హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారం ఇంటర్విద్యను షేక్ చేస్తున్నది. ఇప్పటికే ఫేక్ ఫైర్ ఎన్వోసీల వ్యవహారం ఇంటర్విద్యలో ప్రకంపనలు సృష్టిస్తుండగా, తాజాగా ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగుచూసింది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 37 మంది జూనియర్ లెక్చరర్లు ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నట్టు ఇంటర్ విద్యాశాఖ తేల్చింది. ఆయా లెక్చరర్లపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమమయ్యింది. శుక్రవారం 37 మంది జేఎల్స్కు ఇంటర్ విద్యాశాఖ ఆర్జేడీ షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా ఆయా నోటీసుల్లో స్పష్టంచేసింది. సమాధానాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని, వివరణ ఇవ్వకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నది.
ఇంటర్ విద్యలో కాంట్రాక్ట్ లెక్చరర్లను కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నియమించారు. ఆ తర్వాత ఈ లెక్చరర్లను కేసీఆర్ సర్కార్ క్రమబద్ధీకరించింది. పలువురు లెక్చరర్లు ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించినట్టు ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ విద్యాశాఖ పలుమార్లు సర్టిఫికెట్ల పరిశీలన జరిపింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం చేస్తున్నప్పుడే నకిలీ సర్టిఫికెట్లుగా తేలడంపై సుమారు 20 మందిపై వేటుపడింది. రెగ్యులరైజేషన్ క్రమంలోనూ మరో 20 మందిని తొలగించారు. కొంతకాలం క్రితం హైదరాబాద్లో పనిచేస్తున్న ఓ మహిళా లెక్చరర్ను సైతం ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు.
ఇతర రాష్ర్టాలకు చెందిన యూనివర్సిటీల నుంచి జారీ అయిన సర్టిఫికెట్లపైన అనుమానాలు వ్యక్తమయ్యాయి. 360 మంది లెక్చరర్ల సర్టిఫికెట్లను అధికారులు పునఃపరిశీలించారు. సంబంధిత యూనివర్సిటీలకు పంపించి అసలువా..? నకిలీవా..? అన్నది ఆరా తీశారు. ఇటీవలే యూనివర్సిటీల నుంచి సమాధానం రావడం, ఫేక్ అని తేలడంతో చర్యలకు ఉపక్రమించారు. ప్రస్తుతం 37మందివి ఫేక్ సర్టిఫికెట్లుగా తేల్చి నోటీసులు పంపించారు. మరో మూడు యూనివర్సిటీల నుంచి వివరాలు అందలేదు. ఈ వివరాలు అందగానే మరికొన్ని నకిలీ సర్టిఫికెట్లు తేలే అవకాశమున్నదన్న ప్రచారం జరుగుతున్నది.