భారీ వర్షాల నేపథ్యంలో సర్కారు అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యాధుల కట్టడే లక్ష్యంగా పల్లెలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచాలని నిర్దేశించింది. ఆదివారం నుంచి ఆగస్టు 2 వరకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కదిలింది. అధికారులందరూ క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదేశించింది. అత్యవసర పరిస్థితుల్లో మినహా సెలవులు పెట్టవద్దని..కలెక్టర్ అనుమతిలేనిదే ఎక్కడికి వెళ్లరాదని సూచించింది.
కరీంనగర్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వం సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా ఆదివారం నుంచి ఆగస్టు 2 వరకు పల్లెపల్లెనా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని సీఎం కేసీఆర్ శనివారం ఆదేశించారు. అవసరమైన బ్లీచింగ్ ఫౌడర్, లైమ్, మలాథిన్, బైటెక్, ఆయిల్ బాల్స్, ఫాగింగ్ మిషన్లు, స్ప్రేయర్లు అందుబాటులో ఉంచి వినియోగించుకోవాలని నిర్దేశించారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా అధికారులు కదిలారు. ఆదివారం కొన్ని గ్రామాల్లో స్పెషల్డ్రైవ్ చేపట్టినట్లు డీపీవో వీర బుచ్చయ్య తెలిపారు. కలెక్టర్ అనుమతి లేకుండా ఉద్యోగులు హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లరాదని, మెడికల్ తప్ప ఇతర సెలవులన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్లో స్పష్టం చేసింది. జిల్లా స్థాయిలో కలెక్టర్, అదనపు కలెక్టర్లు, డీపీవోలు, డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు, డీఎల్పీవోలు, మండలస్థాయిలో ఎంపీడీవోలు, ఎంపీవోలు, గ్రామస్థాయిలో సర్పంచులు, కార్యదర్శులు, వార్డు సభ్యులు పారిశుధ్య ఈ కార్యక్రమాలను పర్యవేక్షించాలని పేర్కొన్నది. చిన్న పంచాయతీల్లో నిధుల కొరత కారణంగా ఫాగింగ్ మిషన్లు, స్ప్రేయర్లు కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంటే మేజర్ పంచాయతీల నుంచి కొనుగోలు చేసి ఇవ్వాలని ఆదేశించింది. అవసరమైతే స్ప్రేయర్లను రైతుల నుంచి అద్దెకు తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఊరూరా విస్తృతంగా..
ఊరూరా విస్త్రతంగా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా అధికారులు ఆదేశించారు. ఫాగింగ్ చేపట్టాలని, నిలిచి ఉన్న నీటిని బయటకు పారదోలాలని, నీటిని బయటకు వెళ్లే మార్గం లేకుంటే ఆయిల్ బాల్స్ వేయాలని, ప్రతి రోజూ డ్రైనేజీల్లో సిల్ట్ను తొలగించాలని. నీటి నిలువ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్తోపాటు గంబూషియా చేపలను వదలాలని, దోమలు వృద్ధి చెందకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. బురద నీరు ఉన్న చోట ప్రతి రోజూ బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, లార్వా నిరోధక కెమికల్స్ను స్ప్రే చేయాలని ఆదేశించారు. రక్షిత మంచినీటి పైప్లైన్ల లికేజీలను అరికట్టాలని, ఇందుకు మిషన్ భగీరథ అధికారుల సహాయాన్ని తీసుకోవాలన్నారు.
ప్రజలకు అవగాహన కల్పించాలి
ప్రజలు వడబోసిన నీటినే తాగాలని, వేడి, తాజా ఆహారాన్నే తీసుకోవాలని గ్రామాల్లో మైకుల ద్వారా విస్తృత ప్రచారం చేయించాలని అధికారులు ఆదేశించారు. క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే సరఫరా చేయాలని, సర్పంచులు, కార్యదర్శులు ప్రతిరోజు గ్రామంలో పర్యటించాలని సూచించారు. సాధారణం కంటే ఎక్కువ వ్యాధులు నమోదైన ప్రాంతాల్లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం అందించి ఆ ప్రాంతంలో ప్రత్యేక హెల్త్ క్యాంపులను నిర్వహించాలని స్పష్టం చేశారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, డీపీఓ, డీఎల్పీఓలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పారిశుధ్య కార్యక్రమాలను తనిఖీ చేయాలని సూచించారు. హోటళ్లు, ఇతర ఆహార పదార్ధాలు విక్రయించే దుకాణాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించాలని, మాంసం అమ్మే దుకాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్దేశించారు.
ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాం..
సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆదివారం నుంచి ఆగస్టు 2 వరకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈ నెల 11 నుంచే గ్రామాల్లోనే పర్యటిస్తున్నాం. ప్రతిరోజూ ఊరూరా పారిశుధ్య కార్యక్రమాలను పర్యవేక్షిస్తాం. ఎక్కడైనా వ్యాధులు ప్రబలినట్లు మా దృష్టికి వచ్చిన వెంటనే కలెక్టర్ ఆదేశాలతో అక్కడ ప్రత్యేక మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాం. గ్రామాల్లో ఎలాంటి పారిశుధ్యలోపం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం..
– వీర బుచ్చయ్య, జిల్లా పంచాయతీ అధికారి