తెలంగాణచౌక్, ఆగస్టు 28 : రాఖీ పండుగ సందర్భంగా మహిళా ప్రయాణాలకు ఎలాంటి ఇబ్బందిరాకుండా ఆర్టీసీ ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా ప్రత్యేక బస్సులు నడుపనున్నది. ఈ నెల 31న పండుగ కాగా, ఈ నెల 29 నుంచి 31 వరకు సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్ డిపోల నుంచి హైదరాబాద్లోని జూబ్లీ బస్స్టేషన్ వరకు 217, అలాగే 31 తేదీ నుంచి 4వ తేదీ వరకు జూబ్లీ బస్స్టేషన్ నుంచి సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్ వరకు 181 బస్సులు నడిపించనున్నారు. అయితే, ప్రయాణికుల నుంచి ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదు.
బస్టాండ్లోప్రత్యేక స్టాళ్ల ఏర్పాటుకు అవకాశం
ఆర్టీసీ బస్టాండ్లలో రాఖీలు, వినాయ విగ్రహాలను విక్రయించేందుకు వ్యాపారులు, స్వశక్తి గ్రూప్ మహిళలు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసుకునేందుకు ఆర్టీసీ అధికారులు అవకాశం కల్పించారు. రీజియన్ పరిధిలోని అన్ని బస్టాండ్లలో స్టాళ్ల ఏర్పాటు కోసం తాత్కాలిక పద్ధతిపై అద్దెకు ఇవ్వనున్నారు. ఇక్కడ మట్టి వినాయక విగ్రహాలు మాత్రమే విక్రయించేలా ఒప్పందం చేసుకోనున్నారు. ఆసక్తి గల వారు స్థానికి డిపో మేనేజరును కలిసి వివరాలు అందజేయాల్సి ఉంటుంది.
టీ9-60, టీ9-30 టికెట్లు తాత్కాలికంగా రద్దు
ప్రత్యేక రాయితీతో ఆర్టీసీ జారీ చేసిన టీ9-60, టీ9-30 టికెట్లను తాత్కాలికంగా రద్దు చేశారు. రాఖీ పౌర్ణమి రద్దీ దృష్ట్యా టికెట్ జారీ చేయడంలో ఉన్న ఇబ్బందుల వల్ల ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు నాలుగు రోజులు ఈ టికెట్లు చెల్లుబాటు కావని ఆర్టీసీ తెలిపింంది.
అదనపు చార్జీలు లేవు
రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాం. ముందుస్తు బస్సుల వివరాలను ప్రకటించాం. కరీంనగర్ రీజియన్ నుంచి జూబ్లీ వరకు, జూబ్లీ నుంచి కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ వరకు ఆయా డిపోల పరిధిలో 398 బస్సు సర్వీసులను నడిపిస్తున్నాం. రద్దీ సమయంలో టికెట్ ధర పెంచాల్సి ఉన్నా ప్రయాణికుల సౌకర్యార్థం పెంచడం లేదు. సంస్థ కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి.
– సుచరిత ఆర్ఎం కరీంనగర్