సిరిసిల్ల రూరల్, ఫిబ్రవరి 16 : ‘రాజన్న సిరిసిల్ల చాలా పీస్ ఫుల్ జిల్లా. ఇక్కడి కార్మిక, ధార్మిక క్షేత్రాలపై ప్రత్యేక దృష్టి సారించాం. శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్నాం.’ అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు. రాజన్న ఆలయంలో నిరంతరం నిఘా ఉంచుతామని, మహాశివరాత్రి జాతర నేపథ్యంలో రెండు వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటి వరకు జిల్లాలో అమలు చేస్తున్న పోలీసు విధానాన్ని పరిశీలించి, ప్రజలకు చేరువయ్యేలా కార్యక్రమాలను, ఫ్రెండ్లీ పోలీసింగ్ను కొనసాగిస్తామన్నారు. ఎన్నికల సంవత్సరం కావడంతో పొలిటికల్ హీట్ను అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్య్యూ ఇచ్చారు.
నమస్తే: సర్.. మీ గురించి?
ఎస్పీ: మాదీ జమ్మూ రాష్ట్రం. అక్కడే చదివా. హైదరాబాద్లో బీటెక్ చేశా. 2011-12లో శిక్షణ పొందా. అయినా ఐపీఎస్ సాధించలేకపోయా. తర్వాత ఇంట్లోనే మూడేళ్ల పాటు శ్రమించా. 2017లో ఐపీఎస్కు ఎంపికయ్యా. ఇంట్లోనే ప్రిపేరయి నా లక్ష్యం సాధించా. మా మమ్మీ హౌస్వైఫ్. డాడీ బిజినెస్మెన్. నాకు అన్న, అక్క ఉన్నారు. అన్నయ్య డాక్టర్. నా వైఫ్ దివాన్షి ఐ డాక్టర్. మాది లవ్ అండ్ ఆరేంజ్డ్ మ్యారేజ్.
నమస్తే: మీ మొదటి పోస్టింగ్?
ఎస్పీ: 2017లో ఐపీఎస్కు ఎంపికయ్యా. మొదట మంచిర్యాల జిల్లాలో ఏసీపీగా చేరా. అక్కడే డీసీపీ పనిచేశా. పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి డీసీపీ పని చేశా. ఇటీవలే రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఎస్పీగా బదిలీపై వచ్చా.
నమస్తే : శాంత్రి భద్రతల పరిరణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
ఎస్పీ: రాజన్న సిరిసిల్ల పీస్ ఫుల్ జిల్లా. ఇక్కడ ఎలాంటి ఇష్యూలు లేవు. నేర నియంత్రణ, నేరాల ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఉండేలా చర్యలు తీసుకుంటాం. ప్రజలు నిర్భయంగా స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. ప్రజలకు చేరువయ్యేలా ఫ్రెండ్లీ పోలీసింగ్ను పక్కాగా అమలు చేస్తాం. సిరిసిల్ల, వేములవాడలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటున్నది. ప్రత్యేకంగా ట్రాఫిక్ సిబ్బంది పనిచేస్తున్నారు. ఇంకా ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే అవసరమైన చర్యలు తీసుకుంటాం.
నమస్తే: రాబోయే ఎన్నికల గురించి?
ఎస్పీ: ఇది ఎన్నికల సంవత్సరం నిజమే. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ ఉంటుంది. వాటన్నింటినీ అధిగమించడానికి మానసికంగా, శాఖా పరంగా సిద్ధంగా ఉన్నాం. శాంతి భద్రతల పరిరక్షణే మా లక్ష్యం.
నమస్తే: మహాశివరాత్రి భద్రత ఏర్పాట్ల గురించి?
ఎస్పీ: మహాశివరాత్రి జాతర కోసం రెండు వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాం. గత శివరాత్రి జాతరలో వచ్చిన సమస్యలు, ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఆలయంలో ప్రవేశం, క్యూలైన్లు, వీఐపీ పాస్లు, ఇతర భద్రత ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నాం. ఇప్పటికే జిల్లా అధికారులతో సమీక్షించాం. కొన్ని రిపోర్టు చేశారు. వాటిని పరీశీలించి, మరింత పకడ్బందీగా చేస్తాం. భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. సీసీ కెమెరాలు, పోలీస్ కమాండ్ కంట్రోల్రూంలు ఏర్పాటు చేస్తాం. ఇంకా ఏమైనా సమస్యలుంటే తెలుసుకుని తగిన విధంగా చర్యలు తీసుకుంటాం.