కరీంనగర్ కలెక్టరేట్, మే 19 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ మాటలు కొత్త బిచ్చగాన్ని తలపిస్తున్నాయని, కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్రావు ధ్వజమెత్తారు. కరీంనగర్ నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన మీడియాసమావేశంలో మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్పై ఎంపీ బండి సంజయ్చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అవాకులు, చవాకులు పేలుతూ, ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. పార్లమెంటు సభ్యుడిగా గెలిచి బండి సంజయ్ జిల్లా ప్రజలకు ఒరగబెట్టింది శూన్యమన్నారు. తన సెగ్మెంట్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా కనీసం అందుబాటులో కూడా లేకపోవడం కరీంనగర్ పార్లమెంటు ప్రజలు చేసుకున్న దురదృష్టమన్నారు. మంత్రి గంగుల కమలాకర్పై రెండు సార్లు చిత్తుగా ఓడిపోయి, ఎంపీగా గ్రహపాటున గెలిచాడన్నారు.
తెలంగాణ రాష్ర్టాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చి, బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్పై బండి అనవసర విమర్శలు చేస్తుండటం హేయనీయమన్నారు. ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో వందలాది పరిశ్రమలు తెచ్చి, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత మంత్రి కేటీఆర్దేనన్నారు. అమెరికా అనంతరం హైదరాబాద్లోనే ఐటీ రంగం విస్తరించడం వెనుక ఎవరి కృషి ఉందో ప్రజలకు తెలుసన్నారు.
అభివృద్ధి చెందుతున్న తెలంగాణను అధోగతి పాలు చేసేందుకు ఎంపీ సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. మూడేళ్లలో జిల్లా అభివృద్ధికి నయాపైసా కూడా తేలేని అసమర్థ ఎంపీగా సంజయ్కి ప్రజల్లో గుర్తింపు వచ్చిందన్నారు. ఉద్యమ నాయకుడు, నిరంతరం ప్రజా సేవలో నిమగ్నమయ్యే మంత్రి కేటీఆర్ను మరోసారి విమర్శిస్తే తగిన గుణపాఠం చెప్పక తప్పదన్నారు.