కంఠేశ్వర్, ఆగస్టు 7 : సమీక్షా సమావేశానికి ఆలస్యంగా వచ్చిన తహసీల్దార్లకు ఇన్చార్జి కలెక్టర్ భవేష్ మిశ్రా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లోని ప్రధాన సమీక్ష మందిరంలో ఫిర్యాదుల పరిష్కారం, ఇతర రెవెన్యూ అంశాలపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. నిర్ణీత సమయానికి కలెక్టర్ సమావేశ మందిరానికి చేరుకోగా, పలు మండలాల తహసీల్దార్లు గైర్హాజరుకావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిఒక్కరూ విధిగా సమయపాలన పాటించాలని కలెక్టర్ సూచించారు.
భూభారతి, సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో మండలం వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, వాటి పరిష్కారంలో జాప్యానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నెలాఖరులోపు అన్నింటిని పరిష్కరించాలని కలెక్టర్ గడువు విధించారు. దరఖాస్తుల ధ్రువీకరణ ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని సూచించారు. జిల్లాస్థాయిలో నిర్వహించే ప్రజావాణితో పాటు రాష్ట్రస్థాయిలో నిర్వహించే సీఎం ప్రజావాణి ద్వారా వచ్చిన ఆర్జీల పరిష్కారం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. వెంటాదివెంట ఆర్జీలను పరిష్కరిస్తూ, వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. పై అంశాలకు సంబంధించి నిర్ణీత నమూనాలో రోజువారీగా తనకు వివరాలు పంపాలని ఆదేశించారు.
ఫ్యామిలీ రిజిస్ట్రర్ సర్టిఫికెట్ కోసం వచ్చిన దరఖాస్తులను కూడా సత్వరమే పరిశీలిస్తూ పరిష్కరించాలన్నారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకుని ఈనెల 17 లోగా అన్ని ఎఫ్ఆర్సీ దరఖాస్తులు పరిష్కారమయ్యేలా చూడాలని కలెక్టర్ సూచించారు. కస్టం మిల్లింగ్ కోసం లేవీ ధాన్యం కేటాయించిన రైస్మిల్లులను ప్రతిపక్షం రోజులకొకసారైనా తప్పనిసరిగా సందర్శిస్తూ ధాన్యం నిల్వలను పరిశీలించాలని తహసీల్దార్లను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, ఆర్మూర్ సబ్కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, డీఆర్వో గీత, నిజామాబాద్, బోధన్ ఆర్డీవోలు రాజేంద్రకుమార్, విజయకుమారి, ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.