జమ్మికుంట, నవంబర్ 9: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు శుక్రవారం జమ్మికుంటకు రానున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా జమ్మికుంట పట్టణానికి హెలీకాప్టర్లో చేరుకుంటారు. నాయిని చెరువు వద్దగల హెలీప్యాడ్లో దిగనున్నారు. మంత్రి హరీశ్రావుకు బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి 50వేల మందితో అపూర్వ స్వాగతం పలికేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అందుకు అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు భారీ ఏర్పాటు చేస్తున్నారు. కౌశిక్రెడ్డితో పాటు.. నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి పెద్దిరెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి ‘ప్రజా ఆశీర్వాద ర్యాలీ’ రోడ్ షోలో హరీశ్రావు పాల్గొననున్నారు. రోడ్ షో స్థానిక తెలంగాణ చౌక్ వరకు సాగనుంది. అనంతరం అమాత్యుడు తెలంగాణ చౌక్ వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. తర్వాత పాడి కౌశిక్రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు.
మంత్రి హరీశ్రావు జమ్మికుంటకు రానున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు భారీ ఎత్తున స్వచ్ఛందంగా తరలిరానున్నారు. ముఖ్యంగా యువత ద్విచక్ర వాహనాలపై నేటి ఉదయం పట్టణానికి చేరుకోనున్నారు. హుజూరాబాద్ సిటీ సెంట్రల్ హాల్ నుంచి, ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నుంచి, వీణవంక, కమలాపూర్ మండల కేంద్రాల నుంచి, అలాగే జమ్మికుంట పట్టణం.. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన శ్రేణులు, యువత ఎవరికి వారే జమ్మికుంటకు రానున్నారు. మంత్రి హరీశ్రావుకు ఘన స్వాగతం పలుకనున్నారు. ప్రజా ఆశీర్వాద ర్యాలీలో పాల్గొననున్నారు. అమాత్యుడి రోడ్షోకు కనీవిని ఎరుగని తరహాలో ఏర్పాట్లు సాగుతున్నాయి.
అమాత్యుడు హరీశన్నతో ఇక్కడి బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలకు గతంలో అనుబంధం ఉంది. గత ఉప ఎన్నికల్లో హరీశ్రావు ఇక్కడ ఇన్చార్జిగా పనిచేశారు. ఇక్కడి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలను గుర్తుకు పెట్టుకుని పేరు పెట్టి పిలిచే చనువు ఉంది. అప్పటి ఉప ఎన్నికల సమయంలో అన్ని వర్గాలను సమన్వయం చేశారు. సమ్మేళనాలు నిర్వహించారు. నేరుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా సదరు శ్రేణులు, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇక మరోసారి అసెంబ్లీ ఎన్నికల సమయంలో జమ్మికుంటకు వస్తున్నారని, రోడ్ షోలో పాల్గొననున్నారని సమాచారం తెలుసుకున్న సబ్బండ వర్గాలు తరలివస్తున్నాయి.
బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి శుక్రవారం హుజూరాబాద్లో నామినేషన్ వేయనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి నామినేషన్ వేసేందుకు వచ్చే సమయంలో పాడి కౌశిక్రెడ్డి తల్లిదండ్రులు పాడి శైలజ-సాయినాథ్రెడ్డి ఆశీర్వాదం తీసుకోనున్నారు. సతీమణి శాలినీరెడ్డి మంగళహారతి పట్టనున్నారు. నేరుగా హుజూరాబాద్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12గంటల తర్వాత స్థానిక నాయకులు కొందరితో కలిసి సాదాసీదాగా నామినేషన్ సెట్లను వేయనున్నారు. నామినేషన్ ఘట్టం పూర్తైన వెంటనే అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలతో కలిసి ద్విచక్ర వాహనంపై జమ్మికుంటకు చేరుకుంటారు. మంత్రి హరీశ్రావుతో కలిసి ‘ప్రజా ఆశీర్వాద ర్యాలీ’ రోడ్ షో పాల్గొంటారు.