కలెక్టరేట్, జూలై 7: మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ ఫథకాలను ప్రారంభించి, వాటి ఫలాలు పొందేలా ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగా మొదట ప్రతి మహిళను స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా చేరాలని సూచించడంతో పాటు వారిని సంఘాల్లో చేర్చేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ముమ్మర కృషి చేస్తున్నది. ప్రస్తుతం మనుగడలో ఉన్న సంఘాలతో పాటు కొత్తగా ఎస్హెచ్జీ గ్రూపులు ఏర్పాటు చేసి, వారిని పొదుపు చేసుకునే దిశగా మళ్లిస్తోంది. ఇప్పటికే జిల్లాలో 527 గ్రామైక్య సంఘాలుండగా, వీటి పరిధిలో 13,708 స్వయం సహాయక సంఘాలు పనిచేస్తున్నాయి. వీటిలో 1,48,299 మంది మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరందరినీ ఆర్థికంగా పురోగమన దిశలో తీసుకెళ్లే క్రమంలో బ్యాంక్ లింకేజీ, స్త్రీనిధి రుణాల సదుపాయం కల్పించడంతో పాటు చిన్న, మధ్య తరహా వ్యాపారులుగా ఎదిగేందుకు సెర్ప్ తోడ్పాటునందిస్తోంది. జిల్లాలో ఏటా మహిళా సంఘాలకు సుమారు రూ.500 కోట్ల వరకు రుణాలను వివిధ బ్యాంకుల ద్వారా సెర్ప్ అందజేస్తోంది. ఆయా రుణాలతో ఇప్పటికే అనేక మంది ప్రయోజనాలు పొందుతున్నారు.
వీరితో పాటు మిగతా మహిళలను కూడా ప్రోత్సహించే క్రమంలో వారిని స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. దీంతో, గత మూడు మాసాలుగా గ్రామాల్లోని వీవోల ద్వారా ఇప్పటివరకు సంఘంలో సభ్యత్వం లేని మహిళలను ఎంపిక చేసి కొత్త సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, మరికొంత మందిని ప్రస్తుతం కొనసాగుతున్న తక్కువ సభ్యులున్న సంఘాల్లో చేర్చుతున్నారు. పద్దెనిమిదేళ్లు పైబడిన వారు, ఇటీవల వివాహమై కొత్తగా అత్తగారింటికి వచ్చిన వారిని గుర్తిస్తూ, సంఘాల్లో సభ్యులుగా అవకాశం కల్పిస్తున్నారు. స్థానికంగా గుర్తించిన సభ్యుల సంఖ్యను బట్టి సంఘాల ఏర్పాటుపై అధికారులు వీవోలకు లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నారు. ఈ సంఘాలకు బ్యాంకుల్లో ఖాతాలు తెరుస్తూ, నెలనెలా పొదుపు చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది మహిళలు సంఘాల ద్వారా లక్షల్లో రుణాలు పొందుతూ తిరిగి చెల్లిస్తుండగా, కొత్తగా సంఘాల్లో చేరేందుకు కూడా అత్యధిక మంది ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు 15 సంఘాలు ఏర్పాటు చేయగా, వీటిలో 156 మందిని చేర్చినట్లు, అలాగే, 1914 గ్రూపుల్లో 3261 మంది మహిళలను సర్దుబాటు చేసినట్లు డీఆర్డీవో శ్రీలత తెలిపారు. వీరంతా ప్రతి నెలా సక్రమంగా పొదుపు చేస్తే, ఆరు మాసాల అనంతరం రూ.ఐదు లక్షల వరకు రుణాలు అందించనున్నట్లు వెల్లడించారు.
వీవోల పరిధిలో కొత్త సంఘాల ఏర్పాటు
కొత్తగా ఏర్పాటు చేస్తున్న సంఘాలతో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రతి వీవో పరిధిలో సంఘాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినం. గతంలో అరవై ఏళ్లు దాటిన వారిని సంఘాల్లో చేర్చుకునే అవకాశం లేకుండే. ప్రస్తుతం ఆ నిబంధన తొలగించి ప్రతి మహిళ ఎస్హెచ్జీలో సభ్యురాలిగా చేరేలా ప్రోత్సహిస్తున్నం. కొత్త సంఘాల్లో సభ్యుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తూ, బ్యాంకు ఖాతాలు కూడా తెరిపిస్తున్నం. ఆరు నెలల తర్వాత ఆ సంఘాలకు బ్యాంక్ లింకేజీ, స్త్రీనిధి ద్వారా రుణాలు అందజేస్తాం.
-శ్రీలత, డీఆర్డీవో, కరీంనగర్