Telangana Martyrs | మా అక్క ఆరె లావణ్య. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమంపై పూర్తి అవగాహన పెంచుకుంది. నేను అప్పుడు ఏడో తరగతి చదువుతున్న. ఎప్పుడూ తెలంగాణ గురించే మాట్లాడేది. ఉద్యమం గురించే చర్చిస్తుండె. పోరాటం తీవ్రంగా జరుగుతున్నా అప్పటి కేంద్రం స్పందించక పోవడంతో 2011 అక్టోబర్ 10న తన చావుతోనైనా తెలంగాణ రావాలని లెటర్ రాసి ఇంట్లోనే పురుగుల మందు తాగింది. వెంటనే దవాఖానకు తీసుకపోయినా అక్క బతకలేదు. తెలంగాణ వచ్చేదాకా అక్క త్యాగం గురించి తలుసుకొని నాన్న, నేను, అన్నయ్య చాలా బాధ పడెటోళ్లం. తెలంగాణ వచ్చిన రోజు మా కుటుంబం చానా సంబురపడ్డది. మేమే గెలిచినంత సంతోషమైంది. అక్క త్యాగం నిలిచిందని గర్వపడ్డం. సీఎం కేసీఆర్ సార్ అమరుల కుటుంబాలను కన్నబిడ్డల్లాగా చూసుకున్నడు. మాకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా, నాకు అటెండర్గా ఉద్యోగం ఇప్పిచ్చిండు. అక్క త్యాగాన్ని, సీఎం కేసీఆర్ సార్ చేసిన సాయాన్ని ఈ జీవితాంతం గుర్తుంచుకుంటం.
– ఆరె రాజ్కుమార్, అటెండర్, డీఈవో కార్యాలయం పెద్దపల్లి
తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారి కుటుంబాలకు స్వరాష్ట్రంలో సర్కారు కొండంత అండగా నిలుస్తున్నది. ఇప్పటికే రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. అంతే కాకుండా, నీళ్లు, నిధులు, నియామకాలు సాధించి అమరుల త్యాగాలు వృథా కాకుండా పాలన కొనసాగిస్తున్నది. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నది. ఉద్యమంలో తమ ఇంటి సభ్యులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తమకు స్వరాష్ట్రంలో సర్కారు ఎంతో ధైర్యాన్నిచ్చిందని, ఆగమైన కుటుంబాలను ఆదుకొని జీవితాలను నిలబెట్టిందని అమరుల కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తున్నారు.
స్వరాష్ట్రం కోసం నిప్పు కణికగా మారి.. నాన్న త్యాగం వృథా కాలే..
నాన్న తాను జీవించినంత కాలం. తెలంగాణనే ఊపిరిగా.. తెలంగాణనే శ్వాసగా బతికిండు. నాన్న మేస్త్రీ పనిచేసినా.. ఆయనకు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను పూర్తిగా ఉద్యమ సమయంలో తెలుసుకున్నడు. తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకోవడంతో తీవ్రంగా కలత చెందిండు. అమ్మను, నన్ను వదిలి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నడు. తన ప్రాణత్యాగంతోనైనా తెలంగాణ రావాలె.. ఈ ప్రజలకు, ఈ ప్రాంతానికి మేలు జరగాలని అసువులు బాసిండు. ఆయన త్యాగం, ఉద్యమ నేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, అనేక ఉద్యమాల ఫలితంగా తెలంగాణ వచ్చింది. కేసీఆర్ సార్ సీఎం అయినంక అన్ని వర్గాల ప్రజల కష్టాలను, నష్టాలను దూరం చేసిన్రు. వ్యవసాయాన్ని పండుగ చేసిన్రు. విద్య, వైద్యం, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఆయనకు ఆయనే సాటి. అందరి బాధలు తెలిసిన దేవుడు సీఎం కేసీఆర్. మా కుటుంబానికి అండగా నిలిచిన్రు. నాకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన్రు. కేసీఆర్ సార్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం ఈరోజు దేశంలోని అన్ని రాష్ర్టాలకంటే అగ్రభాగాన నిలిచింది.
– నేవూరి సంపత్, పెద్దపల్లి ఏడీఏ కార్యాలయంలో అటెండర్,
అమరుడు రాజు కుమారుడు (పెద్దపల్లి) బంగారు తెలంగాణ సాకారమైంది
కరీంనగర్, జూన్ 22(నమస్తే తెలంగాణ): ప్రత్యేక రాష్ట్రం రావడం.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణగా రూపాంతరం చెందుతున్న క్రమంలో తన అన్నగన్న కలలు సాకారమయ్యాయని అంటున్నాడు సైదాపూర్ మండలం వెన్నంపల్లికి చెందిన అమరుడు కొట్టె నరేందర్రెడ్డి సోదరుడు జితేందర్రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ వాదనలను బలపరుస్తూ ఆయనకు అభిమానిగా మారిన నరేందర్రెడ్డి, తెలంగాణ ఇవ్వడంలో కేంద్రం చేస్తున్న తాత్సారాన్ని భరించలేక తన వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు. తన తల్లి సునంద ముందు ‘అమ్మా ఇగ తెలంగాణ రాదు.. నేను తెలంగాణ కోసం చచ్చిపోతున్న’ అని విలపిస్తూ కింద పడిపోయాడు.
అప్రమత్తమైన తల్లి హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లగా నరేందర్రెడ్డి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. జేబులు వెతికిన వైద్యులకు నరేందర్రెడ్డి రాసిన లేఖ దొరికింది. అందులో తాను తెలంగాణ కోసం చనిపోతున్నానని, తన అంత్యక్రియలకు కేటీఆర్ రావాలని కోరికగా ఉందని రాసుకున్నాడు. విషయం తెలుసుకున్న కేటీఆర్ నరేందర్రెడ్డి అంత్యక్రియలకు హాజరై ఆయన చివరి కోరిక తీర్చారు. 2010 నవంబర్ 12న తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న నరేందర్రెడ్డి ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఆయన కుటుంబానికి అండగా నిలబడింది. తెలంగాణ వచ్చిన మొదటి ఏడాది రూ.10 లక్షల ఆర్థికసాయం చేసింది. అంతే కాకుండా, అతని తమ్ముడు జితేందర్రెడ్డికి రెవెన్యూ శాఖలో టైపిస్టుగా ఉద్యోగం ఇచ్చి గౌవరవించింది. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు నిర్వహిస్తున్న ప్రస్తుత తరుణంలో జితేందర్రెడ్డి స్పందిస్తూ తన అన్నగన్న కలలను సీఎం కేసీఆర్ నెరవేర్చుతున్నారని తెలిపారు. తెలంగాణ వస్తే తనలాంటి ఎందరో యువకులకు ఉద్యోగాలు వస్తాయని, నీళ్లలో మన వాటా మనకు ఉంటుందని తన అన్న చెబుతుండే వాడని, ఇప్పుడు అదే నిజమై బంగారు తెలంగాణ ఆవిష్కృతమవుతున్నదని స్పష్టం చేశారు.
“కేసీఆర్ సార్ మా దేవుడు.. మాలాంటి అమరవీరుల కుటుంబాలకు కొండంతా ఈ సర్కారు అండగ ఉంటున్నది. నాకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. రూ.10 లక్షల సాయం చేసింది.” అని చెబుతున్నది ఆగుళ్ల వీరస్వామి భార్య విజయ. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అమరుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆమె వివరించింది.
– జగిత్యాల, జూన్ 22
“తెలంగాణ ఉద్యమమప్పుడు జరిగిన ధర్నాలు, రాస్తారోకోల్లో నా భర్త చురుగ్గా పాల్గొనేది. అప్పటి కేంద్ర ప్రభుత్వం మొదట తెలంగాణ రాష్ర్టాన్ని ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి వెళ్లిపోయే సరికి చాలా మదనపడ్డడు. వచ్చిన తెలంగాణ వెనక్కి పాయె.. ఈ తెలంగాణ ద్రోహులు రాష్ర్టాన్ని అడ్డుకుంటున్నరని బాధపడ్డడు. ఉద్యమం బాగా జరిగినప్పుడు తన చావుతోనైనా తెలంగాణ వస్తదని 2010 మార్చి 2న జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ల బావి వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకున్నడు. నిప్పంటించుకుని ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేసిండు. చుట్టు పక్కల ఉన్నోళ్లు జగిత్యాల ఏరియా దవాఖానకు తీసుకెళ్లిన్రు. తెల్లారే చనిపోయిండు. దీంతో జగిత్యాల ప్రాంతమంతా అట్టుడికి పోయింది. ఆయన మృతదేహంతో జగిత్యాల ర్యాలీలు తీసిన్రు. కొన్ని రోజుల తర్వాత నేను జగిత్యాల మున్సిపల్ల కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేసిన. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక జగిత్యాల మండలంలోని ధరూర్ ప్రభుత్వ పాఠశాలలో సబ్స్టాఫ్గా ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. సర్కారు ఇచ్చిన రూ.10 లక్షల సాయంతో ఇంటి స్థలం కొనుక్కున్న. ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటున్న. బిడ్డ లహరికది పదో తరగతి పూర్తయింది. భవేశ్ 9వ తరగతి చదువుతున్నడు. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ పథకాలతో పేద, మద్య తరగతి కుటుంబాలు ఎంతో బాగు పడుతున్నయ్. ఎన్నో కుటుంబాలకు అండగా ఉంటున్న కేసీఆర్ ప్రభుత్వం మరిన్ని కాలాల పాటు పనిచేయాలి.
జగిత్యాల రూరల్, జూన్ 22 : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని తన అక్క కలగనేదని, ఆమె కల నెరవేరిందని చెబుతున్నాడు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్కు చెందిన పన్నాల రమ్య సోదరుడు రంజిత్రెడ్డి. తన అక్క ఉద్యమంలో ఎలా పాల్గొనేదో, స్వరాష్ట్రంలో తన కుటుంబాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఆదుకున్నదో వివరించాడు. “మా అమ్మా నాన్న పన్నాల గంగవ్వ, రెడ్డి. వారికి మేమిద్దరం సంతానం. మా చిన్న వయస్సులోనే అమ్మానాన్నలు మరణించారు. అప్పటి నుంచి మమ్మల్ని బాబాయ్ పన్నాల అనంతరెడ్డి పెంచాడు.
ఇంటర్ చదువుతున్నప్పుడు మా అక్క రమ్య తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేది. కాలేజీ వదిలి రాస్తారోకోలకు వెళ్లేది. అలాంటి సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇస్తదో లేదో అని మదనపడేది. అప్పటికే అమరులైన శ్రీకాంతా చారి మరణాన్ని తన స్నేహితుల వద్ద ప్రస్తావించేది. తన మరణంతోనైనా తెలంగాణ రాష్ట్రం వస్తదని, ఇక ఇక్కడి యువకులకు ఉద్యోగాలు వస్తాయని 2010 మార్చి 6వ తేదీన బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అక్క కలగన్నట్టే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇక్కడి ఉద్యోగాలు మన యువతకే వస్తున్నాయి. నాకు ప్రభుత్వం ఇచ్చిన రూ.10 లక్షలతో వ్యవసాయ భూమి కొన్నా. నాకు జిల్లా పోలీస్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇచ్చింది. పెళ్లి చేసుకున్నా. ఆమె పేరు కూడా రమ్యనే. మాకు ఇద్దరు కవల పిల్లలు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు న్యాయం జరుగుతున్నది.”