ఆగ్రా, ఆగస్టు 7: బీజేపీ పాలిత ఉత్తర్ ప్రదేశ్లోని ఆగ్రాలో కుంగిపోయిన రోడ్డు వినూత్న నిరసనకు దారితీసింది. బీజేపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న వికాస్(అభివృద్ధి)ను కొలిచేందుకు సమాజ్వాదీ పార్టీ నాయకుడు నితిన్ కోహ్లీ ఆ భారీ గుంతలోకి నిచ్చెన సాయంతో దిగారు. కొత్తగా ప్రారంభించిన కాన్పూర్-లక్నో ఎక్స్ప్రెస్వేలో అనేక చోట్ట పగుళ్లు ఏర్పడి కొన్ని చోట్ల రోడ్డు కుంగిపోయిన ఘటన జరిగిన కొన్ని రోజులకే రాష్ట్రంలో రోడ్డు మౌలిక సదుపాయాల నాణ్యతపై ప్రశ్నలు పెరుగుతున్న తరుణంలో ఈ నాటకీయ దృశ్యం చోటుచేసుకుంది. ఆగ్రాలోని కమలా నగర్కు చెందిన కర్మయోగి కాలనీలో రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. హఠాత్తుగా రోడ్డు కూలిపోయి పెద్ద గుంత ఏర్పడింది.
సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్న వీడియోలో ఇద్దరు వ్యక్తులు నిచ్చెనను పట్టుకుని ఉండగా కోహ్లీ ఆ గోతిలోకి దిగడం కనిపిస్తుంది. ఆ గోతిలో నిలబడి అభివృద్ధి అంటే ఇలాగే ఉంటుందా? రోడ్డు వేసిన చోటల్లా గుంతలే కనిపిస్తున్నాయి అని అంటూ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న అభివృద్ధి ప్రచారాన్ని ఎద్దేవా చేశారు. తాజ్ సిటీగా ప్రసిద్ధి చెందిన ఆగ్రాను గడ్డా నగరి(గుంతల నగరం)గా మార్చివేశారంటూ ఆయన పేర్కొన్నారు. కాగా, స్థానికులు ఆ భారీ గోతిని పాతాళానికి దారిగా అభివర్ణించారు. నగర మౌలిక సదుపాయాల్లో ఉన్న స్పష్టమైన లోపాలను వర్షాలు బయటపెట్టాయని, నిర్మాణ నాణ్యత లోపమే ఈ రోడ్డు కూలిపోవడానికి కారణమని వారు ఆరోపించారు.