కరీంనగర్ రూరల్, జూన్ 15: సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తున్న తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గురువారం కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్లో పల్లె ప్రగతి దినోత్సవానికి ఎమ్మెల్యే రసమయితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు గ్రామంలోని మహిళలు బతుకమ్మలతో కొత్త చెరువు క్రీడా ప్రాంగణం నుంచి ప్రాథమికోన్నత పాఠశాల దాకా బతుకమ్మలతో తీసిన ర్యాలీలో మంత్రి గంగుల, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. ముందుగా సర్పంచ్ దబ్బెట రమణారెడ్డి గ్రామ పల్లె ప్రగతి నివేదిక చదివి వినిపించారు. అనంతరం మంత్రి గంగుల మాట్లాడారు.
ఒకప్పుడు మన రాష్ట్రంలో పల్లెలు ఎట్లుండే..? ఇప్పుడెలా అభివృద్ధి చెందా యో కండ్ల ముందే కనిపిస్తున్నాయని చెప్పారు. ఇంత బృహత్తర పల్లె ప్రగతి కార్యక్రమంతోనే సాధ్యమైందని, పల్లెలు అద్భుతంగా అభివృద్ధి చెందాయని వివరించారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ పక్కాగా చేపడుతున్నారని, చెత్తను బయట పడేయకుండా ప్రజల్లో చైతన్యం తెచ్చారన్నారు. ఇం కా హరితహారం మొక్కల సంరక్షణ, చెత్త తరలింపునకు ట్రాక్టర్లు, ట్రాలీలను వినియోగిస్తున్నట్లు వివరించారు. ఎరువుల తయారీకి సెగ్రిగేషన్ షెడ్లు, చివరి మజిలీకి సకల వసతులతో వైకుంఠధామాలు నిర్మించారని, ఇలా లెక్కకు మించిన అభివృద్ధి పనులతో గ్రామాలకు కొత్త రూపు తెచ్చినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు మెరుగు పడ్డాయని, ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యంతో పాటు ఇంటర్నల్ రోడ్డు వేశామని, గ్రామీణా జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు.
పల్లెలు పట్టణాలుగా అభివృద్ధి చెందినప్పుడే, పట్టణాలు స్మాట్ సిటీలుగా అభివృద్ధి సాధిస్తాయని తెలిపారు. సమైక్య పాలనలో ఆంధ్రపాలకులు తెలంగాణపై విషం చిమ్మారని, పూర్తిగా వివక్ష చూపారన్నారు. కరెంట్ కోతలు, సాగునీటి తిప్పలతో తెలంగాణ భూములు బీళ్లుగా మారాయని గుర్తు చేశారు. తలాపునే గోదావరి, మానేరు నదులు పారుతున్నా వ్యవసాయానికి చుక్కనీరు వాడుకోలేని దుస్థితి ఉండేదన్నారు. రైతుల వ్యవసాయం చేయాలంటే ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితులు ఉండేవని గుర్తు చేశారు. అప్పటి పాలకులు మన నీళు, నిధులు, కరెంట్, బొగ్గును దోచుకున్నారని దుయ్యబట్టారు. ఎంత మంది ము ఖ్య మంత్రులు మారినా ప్రజల బతుకులు మారలేదని, స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలోనే బతుకులు మారాయని, భరోసా దొరికిందని వివరించారు.
సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో కాళేశ్వరం ప్రాజెక్ట్ను నిర్మించి తెలంగాణను సస్యశామలం చేశారని, కాకతీయ మిషన్ కింద చెరువులకు పునర్జీవం పోసి పంటలకు పుష్కలంగా నీరందించారన్నారు. ఇం కా ముఖ్యంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తూ రైతులకు భరోసా కల్పిస్తున్నారని చెప్పారు. ఇక మిషన్ భగీరథ కింద ఇంటింటికీ శుద్ధజలం అందిస్తున్నారని వివరించారు. బీజేపీ పాలనలో గుజరాత్, కాంగ్రెస్ పాలనలోని రాజస్థాన్లో అక్కడి ప్రజలకు తాగునీరు కావాలంటే ఇప్పటికీ సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి ఉందన్నా రు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాల కోసం, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని, ఈ క్రమంలో దేశంలోనే ఆదర్శ వంతమైన రాష్ట్రంగా తెలంగాణను నిలుస్తున్నది స్పష్టం చేశారు. తెలంగాణ పల్లెలు పట్టణాలుగా అభివృద్ధి చెందాలని అన్ని వసతులు కల్పిస్తున్నామని, పెద్ద సంఖ్యలో రోడ్లు నిర్మిస్తున్నట్లు వివరించారు. మన వనరులు సంపదను దోచుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ నాయకులు మళ్లీ వస్తున్నారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాని గంగుల సూచించారు. వాళ్ల మాటలు నమ్మితే తెలంగాణను మళ్లీ గుడ్డిదీపం చేస్తారన్నారు.
మన పిల్లల భవిష్యత్ బాగుండాలంటే మనకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషిచేస్తున్న సీఎం కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఇక్కడ సర్పంచ్ దబ్బెట రమణారెడ్డి, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, తహసీల్దార్ నారాయణ, ఎంపీటీసీ బుర్ర తిరుపతి, పెండ్యాల శ్యాంసుందర్రెడ్డి, డీపీవో వీరబుచ్చయ్య, డీఆర్డీవో పీడీ శ్రీలత, భార్గవ్, ఐసీడీఎస్ సూపర్వైజర్, ఎంపీడీవో జగన్మోహన్రావు, ఆర్ఐ రజనీకాంత్, సుంకిశాల సంపత్రావు, సర్పంచ్ జక్కం నర్సయ్య, పంచాయతీ కార్యదర్శి, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కూర శ్యాంసుందర్రెడ్డి, నల్ల శ్రీనివా స్ రెడ్డి, మడికంటి మారుతి, మహేందర్, రంగారెడ్డి, దాసరి మల్లారెడ్డి ఉన్నారు.
తెలంగాణ ఉద్యమం కోసం నాడు పల్లెల్లో గజ్జెకట్టి పాటపాడాం. ఉద్యమాన్ని ఉవ్వెత్తునకు తీసుకెళ్లి రాష్ర్టాన్ని సాధించాం. ఒకనాడు పల్లెల్లో రోడ్లు అధ్వానంగా ఉండేవి. కానీ ఈ రోజు ఎంతో సుందరంగా మారాయి. ఇదంతా పట్టణ ప్రగతితోనే సాధ్యమైంది. కాంగ్రెస్ పాలనలో వృద్ధులకు రూ.200 పింఛన్ ఇస్తే, నేడు బీఆర్ఎస్ సర్కారు రూ.2016 ఇస్తున్నది. కొత్తగా ఎవరికైనా పింఛన్ ఇవ్వాలంటే ఎవరైనా చనిపోతేనే వచ్చేది. కానీ ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం అర్హులందరికీ పింఛన్లు ఇస్తున్నది. బతుకమ్మ పండుగ యేడాదికి ఒకసారి మాత్రమే వచ్చేదని, సీఎం కేసీఆర్ దయ, పల్లెప్రగతి వల్ల ఒకే సారి రెండు బతుకమ్మ, బోనాల పండుగలు వచ్చి, పల్లెపల్లెలు పండుగ చేసుకుంటున్నాయి. గ్రామాల్లో అద్భుత ప్రగతి జరిగింది.
– రసమయి బాలకిషన్, మానకొండూర్ ఎమ్మెల్యే
గతంలో గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు ఎక్కువగా ఉండేవారుకాదు. రాష్ట్రం వచ్చిన తర్వాతనే ప్రభుత్వం ఊరికో కార్యదర్శిని నియమించింది. పల్లె ప్రగతితో పల్లెలకు కొత్త రూపు వచ్చింది. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. మొక్కల సంరక్షణకు నీరు, చెత్త తరలింపు కోసం వంద శాతం గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, ట్రాలీలు ఉన్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో చేసిన అభివృద్ధితోనే దేశంలోని ఐదు గ్రామ పంచాయతీలకు ఉత్తమ పంచాయతీ అవార్డులు రావడం విశేషం. ఇదంతా పల్లెప్రగతి ఫలమే.
– ఆర్వీ కర్ణన్, కరీంనగర్ కలెక్టర్