వానకాలం సీజన్లో సిరుల పంట పడింది. ఎక్కడ చూసినా బంగారువర్ణంలో మెరిసిపోతున్నది. ఇప్పుడిప్పుడే వరి కోతలు మొదలు కాగా, కోతల వెంటే ధాన్యం కొనేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. అన్నదాత ఆరుగాలం శ్రమించి పండించిన చివరి గింజనూ కొనే లక్ష్యంతో ముందుకుసాగుతున్నది. ఈ మేరకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఉమ్మడి జిల్లా యంత్రాంగం ఇప్పటికే రంగంలోకి దిగింది. నాలుగు జిల్లాలో 19.22 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం వస్తుందని అంచనా వేసి, గ్రామాల్లోనే కొనేందుకు సన్నద్ధమైంది. మొత్తం 1250 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటికే 111 సెంటర్లు ప్రారంభించింది. అవసరాన్ని బట్టి మరిన్ని కేంద్రాలు నెలకొల్పాలని భావిస్తుండగా, కర్షకుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
ఉమ్మడి జిల్లాలో ధాన్యం దిగుబడి అంచనా. జిల్లాల వారీగా ప్రతిపాదించిన కొనుగోలు కేంద్రాలు. ఈ నెల 2వ తేదీ నాటికి ఏర్పాటైన కేంద్రాల సంఖ్య.
కరీంనగర్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గతేడాది ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తిరకాసు పెడుతూ వచ్చింది. లెవీ బియ్యం తీసుకోమంటూ రకరకాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టింది. అయినా గతేడాది వానకాలం, యాసంగి రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసింది. కేంద్రం కనికరం చూపకపోయినా సీఎం కేసీఆర్ మాత్రం రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ సారి కూడా కేంద్రం నుంచి ఆశించిన సహకారం లేకపోయినా సరే ఈ వానకాలం సీజన్లోనూ అన్నదాతలకు అండగా నిలుస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. అందులో భాగంగానే కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఉమ్మడి జిల్లాలో ఈ సారి 19,22,336 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. అందుకోసం నాలుగు జిల్లాల్లో కలిపి 1250 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఇప్పటికే 111 కొనుగోలు కేంద్రాలు మొదలు కాగా, అవసరాన్ని బట్టి మిగతా కేంద్రాలను ప్రారంభించనున్నారు.
ఇబ్బందుల్లేకుండా చర్యలు
కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వచ్చిన ధాన్యాన్ని కొనేందుకు ఒక క్రమ పద్ధతిని అనుసరించడంతోపాటు కొనుగోళ్ల ప్రక్రియ అంతా పూర్తి పారదర్శకంగా జరిగేలా చూస్తున్నారు. బయటి ధాన్యం రాకుండా చూడడంతోపాటు స్థానికంగా జరిగే వరి కోతల వివరాలను గమనిస్తున్నారు. ఆయా గ్రామాల నుంచి వచ్చే ధాన్యం, అప్పటికే కేంద్రాల వద్ద ఉన్న స్టాక్, రైతులకు తగిన విధంగా సూచనలు, ఒకేసారి ధాన్యం తెచ్చి ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు, నిబంధనల ప్రకారం ధాన్యం కేంద్రాలకు తెచ్చేలా అవగాహన కల్పించడం వంటి అంశాలపై సంబంధిత అధికారులకు కలెక్టర్లు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. దీంతోపాటు కొనుగోలు చేసిన ధాన్యం సంబంధిత రైస్మిల్లులకు కేటాయింపుతోపాటు రవాణా విషయంలో ఇబ్బందులు రాకుండా చూడాలని సూచనలు చేశారు. కేటాయించిన ధాన్యాన్ని ఆయా రైస్మిల్లర్లు వెంట వెంటనే డౌన్లోడ్ చేసుకునేందుకుగాను ఇప్పటికే పారాబాయిల్డ్, రా రైస్ మిల్లర్లతో జాయింట్ కలెక్టర్లు మీటింగ్లు పెట్టారు. కాగా, ఈ నెల రెండో వారం నుంచి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం భారీగా వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మెజారిటీ ప్రాంతాల్లో పంటలు చేతికొచ్చాయి. వారం పది రోజుల్లో పూర్తిగా కోతలకు రానున్నాయి. ఈ నేపథ్యంలో ధాన్యం ఒక్కసారిగా కొనుగోలు కేంద్రాలకు తరలి వచ్చే అవకాశమున్నది. ఆ మేరకు అధికారయంత్రాంగం సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు ఏర్పాటుచేసిన 111 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు.