శంకరపట్నం, డిసెంబర్ 4: దళితబంధు పథకం ద్వారా సీఎం కేసీఆర్ దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండలంలోని కేశవపట్నం, గొల్లపల్లి, కొత్తగట్టు, కల్వల గ్రామాల్లో ఆదివారం ఆయన కొత్త రేషన్ దుకాణాలను ప్రారంభించారు. కల్వల గ్రామంలో సర్పంచ్ దాసారపు భద్రయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ను ఎవరూ అడగకపోయినా దళితబంధు పథకం తెచ్చి దళితుల బతుకులు మార్చడానికి కంకణం కట్టుకున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ వచ్చాకే ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ విజ్ఞానవంతులు కావాలన్నదే అంబేద్కర్ ఆశయమని గుర్తించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సర్కారు అన్ని వర్గాల ప్రజలకు అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను గుర్తు చేయడానికే తాను ఊరూరా అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 67 గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించినట్లు వెల్లడించారు. అర్హులందరికీ దళితబంధు వస్తుందని తెలిపారు.
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న మతోన్మాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. తాను తీసిన రుద్రంగి చిత్రంలో దళితుల త్యాగాలు ప్రతిబింభించేలా చిత్రీకరించినట్లు వెల్లడించారు. అనంతరం గ్రామస్తులకు పాడి ఉదయ్నందన్రెడ్డి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా సాంస్కృతిక సారథి కళాకారులు పాడిన పాటలు అలరించాయి.
కార్యక్రమంలో ఎంపీపీ ఉమ్మెంతల సరోజన, జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్రావు, వైస్ ఎంపీపీ పులికోట రమేశ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు సంజీవరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, సర్పంచులు దాసారపు భద్రయ్య, ఉడిగె రజిత, మాజీ జడ్పీటీసీ దాసారపు ప్రభాకర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ మండలలాధ్యక్షుడు గంట మహిపాల్, నాయకుడు అమృత ప్రభాకర్, అంబేద్కర్ సంఘాల జిల్లా, మండల నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.