అక్రమార్కులను ఊచలు లెక్కపెట్టిస్తా..
బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సురేష్ రెడ్డి
sand mafia | పెద్దపల్లి: జిల్లాలో కొనసాగుతున్న అక్రమ మట్టిదందాపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుతో పాటు ప్రభుత్వ అధికారి గిర్దావరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మండలంలోని కొత్తపల్లి గ్రామంలో కొంతకాలంగా ఆరుగురు ఇటుకబట్టీల యజమానులు మైనింగ్ శాఖ నుండి అనుమతి పొందిన దానికంటే ఎక్కువమొత్తంలో మట్టి తవ్వకాలు జరుపుతున్నారని, విషయం వెలుగులోకి రావడంతో కొన్ని రోజులు నిలిపివేసినట్లు చెప్పిన అధికారులు, మళ్లీ అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చిన నివేదిక ప్రకారం 70వేల మెట్రిక్ టన్నులకు గానూ లక్షా 65వేల 5వందల పది మెట్రిక్ టన్నుల మట్టిని తవ్వుకున్నారని ఆరోపించారు. దీనిపై ఒక్కో కంపెణీ కి రూ.38లక్షల 56వేల 3వందల 29 జరిమానా విధించారని వివరించారు. జరిమానా చెల్లించకుండానే ఇటుకబట్టీల యాజమాన్యం మట్టిని తరలించడంపై సురేష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
గిర్దావరు ఆడియో ప్రదర్శన..
అక్రమంగా తరలిస్తున్న మట్టి వాహనాలను వదిలిపెట్టాలని గిర్దావరు సిబ్బందిని ఆదేశిస్తున్న ఆడియో లీకైంది. ఆ ఆడియో సంభాషణను సురేష్ రెడ్డి విలేకరుల ముందు ప్రదర్శించారు. ఎవరి అండ చూసుకొని గిర్దావరు వాహనాలను వదిలిపెట్టమని ఆదేశిస్తున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. అక్రమార్కులు అక్రమంగా ఇసుక, మట్టి దందా చేస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నాడని, తాను గెలిచిన వెంటనే జైళుకు పంపిస్తా అంటూ తొడగొట్టిన ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రజలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. రూ.2కోట్ల స్కాములో ఎమ్మెల్యేకు హస్తం ఉందని ఆరోపించారు.
గత మూడేళ్ళుగా ఇసుక, మట్టి తవ్వకాలపై న్యాయస్థానాల్లో అలుపెరుగని పోరాటం చేస్తున్నానని, ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్ కేసులో విజయం సాధించానని తెలిపిన ఆయన, అక్రమార్కులను వదిలిపెట్టబోనని సురేష్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటుకబట్టీల యజమానులకు వేసిన జరిమానాను ప్రభుత్వ ఖజానాలో జమచేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరు, సంబంధిత అధికారులు సత్వరమే స్పందించాలని సురేష్ రెడ్డి కోరారు.