నాశినం జేస్తరా.. వీళ్లకు ఎందుకింత కడుపుమంట? పిల్లల తెరువుకుపోతే తల్లిదండ్రులు ఊకుంటరా..? గట్టిగ బుద్ది చెప్తరు. పిలగాండ్ల పేపర్లు లీకు చేసిండ్రని పుకార్లు చేసెటోళ్లను గట్టిగనే అర్సుకోవాలే. లేదంటే రేపు రేపు ఇసోంటోళ్లు మస్తుగ పుట్టుకొస్తరు. పిలగాండ్లు నాశినమైతరు.
– ఎముండ్ల సుగుణ- మల్లేశం(చొప్పదండి)
రద్దు చేస్తరేమోనని ఆగమాగమైనం
మాకు ఒక కొడుకు, కూతురు. కూతురు వర్ధిని పదో తరగతి పరీక్షలు రాస్తుంది. కూలీ నాలీ చేస్తూ పిల్లలను చదివిస్తున్నం. పేపర్ లీక్ అయిందని తెలిసినంక ఆందోళనపడ్డం. రూపాయ్.. రూపాయ్ కూడబెట్టి కష్టపడి చదివిస్తున్నం. పరీక్షలు రద్దు చేస్తరేమోనని ఆగమాగం అయినం. కానీ, సర్కారు రద్దు చేయకుండా కొనసాగించటం మంచి నిర్ణయం. ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నరు. పదో తరగతి పరీక్ష పేపర్ లీక్ చేస్తే .. కష్టపడి చదివే పిల్లలను మానసికంగా దెబ్బతీసినట్టే కదా? అసలు పేపర్ లీక్ చేయటం దుర్మార్గం. పేపర్ లీక్ చేసిన దుర్మార్గులను వదిలిపెట్టొద్దు. పేపర్ లీక్ చేసినోళ్లకు ఖచ్చితంగా పిల్లల ఉసురు తగుల్తది.
– కందుకూరి రాధిక – సంతోష్ దంపతులు
లీకేజీలతో ఆందోళన పడ్డం
పదో తరగతి పరీక్ష పేపర్ల లీకేజీ విషయాలు బయటికి వస్తుంటే మేమంతా ఆందోళన పడ్డం. నా కొడుకు ఎస్సెస్సీ పరీక్షలు రాస్తున్నడు. పిల్లలు కష్ట పడి చదువుకొని తీరా పరీక్షలు రాస్తున్న సమయంలో ఇలా లీకేజీ కావడం దారుణం. వీటి వల్ల పరీక్షల నిర్వహణకు ఏదైనా బ్రేక్ పడితే ఇన్ని రోజులుగా చదువుకున్న పిల్లలు, వారి చదువుల కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న తల్లిదండ్రులు చాలా నష్టపోయే ప్రమాదముంది. లీకేజీ వ్యవహారంతో మానసికంగా ఒత్తిడికి గురవుతరు. దీనివల్ల మిగతా పరీక్షలపై ఏకాగ్రత పెట్టి రాయలేక పోతుంతరు. దీంతో ఫలితాలు తారుమారయ్యే పరిస్థితి ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా, ఆకతాయిగా చేసే ఇలాంటి చర్యల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బీటలు పారే ప్రమాదముంది.
– ఇల్లెందుల వెంకటేశ్వర్లు, విద్యార్థి తండ్రి
లీకేజీలకు బ్రేకులు వేయకుంటే ప్రమాదం
పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజీలకు ప్రభుత్వం బ్రేకులు వేయకుంటే విద్యార్థుల జీవితాలు ఆగమవుతయ్. నా కూతురు పదో తరగతి పరీక్ష రాస్తుంది. పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి ఎక్కడో ఒక చోట లీక్ అవుతుండడంతో నా బిడ్డతోపాటు నేను ఆందోళన చెందినం. నాలాంటి ఎంతో మంది తల్లిదండ్రులు, వారి పిల్లలు మనో వేదనకు గురవుతున్నరు. లీకేజీలతో పరీక్షలు రద్దయితే సంవత్సరం పాటు కష్టపడి చదివిన పిల్లల కష్టం వృథా అవుతుంది. విద్య కోసం వెచ్చిచ్చిన విలువైన సమయం నష్ట పోయే ప్రమాదముంది. విద్యార్థుల జీవితాలతో ఆడుకునే ఎంతటి వారినైనా ఉపేక్షించవద్దు. చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.
– పెండం రమేశ్, విద్యార్థిని తండ్రి
టీచర్లను బదనాం చేయడం బాధాకరం
ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా పదో తరగతి పరీక్షల్లో ఇన్విజిలేటర్గా పనిచేస్తున్న. రాజకీయ నాయకులు కుట్రలు పన్ని పేపర్ లీక్ చేసి మా టీచర్లపై నిందలు వేయడం, వారి చేష్టలకు ముగ్గురు ఉపాధ్యాయులు బలి కావడం చాలా బాధాకరం. ఎవరో ఒకరు చేసిన తప్పు వల్ల మొత్తం ఉపాధ్యాయ లోకానికి అపవాదు రావడం దురదృష్టకరం. సవ్యంగా జరుగుతున్న పరీక్షలు ఎవరో ఒకరు చేసిన తప్పులకు పరీక్షలు అంతటా వాయిదా వేయడం వల్ల విద్యార్థుల్లో ఆత్మసె్థైర్యం దెబ్బతిని మళ్లీ సరిగ్గా పరీక్షలు రాయలేకపోవచ్చు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటం, పరీక్ష పేపర్ల మీద కుట్రలు చేయడం ఏ పార్టీ నాయకులకు కూడా మంచి పద్ధతి కాదు. మరోసారి ఎకడా ఇలాంటివి జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలి.
– భారత ప్రభాకర్, పీఆర్టీయూ తెలంగాణ మండలశాఖ అధ్యక్షుడు(ఎస్జీటీ) గణేశ్నగర్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల
నా కొడుకు ఆందోళన పడ్డడు
నా కొడుకు అభిలాష్కుమార్ హుజూరాబాద్లోని ప్రైవేటు స్కూల్లో పదో తరగతి చదువుతున్నడు. పరీక్షలకు మంచిగా ప్రిపేరైండు. చకగా పరీక్షలు రాస్తున్న టైంలో పేపర్ లీక్ అయిందని ఒక్కసారిగా వార్తలు వచ్చినంక ఆందోళనపడ్డడు. రాసిన పరీక్ష రద్దయితే నా కొడుకు మళ్లీ పరీక్ష రాయాల్నా..? ఏడాది చదివిన చదువంత వృథా అవుతుందా..? అని ఆందోళన పడ్డం. పిల్లల కాన్సన్ట్రేషన్ దెబ్బతిని డిప్రెషన్కు గురవుతరేమోనని ఆందోళన చెందినం. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ నాయకులు వాళ్ల అనుచరులతోటి పేపర్ లీక్ చేసి పరీక్షలను అపహాస్యం చేయడం సహించరాని నేరం. దొంగలను సకాలంలో పట్టుకొని జైలుకు పంపించడంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు మంచి పని చేసిన్రు. నిందితులను కఠినంగా శిక్షించాలి. పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడిన రాజకీయ నాయకులు ఎవరైనా సహించేది లేదు.
– బొద్దుల రాజకుమార్యాదవ్, ఎస్ఎస్సీ విద్యార్థి తండ్రి
విద్యార్థులు భయపడుతున్నరు
ప్రశ్నాపత్రాల లీకేజీతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని విద్యార్థులు భయపడుతున్నరు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రతిపక్ష పార్టీలు వారి రాజకీయ భవిష్యత్తు కోసం ఇటు విద్యార్థులను, అటు ఉపాధ్యాయులను పావులుగా వాడుకుంటున్నరు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాటుతున్నరు. ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఒత్తిడిలేని సహజ వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాయడం లేదు. కొన్ని నెలలుగా ప్రత్యేక క్లాసులు పెట్టి మంచి భవిష్యత్తును అందించడానికి మేం కృషి చేస్తే దాన్ని రాజకీయం చేసి చెడగొడుతున్నరు. రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ ద్వారా సర్కారు బడులను ప్రైవేటుకు దీటుగా తయారు చేసింది. అన్ని వసతులు కల్పించి విద్యార్థులకు మంచి విద్యను అందిస్తుంటే ప్రతిపక్ష పార్టీలు చదువులను పావులా వాడుకొని విద్యార్థుల జీవితాలతో ఆటుకుంటున్నయి. ఇలాంటి వారికి జీవిత ఖైదు విధిస్తే మరోసారి ఏ రాజకీయ పార్టీలు ఇలాంటి పని చేయవు.
– యాళ్ల అమర్నాథ్రెడ్డి, పీఆర్టీయూ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే
మా చిన్నోడు రుత్విక్ పదో తరగతి పరీక్షలు రాస్తున్నడు. ఉత్తమ గ్రేడ్ సాధించేందుకు ఎంతో కష్టపడ్డడు. మొదటి రెండురోజులు పేపర్లు లీక్ అయ్యాయని టీవీల్లో వార్తలు చూసి ఆందోళన చెందినం. అందులో ప్రమేయమున్న ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఊపిరి పీల్చుకున్నం. ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తి చిన్న పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతాడని అనుకోలేదు. లీకేజీ ప్రభావం మా కొడుకుపై పడకుండా జాగ్రత్తలు తీసుకున్నం. ఇందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉంటుంది.
– సబ్బని నరేందర్, స్వర్ణలత (టెన్త్ విద్యార్థి రుత్విక్ తల్లిదండ్రులు)
బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నయ్
తొమ్మిదేండ్ల సంది కానీ లీకేజీలు ఇప్పుడే ఎందుకు అవుతున్నయో..? ఎవరు చేస్తున్నరో మాకిప్పుడు అర్థమవుతున్నది. పసిపిల్లల జీవితాలతో ఆడుకుంటరా..? ఇంత దిగజారుడు పనులు జేస్తరా..? వాళ్లు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నోళ్లకు గట్టిగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నయ్. ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌలతులను కల్పించింది. విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం పడుతున్న శ్రమను మేము కండ్లారా చూస్తున్నం. మా పిల్లల పరిస్థితి చూస్తుంటే మాకు కండ్లల్లో నీళ్లు తిరుగుతున్నయ్. పిల్లల జీవితాలను నాశనం చేయాలని చూస్తే సీఎం కేసీఆర్ చూస్తూ ఊరుకోరనే గట్టినమ్మకం మాకుంది. దీని వెనుక ఎవరి హస్తం ఉన్నా వదిలి పెట్టకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి.
– సద్దిమల్ల సురేందర్, విద్యార్థిని తండ్రి (పదిర)
పిల్లల భవిష్యత్తో ఆడుకోవద్దు
నా పెద్ద బిడ్డ పదో తరగతి పరీక్ష రాస్తున్నది. అయితే కొందరు తమస్వార్థం కోసం పేపర్ లీక్ చేసి రాజకీయం చేస్తున్నరు. దీంతో పిల్లలు పరేషాన్ అవుతున్నరు. మనోవేదనకు గురవుతున్నరు. ఇది ఎంతమాత్రం పద్ధతికాదు. రాజకీయాలు చేయాలంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిపై పోరాడాలి. కానీ పిల్లల భవిష్యత్తో ఆడుకోవద్దని మనస్ఫూర్తిగా వేడుకుంటున్న.
– మిట్ట నర్సయ్య, వేములవాడ
జీవితాలతో ఆడుకోవద్దు
నా కొడుకు చందు రోజూ కష్టపడి చదువుతుండు. పరీక్షలు షురూ అయినవి. అంతలోనే ఎక్కడో ప్రశ్న పత్రాలు లీకైనట్లు ప్రసార మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండటంతో పరీక్షలు రద్దయితవేమో, రాసిన పరీక్షలే మళ్లీ రాయాల్సి వస్తుందేమోననే ఆందోళన ఉండేది. ప్రభుత్వాన్ని బద్నాం చేసి రాజకీయంగా లబ్ధిపొందాలనే కుట్రలు, కుతంత్రాలతో కొందరు ఇలాంటి చిల్లర చేష్టలకు పాల్పడుతున్నరు. ఇలా విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం మంచిది కాదు. లీకేజీతో చదువుపై విద్యార్థులకు ఏకాగ్రత దెబ్బతింటుందని ఆవేదన కలుగుతంది. విద్యార్థుల భవిష్యత్ను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్న కుట్రదారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.
– అడ్వాల శ్రీనివాస్, పదోతరగతి విద్యార్థి తండ్రి, వేములకుర్తి
లీక్ చేయడం బాధాకరం
ప్రశ్నా పత్రాలు లీక్ చేయడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందున్నరు. మళ్లీ ఎగ్జామ్స్ పెడతరా?, రాసిన పేపర్ రద్దవుతుందా? అని అడగడం బాధాకరం. విద్యార్థులు పరీక్ష రాస్తుండగా ప్రశ్నా పత్రం లీక్ చేసి బయట వాట్సాప్లో తిప్పుతూ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తుందని నిందవేయటం సరికాదు. ఏదేమైనా విద్యార్థుల జీవితాలతో రాజకీయం చేయడం శోచనీయం. పది విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారు ప్రతి రోజూ బడికి వచ్చేలా ప్రోత్సహించి, ప్రత్యేక క్లాసులు పెట్టి 100 శాతం ఉత్తీర్ణత వచ్చేలా మేం కష్టపడ్డాం. విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షలు రాస్తుంటే ప్రశ్నా పత్రాలు లీక్ చేసి వారి భవిష్యత్తుతో ఆడుకోవడం బాధాకరం.
– బోయినపల్లి ఆనందరావు, పీఆర్టీయూ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి
పొలగాండ్లు ఏమైతరో అని భయమైతంది..
మా కొడుక్కు పుట్ట్టుకతోనే చెవులు ఇన్రావు. దాంతోటి మాటలుగుడ సరిగ రావు. అసోంటి పిలగాడు యాడాదంతా మస్తు కట్టపడి సదివిండు. గింతల్నే గీ పేపర్ల లీకేజీతోని మాకు మస్తు భయమైతంది. పొలగాని సదువు గీన్నే ఆగిపోతదా అనిపిస్తంది. పొలగాండ్ల పాణాలతోని గీ దిమాక్ లేనోళ్లు ఆటలాడుకుంటన్రు. గిన్నేండ్లసంది గింత లొల్లిగాకుంట, సక్కగ నడుత్తన్న పరీక్షలు, గీ దినం ఎట్ల లీకైతయ్. గాళ్ల రాజకీయాలకోసం గింతమంది పిల్లల జీవితాలతో ఆటలాడుతరా..? రెక్కలు ముక్కలు జేసుకొని మా పొలగాండ్లను కంటిపాపలెక్క సాదుకుంటన్నం. మాకు సదువు లేకపోయినా.. మా కడుపుల పుట్టినోళ్లన్న ఇంత సదువుకోని గొప్పోల్లయితరనుకుంటే.. కొందరు బట్టెబాజిగాళ్లు మా బతులకుతోని ఆటలాడుతండ్రు. మొన్న వరంగల్లుల ఎవలో కావాల్ననే పేపర్ బయిటికి తెచ్చిండ్రని తెలిసినప్పటిసంది, ఇప్పటిదాక పొలగాండ్లు భయపడుతున్రు. ఎంత ధైర్నం లేకపోతే ఓ దిక్కు పరీక్షలు జరుగుతుండంగనే గోడెక్కి పొయ్యి కిటికిలకెళ్లి పొలగాడు రాత్తన్న పేపర్ దీస్కొని ఫోటువదీసి పెట్టిండంటే.. గా పొలగానెనుక ఎంతమందున్నరో. పేపర్ లీకేజెనుక వున్నోళ్లను జెప్పన్నే దొర్కవట్టిన సర్కారోళ్లు, మళ్ల గిసోంటిది జరుగకుంట జూడాలె. ఏ పాపం దెల్వని పసిపొలగాండ్ల బతుకులను ఆగంజేసెటోడు ఎంత పెద్దోడైనా ఇడ్సిపెట్టద్దు.
– దాసరి కనుకయ్య, విద్యార్థి తండ్రి, గోపాల్రావుపేట (రామడుగు)
ఆందోళన చెందద్దు
లీకుల పేరుతో కొందరు కావాలనే విద్యాశాఖను అప్రతిష్టపాలు చేసి విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలనే కుట్రలు చేస్తున్నరు. వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థుల భవిష్యత్కు పదో తరగతి పరీక్ష తొలిమెట్టు. ఇలాంటి సమయంలో ప్రశ్న పత్రాలు బయటకు రావడాన్ని చాలా తీవ్రంగా పరిగణించాలి. పోలీసులు అప్రమత్తమై చర్యలు చేపట్టడం అభినందనీయం. పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. లీకేజీపై జరుగుతున్న ప్రచారంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందద్దు. అవేమీ పట్టించుకోకుండా కష్టపడి చదువుకొని, పరీక్షలో మంచి ఫలితాలు సాధించాలి.
– బొమ్మెల చిన్నయ్య, పీఆర్టీయూ అసోసియేట్ రాష్ట్ర అధ్యక్షుడు
శాశ్వతంగా జైల్లో పెట్టాలి
నా కొడుకు ఎంతో కష్టపడి చదువుతున్నడు. ఇప్పటి వరకు జరిగిన పరీక్షలు బాగా రాసినట్లు నా కొడుకు చెపుతుంటే సంతోషం వేసింది. కొందరు చిల్లరగాళ్లు పేపర్ లీకేజీలు చేయడం వల్ల పరీక్షలు రైద్దెతే నా కొడుకు మళ్లీ పరీక్షలు రాయాల్సి వస్తుందేమోనని ఆందోళన పడుతున్న. అందుకే చిల్లర వ్యవహారాలు నడిపే వారు ప్రజాప్రతినిధులుగా ఉండడం సమాజానికి మంచిది కాదు. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు బెయిల్ ఇవ్వకుండా శాశ్వతంగా జైల్లోనే పెట్టాలి. ఇలాంటి వ్యక్తులు సమాజంలో తిరగడం మంచిది కాదు. పదో తరగతి చదువుతున్న విద్యార్థి తండ్రిగా చెప్తున్న. ఇటీవల రాహుల్గాంధీకి జైలు శిక్ష పడితే ఎంపీ పదవిపై అనర్హత వేటు పడినట్లుగా బండి సంజయ్ ఎంపీ పదవిపై కూడా అనర్హత వేటు వేయాలి. బీజేపీ అధిష్టానానికికి ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా తక్షణమే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండిని తొలగించాలి.
– మంగళారపు రవి, పదో తరగతి విద్యార్థి తండ్రి ,రాఘవపేట
నా బిడ్డ చాలా బాధపడ్డది
నా బిడ్డ రక్షణ కల్లూరులోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో చదువుతంది. టెన్త్లో మంచి గ్రేడ్ సాధించాలనే పట్టుదలతో రేయింబవళ్లు చదివింది. పేపర్ లీకైందని తెలువంగనే నా బిడ్డ చాలా బాధపడ్డది. ఒక వేళ పరీక్షలు రద్దయితే ఏడాది సంది కష్టపడి చదువుతున్న నా పరిస్థితి ఏంటి నాన్నా అంటూ గోసగా అడిగింది. నాలాంటి అనుభవం ప్రతి తల్లిదండ్రులకు ఎదురవుతుంది. పరీక్షలు రద్దయితే మళ్లీ విద్యార్థులపై మునపటి ఉత్సాహం ఉండదు. మళ్లీ ప్రశ్నలు ఎలా వస్తాయోనని ఆలోచిస్తూ చదువు మీద ధ్యాస పెట్టరు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం నిందితులను వెంటనే పట్టుకొని కటకటాలకు పంపింది. స్వల్ప వ్యవధిలో ప్రశ్నా పత్రం లీక్ చేసిన వారిని పోలీసులు పట్టుకోవడం నిజంగా అభినందనీయం. రాజకీయాల కోసం ఇంత నీచానికి దిగజారిన బీజేపీ నాయకులను చట్టపరంగా శిక్షించాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులను ఆరెస్ట్ చేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నరు.
– భూపెల్లి నగేశ్, పదోతరగతి విద్యార్థిని తండ్రి, రాంనగర్
హమ్మయ్య…దొంగ దొరికిండు
పదో తరగతి పరీక్ష పేపర్లు లీకైతుంటే మా కొడుకు భవిష్యత్తేంటని భయపడ్డ. ఎన్నడూ లేనిది రెగ్యులర్గా పేపర్లు లీకవుతుంటే మేం నిజంగానే రాష్ట్ర ప్రభుత్వంపై అనుమానపడ్డం. ఇంత జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ఆవేశానికి గురైనం. ఇన్నాళ్లూ చదివిన చదువంతా వ్యర్థమేనా అనే ఆందోళన మా కొడుకులోనూ కనిపించింది. కానీ, ప్రభుత్వం లీకు వీరుడి మూలాలు కనిపెట్టింది. కుట్రదారుడితోపాటు లీకు చేసిన వారిని కూడా అరెస్టు చేసింది. హమ్మయ్య దొంగ దొరికిండని ఊపిరి పీల్చుకున్నం. పార్టీల పరంగా రాజకీయాలు చేసుకోవాల్సిన నాయకులు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం సిగ్గుమాలిన పని. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారంటూ విమర్శలు చేసిన వ్యక్తి, నేడు పదో తరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిండు. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా, లక్షలాది మంది ప్రజల వైపు పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తూ, తన రాజకీయ ఎదుగుదలకు తప్పుడు పనులు చేయడం ఏ మేరకు సమంజసం. రాష్ట్రంలో తరచుగా ఎదురవుతున్న ప్రజా సమస్యలకు ప్రభుత్వాన్ని నిందించిన వ్యక్తే, సమస్యల సృష్టికర్త అని తేలిపోయింది. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకులో కూడా ఆయన పాత్ర ఉందేమో అనే అనుమానం వస్తున్నది. తన ఎదుగుదలకు చిన్న పిల్లల జీవితాలను పణంగా పెట్టేందుకు నిస్సిగ్గుగా ప్రయత్నించిండు. పదే పదే రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్న ఆయనే తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డడు.
– నిమ్మ మమత, పదో తరగతి విద్యార్థి అర్చిత్ తల్లి (కరీంనగర్)
టీచర్స్ను ఇబ్బందులు పెట్టొద్దు
పరీక్షలు మొదలైన కొద్ది సేపటికి, పరీక్షలు ముగుస్తాయన్న సమయంల పేపర్లు బైటికి పంపించి టీచర్లను ఇబ్బందులు పెట్టే చర్యలకు దిగుతున్నరు. దీంతో ఉపాధ్యాయులే కాకుండా ఏమీ తెలియని విద్యార్థులు కూడా మానసికంగా ఇబ్బందులు పడుతున్నరు. ఇలాంటి పరిస్థితి టీచర్లకు ఎప్పుడూ ఎదురు కాలే. ఇప్పుడే ఎందుకు ఎదురవుతున్నది? కొందరు నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు, ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేలా చర్యలకు పాల్పడడం విచారకరం. ఇప్పుడున్న సిలబస్లో విద్యార్థులు మంచి జీపీఏలు సాధించేలా టీచర్లు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నరు. ప్రత్యేక తరగతులు నిర్వహించి బాగా ప్రిపేర్ చేయించిన్రు. విద్యార్థులు కూడా కష్టపడి చదివి మంచి జీపీఏ తెచ్చుకుంటామనే ఆశతో పరీక్షలు రాస్తున్నరు. ఇలాంటి పరిస్థితుల్లో పేపర్లు లీకవుతున్నయని కొందరు, మరి కొందరు పేపర్లు లీకు చేయడం సరికాదు. ఇవి విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. అదే సమయంలో ఉపాధ్యాయుల మానసిక ధైర్యాన్ని దెబ్బతీస్తాయి. వారిపై ఒత్తిడి పెంచుతాయి. రాజకీయ స్వార్థం కోసం విద్యార్థుల పరీక్షల అంశాన్ని కొందరు ఎంచుకోవడం దురదృష్టకరం.
– పల్లెపాటి వేణుగోపాల్ రావు, ఉపాధ్యాయుడు
పేపర్ లీకేజీ దురదృష్టకరం
హన్మకొండ జిల్లాలో పదో తరగతి హిందీ ప్రశ్న పత్రం లీకేజీ కావడం దురదృష్టకరం. ఈ ఘటనతో అటు విద్యార్థుల, ఇటు విధులు నిర్వర్తించే ఉపాధ్యాయుల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నది. ఈ క్రమంలో అకస్మాత్తుగా పేపర్ లీకేజీ కావటంతో ఎంతో ఆందోళనకరమైన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు గందరగోళానికి గురయ్యే పరిస్థితి ఏర్పడటం సరికాదు. విద్యార్థుల భవిష్యత్తును ఇబ్బందులకు గురిచేసే పరిస్థితులు ఉండకూడదు. పరీక్షలు కట్టుదిట్టమైన పరిస్థితుల్లో జరగాల్సిందే. ఇక ముందు పరీక్ష పత్రాలు లీకేజీ కాకుండా కఠినమైన చట్టాలు తేవాలి.
– ఎల్మదాసరి రవి, ఉపాధ్యాయుడు, కొత్తపల్లి ప్రాథమిక పాఠశాల