సకల వసతులు.. ఆధునిక హంగులతో చేపడుతున్న సిరిసిల్ల జిల్లా మెడికల్ కాలేజీ శరవేగంగా నిర్మితమవుతున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో మంజూరైన ఈ కళాశాలను వచ్చే విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా యంత్రాంగం ముందుకెళ్తున్నది. జిల్లా కేంద్రంలోని రెండో బైపాస్ రోడ్డులో 29 ఎకరాల్లో జీ ప్లస్5 పద్ధతిన 200 పడకల దవాఖాన, మరో 30 ఎకరాల్లో కళాశాల నిర్మాణం సాగుతున్నది. 166 కోట్లతో పనులు నడుస్తుండగా, ఇప్పటికే హాస్పిటల్ మొదటి స్లాబ్ వరకు పూర్తయింది. వచ్చే యేడాది నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశముండగా, జిల్లావాసులకు స్థానికంగానే మరింత మెరుగైన వైద్యం అందనున్నది.
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టింది. అందుకోసం దవాఖానలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది. మౌలిక సౌకర్యాలతో పాటు ఆధునాతన పరికరాలు అందుబాటులోకి తెస్తున్నది. జిల్లా ఏరియా దవాఖానలో సిటీస్కాన్, వెంటిలేటర్లు, ఐసీయూ, కిడ్నీ బాధితులకు డయాలసిస్ సెంటర్ ఇలా అన్ని ఏర్పాట్లపై ప్రత్యేక చొ రవ చూపుతున్నది. ప్రసవాల గురించి చెప్పనక్కరలేదు. ప్రైవేటు దవాఖానలో చేయించుకునే వారికి రూ.30వేల నుంచి రూ.50వేల దాకా ఖర్చవుతున్నది. అదే సర్కారు దవాఖానల్లో అయితే రూపాయి ఖర్చులేకుండా చేస్తున్నారు. పైగా కేసీఆర్ కిట్లు, మగబిడ్డకు జన్మనిస్తే రూ. 12వేలు, ఆడబిడ్డకు జన్మనిస్తే రూ. 13వేలు కానుకగా ఇస్తున్నది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఓపీ సంఖ్య కూడా గణనీయం గా పెరగడంతో దవాఖానల సేవలను మరింత వి స్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ప్రతి జిల్లాకు వైద్య కళాశాలను మం జూరు చేసింది. ఈ మేరకు సిరిసిల్ల మెడికల్ కాలే జీ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చొరవతో వచ్చే విద్యాసంవత్సరం అందుబాటులోకి తెచ్చేలా విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నది.
రూ.166 కోట్లతో వైద్య కళాశాల..
జిల్లాకు మంజూరైన వైద్య కళాశాల, 200 పడకల దవాఖాన నిర్మాణం ఊపందుకున్నది. 2021 జూలై4న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ను వైద్య కళాశాల మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్ కోరిన వెంటనే ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని రెండో బైపాస్రోడ్డులోని అప్పారెల్ పార్కు సమీపంలో వైద్య కళాశాల కోసం రెవెన్యూ శాఖ 60 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అందులో 29 ఎకరాల్లో జీ ప్లస్ 5 పద్ధతిలో 200 పడకల దవాఖానను, మిగిలిన 30 ఎకరాలు కళాశాల కోసం కేటాయించారు. కళాశాల భవన నిర్మాణ పనులు ప్రస్తుతం పునాదుల దాకా రాగా, దవాఖాన నిర్మాణం మొదటి శ్లాబ్వరకు వచ్చింది. మంత్రి కేటీఆర్ చొరవతో ఆధునాతన హంగులతో దవాఖానను కళాశాలకు అనుగుణంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఏరియా దవాఖాన 200 పడకలకు అప్గ్రేడ్ చేశారు. డైరెక్టర్ ఆఫ్ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో ఏరియా దవాఖాన బాధ్యతల నిర్వహణ ఉంటుంది. ల్యాబ్లు, డయాలసిస్, ఎమ్ఆర్ఐ, ఇలా ప్రతి ఒక్కటి అధునాతన పరికరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
వచ్చే విద్యాసంవత్సరం అందుబాటులోకి..
వచ్చే విద్యాసంవత్సరం వైద్య కళాశాల అందుబాటులోకి తెచ్చేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో భవనాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 100 సీట్లతో ఏర్పాటు చేస్తున్న కళాశాలలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించనున్నారు. ప్రస్తుతం రెండో బైపాస్రోడ్డును వంద పీట్లతో కామారెడ్డి, కరీంనగర్ ప్రధాన రహదారిపై నిర్మించారు. ఇండస్ట్రియల్ హబ్గా భవిష్యత్తులో అభివృద్ధి చెందే అవకాశాలున్నందున ఈ రోడ్డులోనే జేఎన్టీయూ, వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్నారు. వైద్య కళాశాల ఏర్పాటుతో జిల్లా ప్రజలకు అత్యంత ఖరీదైన వైద్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఎడ్యుకేషన్ హబ్గా జిల్లా..
మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో జిల్లాకు కళాశాలలు వరుసపెట్టి వస్తున్నాయి. దీంతో వెనుక బడ్డ కార్మిక, ధార్మిక క్షేత్రమైన జిల్లా ఎడ్యుకేషన్ హ బ్గా అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నది. ఉన్నత చదువుల కోసం నాడు పట్టణాల బాట పట్టిన యువత నేడు స్థానికంగానే విద్యనభ్యసించే అవకాశం వచ్చింది. స్థానిక విద్యార్థులే వివిధ జిల్లాలకు, రాష్ర్టాలకు చెందిన విద్యార్థులు నేడు ఇక్కడికొచ్చి చదువుకునే అవకాశం కలిగింది. ఇందుకు నర్సింగ్ కళాశాల, ఐటీఐ, వ్యవసాయ పాలిటెక్నిక్, వ్యవసాయ కళాశాల, అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూళ్ల ఏర్పాటే నిదర్శనంగా నిలుస్తున్నది. తాజాగా వైద్యకళాశాల ఏర్పాటవుతుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.