పెద్దపల్లి, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సర్కారు వైద్యం దేశానికే ఆదర్శమైందని, సీఎం కేసీఆర్, మంత్రి తన్నీరు హరీశ్రావు ఆధ్వర్యంలో రాష్ట్ర వైద్య విధానమే మారిపోయిందని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రైవేటు వైద్యానికి స్వస్తి పలికి ప్రభుత్వ వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారంటే అందుకు ప్రభుత్వ వైద్యులు, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తల పనితీరేనని, కొవిడ్ ప్రత్యేక పరిస్థితుల్లో వారు దేవుళ్లలా పనిచేశారని ఆయన కొనియాడారు. మంగళవారం రాత్రి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్లో ‘తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్(టీపీహెచ్డీఎ) పెద్దపల్లి కార్యనిర్వాహక సభ, వైద్య ఆరోగ్య శాఖ ఐక్య వేదిక సమ్మేళన సభ’ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో వైద్యులు, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలను గుర్తించిన తెలంగాణ సర్కారు, ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా లేని విధంగా తెలంగాణలో జీతాలను ఇస్తున్నదన్నారు. అసలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా వైద్యానికి ఇంత ప్రాధాన్యం ఇచ్చిన రాష్ట్రం లేదన్నారు. అందరి గొప్ప పనితీరు వల్లే మాతృ మరణాలను 43శాతానికి, శిశు మరణాలను 21శాతానికి తగ్గించుకున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 4 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీలను ఈ ఏడాది మరో తొమ్మిది కాలేజీలను ప్రారంభించుకున్నామన్నారు. గతంలో రాష్ట్రంలో 3డయాలసిస్ కేంద్రాలుండేవని, ఇప్పుడు కొత్త 61 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నామని, 50లక్షల మంది బాధితులకు డయాలసిస్ చేస్తున్నామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ కేడర్ల కింద 12,755 పోస్టుల నియామక ప్రక్రియ జరుగుతున్నదని, 969 వైద్యులను, 5,204 స్టాఫ్ నర్స్లకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేశామన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేశ్తోపాటు టీపీహెచ్డీఏ ఫౌండర్ కత్తి జనార్దన్, ప్రధాన కార్యదర్శి పూర్ణ చందర్, వర్కింగ్ కమిటీ కార్యదర్శి రాజ్ కుమార్ జాదవ్, డీఎంహెచ్వో ప్రమోద్కుమార్, సామాజిక కార్యకర్త ఆకుల స్వామి వివేక్ పటేల్, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ వచ్చాకే సర్కారు వైద్యానికి విలువ
తెలంగాణ రాక ముందు ప్రభుత్వ వైద్యం అంటే.. ‘నేను రానుబిడ్డో సర్కార్ దావఖాన’కు అన్నట్లుండేది. తెలంగాణ వచ్చినంక, ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయిన తర్వాత ‘సర్కార్ దవాఖానకే వస్తా’ అనే తీరుగా మారింది. ఒక్కో దవాఖాన్ల వైద్యులు, సిబ్బంది తప్ప పేషెంట్లు పెద్దగా వచ్చే వారు కాదు. ప్రసవాలన్నీ ప్రైవేట్లనే అయ్యేవి. కానీ, ఇప్పడు పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. ఇప్పుడు ప్రైవేటు దవాఖాన్లల్ల సిబ్బంది తప్ప పేషెంట్లు ఉంటలేరు. ప్రసవాలన్నీ సర్కారు దవాఖాన్లనే జరుగుతున్నయ్. తెలంగాణ అస్తే ఏం వస్తది అన్నోళ్లకు వైద్యారోగ్య శాఖే నిదర్శనం. బీఆర్ఎస్ ప్రభుత్వం సర్కారు దవాఖాన్లలో సకల సౌకర్యాలు కల్పిస్తుండడంతో సర్కారు వైద్యానికి విలువ పెరిగింది.
– పుట్ట మధూకర్, పెద్దపల్లి జడ్పీ చైర్మన్
ప్రభుత్వ చొరవకు నిదర్శనం
కొవిడ్ ప్రత్యేక పరిస్థితుల్లో ప్రైవేటు వైద్యం డొల్లతనం బయట పడింది. తెలంగాణలో సర్కారు వైద్యం అందినంత తీరుగా ఎక్కడా వైద్యం అందలేదు. ఆ సమయంలో సర్కార్ వైద్యులు, సిబ్బంది దేవుళ్లలా పనిచేశారు. నిజంగా తెలంగాణలోని ప్రతీ కుటుంబం చేతులెత్తి మొక్కేలా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ పనిచేసింది. ఇది తెలంగాణ ప్రభుత్వం చూపిన చొరవకు నిదర్శనం. వైద్య సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తల పని తీరువల్లే ఈ గొప్పతనం దక్కింది.
– దాసరి మనోహర్ రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే
వైద్య సిబ్బంది సేవలకు గుర్తింపు
రాష్ట్రంలో వైద్యులు, వైద్య సిబ్బంది సేవలను తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. వారి అవసరాలను అక్కెరలను, ఆకలిని తీర్చే విధంగా అన్ని విధాలా ఆదుకున్నది. సర్కారు వైద్య రంగంలో దవాఖానలను బలోపేతం చేయడంతో పాటు వైద్యులు, వైద్య సిబ్బదికి జీతాల పెంపు కూడా ఈ ప్రభుత్వంతోనే సాధ్యమైంది. జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నది. ఇది తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం.
– కోరుకంటి చందర్, రామగుండం ఎమ్మెల్యే