ధర్మపురి/ధర్మపురి రూరల్, సెప్టెంబర్28: ‘ఎన్నికలు వస్తున్నాయనగానే కాంగ్రెస్, బీజేపీ గ్రామాలమీద పడ్డయి. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నయి. ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తున్నయి. ఆ రెండు పార్టీలు దొందూ దొందే. ఆ పార్టీ నాయకులకు ఎజెండానే లేదు. చెప్పేవన్నీ కట్టుకథలే.. అన్నీ మోసపూరిత మాటలే. నమ్మితే మోసపోతం. జాగ్రత్త’ అంటూ ప్రజలకు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. పనిచేసే ప్రభుత్వానికే మళ్లీ పట్టం కట్టాలని కోరారు. గురువారం ధర్మపురి మండలం రాజారం, దమ్మన్నపేట గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మహిళలు మంత్రికి మంగళహారతులతో ఘన స్వాగతం పలికి వీరతిలకం దిద్దారు. ఈ సందర్భంగా మంత్రి గ్రామాల్లోని వీధివీధినా పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. రాజారం గ్రామంలో 1.32కోట్లు, దమ్నన్నపేటలో 5.87కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవ, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా రెండు గ్రామాల్లో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలది అధికార యావ అయితే, బీఆర్ఎస్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్, బీజేపీలు బేజారువుతున్నాయన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల జీనవప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ను ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కారుగుర్తు పై ఓటు వేసేందుకు ఉత్సాహంగా ఉన్నారని, ఇందుకు ప్రజా ఆశీర్వాద యాత్రనే నిదర్శనమన్నారు. వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 100 స్థానాల్లో కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు సోషల్ మీడియా, గాంధీభవన్, బీజేపీ భవన్లో తప్ప, ప్రజల్లో లేరని ఎద్దేవా చేశారు. ఆ రెండు పార్టీలకే ఓ ఎజెండానే లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కర్ణాటకలో ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే చేతులేత్తేసిన విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధికి రూ.1500 కోట్లు కేటాయించి అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపానని, మరోసారి అవకాశమిస్తే మరింత అభివృద్ధి చేస్తానని మంత్రి ఈశ్వర్ స్పష్టం చేశారు. ప్రతి గ్రామంపై దృష్టి సారించి అభివృద్ధి చేశానని, నియోజకవర్గంలో అభివృద్ధి జరుగని గ్రామం లేదని, సంక్షేమ ఫలం అందని ఇళ్లు లేదన్నారు. ధర్మపురి నుంచి దొంతాపూర్ దాకా రూ.30కోట్లతో బీటీ రోడ్డు వేయించానన్నారు. తలాపున గోదావరి ఉన్నా నాడు తాగునీటికి ఇబ్బందులు ఉండేవని, రాజారం,దమ్మన్నపేట వద్ద గోదావరి ఒడ్డున ఎత్తిపోతల పథకాలు నిర్మించడం, చెరువులను పునరుద్ధరించడంతో సాగు, తాగునీరు పుష్కలంగా లభిస్తున్నదన్నారు. ప్రభు త్వ సంక్షేమ ఫలాలను పార్టీలకతీతంగా ఇంటింటికీ అందించానని, చేసిన అభివృద్ధిని చూసి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు.
బీఆర్ఎస్ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిందని, పార్టీలో క్రమశిక్షణతో మెలుగుతూ ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృ ద్ధి పనులను ప్రజలకు వివరించాలని మంత్రి సూచించారు. రాజారంలో వివిధ పార్టీలకు చెంది న దాదాపు 50 మంది యువకులు పార్టీలో చేర గా, కండువా కప్పి ఆహ్వానించారు. ఇక్కడ కరీంనగర్ డీసీఎమ్మెస్ చైర్మన్ డా.ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, జడ్పీటీసీ బత్తిని అరుణ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్కుమార్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ సౌళ్ల భీమయ్య, పీఏసీఎస్ చైర్మన్ సౌళ్ల నరేశ్, జిల్లా వక్ఫ్బోర్టు సభ్యులు సయ్యద్ ఆసిఫ్, సర్పంచులు బండారి లహరికమురళి, పులిశెట్టి మల్లేశం, పీఏసీఎస్ డైరెక్టర్ దండవేని గంగమల్లయ్య, నాయకులు బండి సుధాకర్గౌడ్ ఉన్నారు.