హుజూరాబాద్, జూలై 10: రైతుబంధు పథకం పైసలు చేతికందడంతో అన్నదాతలు మురిసిపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వానకాలం పంట సాగుకు సన్నద్ధం అవుతున్న సమయంలోనే పెట్టుబడి సాయం ఖాతాల్లో జమ కావడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు ఇచ్చిన డబ్బులతో ఎరువులు, విత్తనాలను కొని తెచ్చుకుంటూ వ్యవసాయ పనులు ముమ్మరం చేస్తున్నారు.
హుజూరాబాద్ డివిజన్లో ఇప్పటి వరకు రూ.49కోట్ల48లక్షల25వేలు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని వ్యవసాయాధికారులు తెలిపారు. రైతుబంధు పథకం కోసం డివిజన్లో మొత్తం 57,135మంది రైతులు వానకాలానికి సంబంధించి దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు 51,890 మంది ఖాతాల్లో పైసలు జమ అయ్యాయి. డివిజన్లో ఆత్యధికంగా సైదాపూర్ మండలంలో 12,588 మంది రైతులకు గానూ 11,362మందికి రూ.11కోట్ల30లక్షల 72వేల 470 జమ అయ్యాయి. ఆ తర్వాత వీణవంక మండలంలో 12,344 మంది రైతులకు గానూ 11,82మందికి రూ.11కోట్ల7లక్షల 11వేల904, హుజూరాబాద్ మండలంలో 11,925 మంది రైతులకు గానూ 10,531 మందికి రూ.10కోట్ల37లక్షల 11వేల 992, జమ్మికుంట మండలంలో 10వేల985 మంది రైతులకు గానూ 10,092మందికి రూ.9కోట్ల44లక్షల 69వేల893, అత్యల్పంగా ఇల్లందకుంట మండలంలో 9,293 మంది రైతులకు గానూ 8,823మందికి రూ.8కోట్ల28లక్షల 58వేలు ఖాతాల్లో జమ అయ్యాయి.
కొత్తగా 200మంది రైతులకు..
కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులు రైతుబంధు పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు జూలై 10వ తారీఖుతో ముగిసింది. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేశాం. డివిజన్లో దాదాపు 200మంది రైతులు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు.
-సునీల్కుమార్, మండల వ్యవసాయాధికారి, హుజూరాబాద్
ఎవుసం రందీ లేకుండా నడుస్తంది
కేసీఆర్ సారు రైతుల పాలిట దేవుడు. ఆయన చేయబట్టి ఎవుసం రందీ లేకుండా నడుస్తంది. సర్కారు అన్ని విధాలా ఆదుకోవడం వల్ల చానా మేలు జరుగుతంది. రైతుబంధు కింద అచ్చిన పైసలతో ఎరువులు, విత్తనాలు కొంటున్న. కడమ పైసలు కూలీలకు ఖర్చు చేస్తా. నాకు ఎకరన్నర భూమి ఉంది. ప్రతి పసలుకు ఏడువేల ఐదువందలు వస్తున్నయ్.
– పుట్టపాక కొమురయ్య(ఇప్పల్ నర్సింగాపూర్)
పెట్టుబడికి ఢోకా లేదు
ఎవుసం పెట్టుబడికి ఢోకా లేదు. రైతుబంధు లేక ముందు పెట్టుబడికి ఎనుకముందు అయ్యేది. మునుపు ఎవుసం చేద్దామంటే దండుగ అనిపించేది. రైతుబంధుతో అచ్చిన పైసలతో ఎరువులు, విత్తనాలు కొంటా. మళ్లోసారీ కూడా ఈ సర్కారే కావాలని కోరుకుంటున్న. నాకు ఎకరం 16 గుంటలకు ప్రతి పసలుకు ఏడువేలు వత్తయి.
– ఊరడి బక్కారెడ్డి(ఇప్పల్ నర్సింగాపూర్)