మంథని, ఆగస్టు 20 : ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలి ఇంట్లోకి చొరబడిన దుండగులు ఇంట్లో ఉన్న బంగారం, నగదు వివరాలు చెప్పాలని ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశారు. అనంతరం బీరువాలు పగులగొట్టి బంగారం, వెండి ఎత్తుకెళ్లారు. దాడిలో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు రెండు రోజుల పాటు అచేతన స్థితిలో పడి ఉంది. ఆమె కొడుకు ఆదివారం తెల్లవారుజామున ఇంటికి వచ్చి చూసేసరికి తల్లి స్పృహ లేని పరిస్థితిలో ఉండడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే… పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని రావులచెరువు కట్టకు చెందిన పాపిట్ల సంతోష్ పని కోసం ఈనెల 18న హైదరాబాద్కు వెళ్లాడు. ఆ తర్వాత ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఆయన తల్లి పాపిట్ల జయప్రదపై దాడి చేశారు. ఇంట్లో ఉన్న నగలు, నగదు వివరాలు చెప్పాలంటూ తల, ముఖంపై రక్తం వచ్చేలా దాడి చేస్తూ విచక్షణా రహితంగా వ్యవహరించారు.
అనంతరం ఇంట్లో ఉన్న బీరువాలను పగలగొట్టి బంగారం, వెండిని ఎత్తుకెళ్లారు. తీవ్రంగా గాయపడ్డ ఆ వృద్ధురాలు రెండు రోజులుగా లేవలేని పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండిపోయింది. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చిన సంతోష్ అచేతన స్థితిలో ఉన్న తల్లిని చూశాడు. వివరాలు అడిగి తెలుసుకున్న అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్ఐ కిరణ్కుమార్, పోలీసులు ఇంటిని పరిశీలించి వివరాలు సేకరించారు. ఇంట్లో ఐదు తులాల బంగారు నగలు, 40 తులాల వెండి చోరీ అయినట్లు గుర్తించారు. సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.