కోనరావుపేట, అక్టోబర్ 27: రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలతోనే కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుల ఝూటా మాటలు నమ్మవద్దని, రాష్ర్టాన్ని వారు ముంచేస్తారని హెచ్చరించారు. ప్రజలు ఆలోచించి గులాబీ పార్టీకి అండగా నిలిచి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. కోనరావుపేట మండలంలోని ఊరుతండాలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా తండా గిరిజన మహిళలతో కాసేపు ముచ్చటించారు. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందని స్పష్టం చేశారు. ప్రధానంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంట్, పేద విద్యార్థులకు రెసిడెన్షియల్ పాఠశాలలు, దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీలకు కుట్టు మిషన్, వృద్ధులకు దివ్యాంగులకు ఆసరా ఫించన్లు వంటి పథకాలు ఎక్కడా లేవని మహిళలకు వివరించారు. అంతేకాకుండా యువతకు లక్షల ఉద్యోగ అవకాశలు కల్పించినట్లు పేర్కొన్నారు. ఇవన్నీ సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. అనంతరం నిమ్మపల్లి గ్రామంలో నుంచి వెళుతూ బస్టాండ్లో ఉన్న బురుజును చూసి మురిసిపోయారు. రజకార్ల పోరాటాలు, అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు. అప్పటి కాలంలో రాతితో కట్టిన బురుజు చెక్కుచెదరక పోవడంతో స్థానిక ప్రజాప్రతినిధులు తివర్ణ పతాకాన్ని బురుజును తీర్చిదిద్దిన తీరును అభినందించారు.
మల్కపేట గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుకుందామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. మల్కపేటలో (చెన్నమనేని రాజేశ్వర్రావు) రిజర్వాయర్ కట్టపై 3కోట్లతో చల్మెడ లక్ష్మీనరసింహారావు నిర్మిస్తున్న రామాలయాన్ని సందర్శించారు. రాతితో కడుతున్న ఆలయ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో ఏడు ఎత్తైన గుట్టల మధ్యన ప్యాకేజ్-9 నిర్మించడం అద్భుతమన్నారు. ఒక వైపు రామాలయం, మరో వైపు మూడు టీఎంసీలతో జలకళ సంతరించుకున్న ప్యాకేజ్-9తో ఈప్రాంతం మరింత అభివృద్ధి చెందనుందన్నారు.
భవిష్యత్లో టూరిజంస్పాట్ కానుందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో వేములవాడలో రాజన్నను దర్శించుకొని నేరుగా మల్కపేటలో రాముడిని దర్శించుకోనే విధంగా చల్మెడ కుటుంబీకులు ఆలయం నిర్మించడం హర్షనీయమన్నారు. ఇక్కడ ఎంపీపీ చంద్రయ్యగౌడ్, మార్కెఫెడ్ డైరెక్టర్ నర్సయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మల్యాల దేవయ్య, ఆర్బీఎస్ మండల కన్వీనర్ మల్యాల దేవయ్య, సర్పంచులు రాములునాయక్, శ్రీనివాస్, వంశీకృష్ణరావు, ఆరె లత, ఉప సర్పంచ్ దొంతరవేని శ్రీనివాస్, మండల యువజన విభాగం అధ్యక్షుడు ముష్నం జీవనగౌడ్, సీనియర్ నా యకులు రాఘవరెడ్డి, ఆరె మహేందర్, మాజీ జడ్పీటీసీ చెన్నమనేని శ్రీకుమార్ ఉన్నారు.