కలెక్టరేట్, జూన్ 7: స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, పదేండ్ల ప్రత్యేక రాష్ట్ర పురోగతిలో జలవనరుల శాఖ ఇంజినీర్ల పాత్ర అమోఘమని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఉద్ఘాటించారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం కరీంనగరంలోని వీ కన్వెన్షన్లో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సాగునీటి దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా సాగునీటి రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టి శరవేగంగా రాష్ట్రం అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నారని, పారిశ్రామిక రంగంతో పాటు యావత్ దేశ ప్రజానీకం తెలంగాణ వైపు దృష్టి మరల్చడంలో ఇరిగేషన్ ఇంజిననీర్ల కష్టం ఎంతో ఉందని కొనియాడారు.
2014కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో నీటి వనరులు లేక లక్షలాది ఎకరాల భూములు వట్టి పోయాయని, ఏటా వానాకాలంలో సైతం పంటల సాగు కష్టసాధ్యంగా ఉండేదని, తాగేందుకు నీరు లేక మారుమూల ప్రాంతాల ప్రజలు అల్లాడుతుండే వారని తన స్వీయానుభవాలను గుర్తు చేశారు. స్వరాష్ట్రం సిద్ధించిన అనంతరం సీఎం కేసీఆర్ నీటి వనరుల సద్వినియోగంపై దృష్టి సారించి, విజయం సాధించారన్నారు. అందులో భాగంగానే సాగునీటి రంగానికి రోల్ మోడల్గా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నిర్ధేశిత గడువులో పూర్తి చేసి, వట్టి పోయిన భూములను సస్యశ్యామలంగా మార్చిన ఘనతను దక్కించుకున్నారన్నారు. దిగువకు పారే గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్టుతో వందలాది మీటర్ల ఎత్తుకు తరలించి, ఆదిలాబాద్ అడవుల నుంచి సూర్యాపేట దాకా భూములను సస్యశ్యామలం చేశారని పోషించారని కొనియాడారు. సీఎం కేసీఆర్ ప్రోద్భలంతో ఇరిగేషన్ ఇంజిననీర్లు రాష్ర్టాన్ని దేశానికే దిక్సూచిగా నిలుపుతున్నారని ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగితే ప్రపంచపటంలో తెలంగాణకు ప్రత్యేకస్థానం లభించడం తథ్యమన్నారు.
తొమ్మిదేండ్లలోనే ఎంతో ప్రగతి
2014కు ముందు తెలంగాణలో వనరులున్నా వినియోగించుకోలేని పరిస్థితి ఉండేదని, ఫలితంగా వెనుకబాటుకు గురై ప్రజలు ఎన్నో ఇబ్బందులకు పడ్డారన్నారు. రవాణా సౌకర్యాలు కూడా సక్రమంగా లేక మారుమూల ప్రాంతాల ప్రజలు బాధలు అనుభవించారన్నారు. కానీ, ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన అనతికాలంలోనే రవాణా, సాగు,తాగు నీటి రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు సంభవించాయన్నారు. సమైక్యాంధ్రలో తెలంగాణలోని మెట్ట ప్రాంత ప్రజలు తాగునీటికి కూడా తండ్లాడే వారని, కిలోమీటర్ల కొద్ది బిందెలతో నడిచివెళ్లే సందర్భాలు తన సర్వీసు కాలంలో అనేకం చూసినట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో ఖమ్మం జిల్లాలోని పాలేరు డివిజన్ తిరుమలాయపాలెం నుంచి మొదలు కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్, రామడుగు మండలాల్లోని మెట్టప్రాంత గ్రామాల్లోని భూముల్లో జలాలు పరవళ్లు తొక్కుతున్నాయన్నారు.
జల విప్లవంతో నాడు రూ.50వేలు పలుకని ఎకరం భూమి ధర.. ప్రస్తుతం రూ.25లక్షలకు వరకు పెరగడం ముఖ్యమంత్రి ముందుచూపునకు నిదర్శనమన్నారు. కరీంనగర్ను టూరిస్ట్ హబ్గా మార్చడంలో జలవనరుల శాఖ ఇంజినీర్లు ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. రూ.410 కోట్లతో జిల్లా కేంద్రానికి ముఖద్వారంగా మానేరు నదిలో నిర్మిస్తున్న రివర్ ఫ్రంట్ ఇరువైపులా లోయర్ ప్రామినేటెడ్, అప్పర్ ప్రామినేటెడ్లు, దేశంలోనే మొదటి స్థానంలో ఉండేలా అతి పెద్ద పౌంటెయిన్ నిర్మాణంలో కీలకపాత్ర వహిస్తున్నారని కొనియాడారు. అనంతరం ఉత్తమ ఇంజినీర్గా అవార్డు పొందిన ఈఈ నాగభూషణంను కలెక్టర్ అభినందిస్తూ, ప్రశంసపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీలు పిల్లి శ్రీలత, తిప్పర్తి లక్ష్మయ్య, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, బొమ్మకల్ సర్పంచ్ పురమల్ల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, డీఏవో వాసిరెడ్డి శ్రీధర్, ఆర్డీఓ ఆనంద్కుమార్, తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్ తరాలకు బలమైన పునాది
తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందడంలో జలవనరుల శాఖ ఇంజినీర్ల కష్టం ఎంతో ఉంది. 2014కు ముందు తలాపున మానేరు జలాశయం ఉన్నా తాగునీటికి కటకట ఉండేది. నీటి కోసం నగరంలో నిత్యం ఆందోళనలు జరిగేవి. వేసవి వచ్చిందంటే చాలు మానేరు రిజర్వాయర్లో డెడ్ స్టోరేజీకి నీరు చేరేదని, స్వరాష్ట్రంలో ఇరిగేషన్ ఇంజినీర్లు చేస్తున్న కృషితో నేడు 7 టీఎంసీలకు తక్కువ కాకుండా నీటి నిల్వ ఉంటోంది. ఈనీటితో నగరవాసులకే కాదు పక్క జిల్లాలకు కూడా నిరంతర తాగునీటిని అందిస్తున్నాం. నీటి నిల్వలతో ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్ తరాల అభివృద్ధికి బలమైన పునాది వేశారు. తెలంగాణ వస్తే ఏమొస్తదని..? హేళన చేసిన వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చెంపపెట్టులా మారాయి.
– యాదగిరి సునీల్రావు, కరీంనగర్ మేయర్
పంటల ఉత్పత్తిలో మనమే ఆదర్శం
నీటి పారుదల శాఖ ఇంజినీర్ల కృషితో రాష్ట్రం నేడు పంటల ఉత్పత్తిలో పంజాబ్,ఆంధ్రాలను దాటి పోయింది. దేశంలోనే మొదటి స్థ్ధానం సంపాదించి, ఇతర రాష్ర్టాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది ఉమ్మడి పాలనలో మానవ మనుగడకు మూల స్తంభమైన నీటి వనరులు సక్రమంగా వినియోగంలోకి తేకపోవడంతో, లక్షలాది ఎకరాల భూములు బీళ్లుగా మారాయి. సీఎం సూచనతో జలవనరుల శాఖ ఇంజినీర్లు చేసిన కృషితో కాళేశ్వరం నీళ్లు నేడు ఉత్తర తెలంగాణలోని ప్రతి ఇంటిని తాకుతున్నాయి.
– జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
ముందస్తుగా పంటలు వేసుకోవాలి
2014కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వ్యా ప్తంగా వానకాలంలో సైతం నీటి యుద్ధాలను ఎన్నో చూశా. కానీ స్వరాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఎండకాలంలో సైతం భూమికి సమాంతరంగా నీటి నిల్వలు ఉంటున్నాయి. గతంలో వర్షాలు పడితేనే ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీకి వరద నీరు వస్తే, ఆ నీరు దిగువకు ఆధారమయ్యేది. ప్రస్తుతం వరుసగా వర్షాలు పడకున్నా వేసవిలో కూడా మెట్టప్రాంతాల్లోని చెరువులు, కుంటలు గోదావరి నీటితో కళకళలాడుతున్నాయి. సమృద్ధిగా లభిస్తున్న నీటితో ముందస్తుగా పంటలు సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా వడగళ్లు, ఇతర సమస్యల బారిన పడకుండా పంటను కాపాడుకోవచ్చు.
– ఎస్ఈ శివకుమార్, జలవనరుల శాఖ