ప్రజల ముంగిటకి పాలనను తీసుకువచ్చి, వారిని అందులో భాగస్వామ్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం సంపూర్ణంగా విజయవంతమైంది. సగటున 40 లక్షల జనాభాతో అప్పటి వరకు కొనసాగిన పెద్ద జిల్లాల వల్ల దశాబ్దాల కాలంగా ఇబ్బందులుపడ్డ ప్రజానీకం తమకు అతి సమీపంలో జిల్లా కేంద్రాల ఏర్పాటుతో విద్య, వైద్యం, వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధి ప్రస్ఫుటం అవుతోంది. స్వరాష్ట్రంలో స్వపాలనలో దాదాపు ఆరేళ్ల క్రితం 18 మండలాలతో అవతరించిన జగిత్యాల జిల్లా నేడు తెలంగాణ రాష్ట్ర యవనికపై తన ప్రత్యేకతను చాటుకుంటోంది. పాలనను చేరువ చేసిన సీఎం కేసీఆర్ దార్శనికతకు జిల్లా ప్రజానీకం సలాం కొడుతున్నది.
జగిత్యాల, డిసెంబర్ 4(నమస్తే తెలంగాణ) : జగిత్యాల జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఆరేళ్లలో గణనీయమైన అభివృద్ధి సాధించింది. అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. ఇప్పటి వరకు జిల్లా వాసులందరిదీ ఒకే మాట.. ‘మన సమస్యలు గట్టెక్కాయి..’ సామాన్య జనం మొదలు కొని, మేధావుల వరకు అందరిలోనే ఇదే అభిప్రాయం.. కేవలం 9.80 లక్షల జనాభాతో 2.70 గృహాలతో అవతరించిన జగిత్యాల జిల్లా పరిపాలన విషయంలో గొప్ప మార్కును చూపించింది.
సకల సౌకర్యాలు, అందుబాటులోకి వచ్చిన ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాలయాలు, వైద్యశాలలతో జిల్లా వాసుల సమస్యలు సులువుగా పరిష్కారమవుతున్నాయి. తక్కువ జనాభా, తక్కువ కుటుంబాలు, అందుబాటులో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు ఉండడంతో సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికీ అందేలా చర్యలు తీసుకోవడం సునాయాసమైంది. దూర భారం లేకుండా, సమయం వృథా కాకుండా, పకడ్బందీగా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో దిగువ స్థాయి సిబ్బంది వేగంగా పనులు చేసే అవకాశాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు పాలనలో ప్రజలను సైతం భాగస్వామ్యం చేసే పరిస్థితి నెలకొన్నది. జిల్లాల ఏర్పాటు అంశంపై అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లా కేంద్రంగా అవతరించిన తర్వాత జగిత్యాలలో అభివృద్ధి వెలుగులు విరజిమ్ముతున్నాయి. అన్ని రంగాల్లో జగిత్యాల పురోగమిస్తోంది. ఎస్సారెస్పీ రివర్స్ పంపింగ్ ప్రాజెక్టు, దానికి తూముల ఏర్పాటుతో జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే అన్నం గిన్నెగా పేరుగాంచింది. వరుసగా నాలుగేండ్లుగా జగిత్యాల వరి దిగుబడిలో రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలుస్తూ వస్తోంది. సాగు విస్తీర్ణం గతం కంటే దాదాపు లక్ష ఎకరాలకు పైగా పెరిగింది. వరి పెరగడంతో జిల్లాలో రైస్మిల్లు పరిశ్రమ అభివృద్ధిలోకి వచ్చింది. ఇక జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీల్లో దాదాపు రూ.300 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి.
రాయికల్, ధర్మపురి గ్రామ పంచాయతీలు కొత్త మున్సిపాలిటీలుగా మారడంతోపాటు, వాటి అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరై పనులు జరుగుతున్నాయి. వందలాది డబుల్బెడ్ రూం ఇండ్లు నిరుపేదలకు అందాయి. జగిత్యాలకు మెడికల్ కాలేజీతోపాటు, సూపర్ స్పెషాలిటీ దవాఖాన మంజూరు కావడమే కాకుండా సేవలందించడం మొదలైంది. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి పట్టణాల్లో దాదాపు రోజుకు 150 మందికి డయాలసిస్ జరిగేలా కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
బస్తీ, పల్లె దవాఖానలు ఏర్పాటై గ్రామీణ ప్రాంతాలకు వైద్యం చేరువైంది. ఇక కథలాపూర్లో సూరమ్మ రిజర్వాయర్, బీర్పూర్ మండలంలో రోళ్లవాగు ప్రాజెక్టు రూ.వందల కోట్లతో నిర్మాణమవుతున్నాయి. వందలాది విద్యాలయాలు, మైనారిటీ, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభమయ్యాయి. 25 ఎకరాల్లో రూ.వంద కోట్ల వ్యయంతో జిల్లా కలెక్టరేట్తో పాటు, కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్, తదితర అధికారుల నివాస గృహాల నిర్మాణం పూర్తయింది. సమీకృత మార్కెట్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇలా అనేక రంగాల్లో జగిత్యాల జిల్లా శరవేగంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది.
ధాన్యం పండించడంలో జిల్లా ముందంజలో ఉన్నది. దీని కోసం ఈ ప్రాంతంలో రైసుమిల్లులు అధికంగా ఏర్పాటు కావాల్సి ఉండగా, అవి జరిగాయి. గతంలో జిల్లా కేంద్రం కరీంనగర్ కావడంతో ప్రభుత్వ అధికారులు ఎక్కువ శాతం లోకల్ రైస్మిల్లర్లకు అవకాశం ఇవ్వడంతో దూర ప్రాంత రైస్మిల్లర్లకు ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇప్పుడు ఆ సమస్య తీరింది. ఇక్కడి పంటలు ఎక్కువ శాతం వరి కావడంతో సుల్తానాబాద్, మానకొండూర్ ప్రాంతాలకు ధాన్యం సరఫరా జరిగేది. జిల్లా కేంద్రంలో డీసీఎస్వో(పౌరసరఫరాల శాఖ కార్యాలయం) అవడంతో ఈ ప్రాంతంలోని ధాన్యం సేకరణ విషయంలో అందరికీ న్యాయం జరిగింది. ప్రభుత్వం ఎఫ్సీఐ గోడౌన్లను పెంచింది. దాదాపు యాభై వరకు కొత్త రైస్మిల్లులు ఏర్పాటయ్యాయి. దీనివల్ల రైతులకు మద్దతు లభిస్తోంది.
– బట్టు ప్రవీణ్, జగిత్యాల రైస్మిల్ యజమాని
జిల్లా ఏర్పడడంతో ప్రజల సమస్యలు తొందరగా పరిష్కరించే అవకాశం ఏర్పడింది. గతంలో ఇబ్రహీంపట్నం, మెట్పల్లి వంటి ప్రాంతాలకు జిల్లా కేంద్రం దూరం గా ఉండడంతో వ్యాపారులకు ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు అవి తొలగిపోయాయి. వ్యాపారులకు కొన్ని రకాల లైసెన్సు ల జారీ విషయంలో కరీంనగర్ కేంద్రం కావడంతో అక్కడికే వెళ్ళాల్సి వచ్చేది. అన్ని రకాల ప్రభుత్వ కార్యా లయాలు జగిత్యాలలో ఏర్పాటు కావ డంతో సులభ మవుతున్నది. జగిత్యాల-నిజామాబాద్ రైల్వే లైను పూర్తవడంతో ఇక్కడి పంట దిగుబడులు ఇతర ప్రాం తాలకు ఎగుమతి చేసే వీలు ఏర్పడింది. మెట్రో పాలిట న్ నగరాలతో సంబంధాలు కలిసే అవకాశం ఉండడం తో వ్యాపారులకు లాభాదాయకంగా మారింది.
– గోలి శ్రీనివాస్, జగిత్యాల మున్సిపల్ వైస్ చైర్మన్
జగిత్యాలకు ఘన వైభవం వచ్చింది. ఒకప్పుడు కరీంనగర్ కంటే జగిత్యాల అభివృద్ధిలో ముందుండేది. ఎస్సారెస్పీ కార్యాలయాలు, పరిశోధన స్థానం, వాలంతరీ, ముంబాయితో నేరుగా వస్త్ర వ్యాపారం జరిగేది. జిల్లా కేంద్రం కరీంనగర్ కావడంతో కాలక్రమంలో జగిత్యాలలో అభివృద్ధి మందగించింది. కరీంనగర్లో విద్య, వైద్యం, వ్యాపార, ఇతర అంశాలు వేగంగా అభివృద్ధి చెందాయి. దీనికి తోడు 40 లక్షల జనాభాకు ఒకే జిల్లా కావడంతో పరిపాలన సైతం వికేంద్రీకరించబడలేదు. ప్రజలకు దూరభారం, వ్యయ భారం పెరిగింది. పథకాల సక్రమంగా అమలు చేయలేని పరిస్థితి ఉండేది. దీనికి త్వరగా పనులు చేయించుకోవాలన్న తపన చివరకు లంచగొండితనానికి దారి తీసింది.
ఈ రుగ్మతలన్నింటినీ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన జగిత్యాల జిల్లా రూపు మాపింది. ప్రతి పథకం సక్రమంగా అమలు జరిగింది. ఉన్నతాధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రతి ఒక్క కుటుంబంపై దృష్టి కేంద్రీకరించబడింది. ఉద్యోగ, ఉపాధి రంగాలు విస్తరించాయి. విద్య, వైద్య రంగాలతో పాటు, రవాణా, సాగునీటి రంగాల్లో జగిత్యాల చిరస్మరణీయమైన విజయాలను ఆరేళ్ల వ్యవధిలో సాధించింది. జవాబుదారీతనంతో కూడిన పాలన ఏర్పాటు కావడం జిల్లాకు వరంగా మారింది. మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ దవాఖాన, ప్రతి వైద్యశాలలో ప్రభుత్వ వైద్యులు ఇలా అనేక సౌకర్యాలు సమకూర్చుకున్నాం. అరవై ఏండ్లలో జరగని అభివృద్ధి జగిత్యాలలో ఈ ఆరేళ్ల వ్యవధిలో జరిగింది. జగిత్యాల ప్రజలు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారు.
– జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్కుమార్
ప్రభుత్వానికి వినతులు ఇవ్వకున్నా సీఎం కేసీఆర్ జగిత్యాల ప్రాంతాన్ని గుర్తించి జిల్లాను చేశారు. ఈ ఆరేండ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి రాష్ట్రంలోనే నంబర్వన్ స్థానంలో నిలిచింది. రాబోయే ఐదేండ్ల్లలో జగిత్యాల గొప్ప నగరంగా మారే అవకాశాలున్నాయి. వ్యవసాయ రంగంతోపాటు, వ్యాపార, వాణిజ్య రంగాల్లో మంచి అభివృద్ధి జరుగుతున్నది. కరీంనగర్ కంటే జగిత్యాల మరింత ముందుకు వెళ్లే స్పష్టంగా కనిపిస్తున్నాయి.
– పెద్ది శ్రీనివాస్, జగిత్యాల చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి
జగిత్యాల కేంద్రం కావడంతో బట్టల వ్యాపారం మెరుగైంది. చుట్టు పక్కల గ్రామాలతోపాటు, ఇతర జిల్లాల నుంచి బట్టలు కొనడానికి ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల ప్రజలు గోదావరినదిపై బాదన్కుర్తి, కమ్మూనూర్ బ్రిడ్జిల మీదుగా వాణిజ్య అవసరాల కోసం వస్తున్నారు. జిల్లా కేంద్రంతో 18 మండలాల ప్రజలకు పరిపాలనా పరంగా మెరుగైన సేవలు అందుతున్నాయి. ముఖ్యంగా జిల్లాకు రవాణా సౌకర్యం మెరుగైంది.
– ఆకుబత్తిని శ్రీనివాస్. జగిత్యాల పద్శశాలి సేవా సంఘం అధ్యక్షుడు
వ్యాపార రంగంలో ఎక్కువ శాతం వైశ్య సామాజిక వర్గం వారు ఉన్నారు. జిల్లా కేంద్రమైన తర్వాత జిల్లాలోని అన్ని ముఖ్య పట్టణాలు, గ్రామాల నుంచి జగిత్యాలకు రవాణా సౌకర్యం మెరుగు పడింది. బోర్నపెల్లి వంతెనతో నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలతో సంబంధం పెరిగింది. అంతేకాకుండా పాలనాపరంగా ప్రజలకు అధికారులు అందుబాటులో ఉన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ కోసమే జిల్లాలు ఏర్పాటు చేయడంతో ప్రజలకు మేలు జరిగింది.
– బొడ్ల రాజు, కౌన్సిలర్
జగిత్యాల జిల్లా కావడంతో చుట్టు పక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. నూతనంగా ఏర్పాటయ్యే కాలనీల్లో లే ఆవుట్ల ప్రకారం ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఉంటున్నాయి. అలాగే, ఇప్పటికే అభివృద్ధి చెందిన పట్టణంగా ఉన్న జగిత్యాలలో మాస్టర్ప్లాన్ను అమలు చేసి రోడ్లను వెడల్పు చేయాలి. జిల్లా కేంద్రం దగ్గర కావడంతో కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి ప్రాంతాల వ్యాపారులకు లైసెన్సులు సులభతరం అవుతున్నాయి. కేంద్రం జీఎస్టీ బిల్లును అమలు చేస్తున్న తరుణంలో జగిత్యాల జిల్లా ఏర్పడడం కావ డం అందరికీ మేలు జరిగుతున్నది. – బద్రి నరేశ్, టాక్స్ కన్సల్టెంట్, జగిత్యాల