కార్పొరేషన్ : కరీంనగర్ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతోనే రూ.410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపడుతున్నామని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్లోని జలసౌధలో మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు సంబంధించి రిటైనింగ్ వాల్స్ డిజైన్లు, ఇతర అభివృద్ధి పనులపై టూరిజం, ఇరిగేషన్, కరీంనగర్ జిల్లా మున్సిపల్, రెవెన్యూ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరానికి అనుకొని ప్రపంచంలో ఎక్కడా అత్యద్భుతమైన వాటర్ బాడీ లేదన్నారు. కానీ కరీంనగర్కు ఎల్ఎండీ రూపంలో కరీంనగర్ రిజర్వాయర్ ఉందన్నారు. ఈ ప్రాంతాన్ని అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో సీఎం కేసీఆర్ దృష్టి సారించారని తెలిపారు. విదేశాల్లోని పర్యాటక ప్రదేశాల కంటే కూడ అద్భుతమైన అన్ని వసతులతో మానేరు రివర్ ఫ్రంట్ను తీర్చిదిద్దుతామన్నారు. దీని కోసం ప్రధానంగా నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి సంబంధించి డిజైన్లు తుది దశకు వచ్చాయన్నారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా ఎల్ఎండీ డ్యాం నుంచి నాలుగు కిలోమీటర్ల మేరకు రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి రూ. 310.46 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఇవి కాకుండా రూ.80 కోట్ల వ్యయంతో చెక్ డ్యాంల నిర్మాణం, రూ.190 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ పనులు సైతం తుది దశకు చేరాయని తెలిపారు.
ఈ డీపీఆర్ను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారని తెలిపారు. అనుకున్న లక్ష్యం మేరకు పనులన్నింటినీ పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ను వారం రోజుల్లో పూర్తి చేసి వచ్చే సమావేశానికి సిద్ధంగా ఉండాలని మంత్రి అధికారులకు సూచించారు. కార్యక్రమంలో టూరిజం శాఖ కార్యదర్శి కె.ఎస్. శ్రీనివాసరాజు, ఇరిగేషన్ ఈఎన్సీలు మురళీధర్, శంకర్, టూరిజం కార్పొరేషన్ ఎండి మనోహర్రావు, సీఈ డిజైన్స్ శ్రీనివాస్, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ యాదగిరిరావు, ఇరిగేషన్ ఎస్ఈ శివకుమార్, కరీంనగర్ ఆర్డీవో ఆనంద్కుమార్, కరీంనగర్ జిల్లా ఇరిగేషన్, టూరిజం, రెవెన్యూ, మున్సిపల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.