పెద్దపల్లి, జనవరి 25 (నమస్తే తెలంగాణ): అన్ని రంగాల్లో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచింది. అధికారులు, ప్రజా ప్రతినిధుల సమష్టి కృషితో ప్రగతి పథంలో పరుగులు పెడుతున్నది. హరిత సొబగులు అద్దుకొని పచ్చదనం పెంపులో ముందువరుసలో నిలిచింది. ఇదీ జిల్లావాసులందరికీ గర్వకారణం అంటూ పెద్దపల్లి కలెక్టర్ డాక్డర్ సర్వే సంగీతా సత్యనారాయణ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకావిష్కరణ చేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జిల్లా ప్రగతిపై చేసిన ప్రసంగం ఆమె మాటల్లోనే. ప్రభుత్వం కంటివెలుగు కింద 4.50 లక్షల మందికి కంటి పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నం. ఇందుకు 34 బృందాలను ఏర్పాటు చేసినం. రామగుండం మెడికల్ కాలేజీలో వర్చువల్గా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తరగతులను ప్రారంభించినం. నందిమేడారంలో 7.50 కోట్లతో నిర్మించనున్న 30 పడకల దవాఖాన పనులకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, సంక్షేమ శాఖల మంత్రులు హరీశ్రావు, కొప్పుల చేతుల మీదుగా ఇటీవలే శంకుస్థాపన చేసిండ్రు.
2022 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 3505 మందికి కేసీఆర్ కిట్లు ఇచ్చినం. త్వరలోనే ఐదు పడకల డయాలసిస్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తం. మన ఊరు-మనబడి కింద 191 స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నం. మండలానికి రెండు మోడల్ స్కూళ్లను ఎంపిక చేసి అభివృద్ధి పనులు ప్రారంభిస్తం. 65 స్కూళ్లల్లో 6 నుంచి 10వ తరగతి చదివే 8600 మంది విద్యార్థులకు సంచార ప్రయోగశాల ద్వారా లబ్ధి చేకూర్చినం. ‘పది’ ఉత్తమ ఫలితాల సాధనకు తగిన చర్యలు చేపట్టినం. పారిశుధ్యానికి పెద్దపీట వేసి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ -23లో ఓడీఎఫ్ ప్లస్లో ప్రగతి ఆధారంగా నాలుగు స్టార్ కేటగిరీల్లో జాతీయ స్థాయిలో జిల్లాను మూడోస్థానంలో నిలిపినం. ఆసరా కింద 98, 312 మంది పింఛన్ల కోసం ప్రతి నెలా రూ. 22. 90కోట్లు ఖర్చు చేస్తున్నం. ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు 353 పల్లె ప్రకృతి, 64 బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసినం. గ్రామీణ క్రీడాకారుల కోసం 226 క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసినం.
రైతుబంధు కింద ఈ యాసంగిలో లక్షా 28 వేల 192 మంది రైతులకు రూ. 99. 48 కోట్లను చెల్లించినం. రైతు బీమా ద్వారా 2022లో మరణించిన 151 రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున రూ. 7.50 కోట్లు పరిహారం అందించినం. 72, 579 పంప్సెట్లకు ఏటా రూ. 108. 66 కోట్లతో ఉచిత కరెంట్ ఇస్తున్నం. టీఎస్ ఐపాస్ ద్వారా ఈ యేడు రూ. 13కోట్ల పెట్టుబడులు పెట్టి 299 మందికి ఉపాధి కల్పనకు 41యూనిట్లకు అనుమతులు మంజూరు చేసినం. టీ ప్రైడ్, టీ ఐడియా కింద జిల్లాలో 966 ఎంఎస్ఎమ్ఈ లబ్ధిదారులకు రూ. 60.75 కోట్ల సబ్సిడీ విడుదల చేసినట్లు కలెక్టర్ చెప్పారు. కల్యాణలక్ష్మి ద్వారా 22, 177మందికి రూ. 221.26 కోట్లు, షాదీముబారక్ ద్వారా 1588 మందికి రూ. 13.92 కోట్లు పంపిణీ చేసినం. హరితహారంలో భాగంగా 2022లో 47లక్షల మొకలు నాటినం. 1076 నీటి వనరులను గుర్తించి 1. 49 కోట్ల చేప పిల్లలు, రూ. 80లక్షల విలువైన రూ. 37. 65 లక్షల రొయ్య పిల్లలను పంపిణి చేసిన ప్రత్యక్షంగా 10 వేలు, పరోక్షంగా మరో 5వేల మందికి ఉపాధి కల్పించినం.
18 వేల హెక్టార్లలో ఆయిల్ఫామ్ సాగు చేయాలని సంకల్పించి సుల్తానాబాద్ మండలం రెబ్బదేవపల్లిలో ఆయిల్ ఫామ్ నర్సరీ ఏర్పాటు చేసినం. జిల్లాలో 4763 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు 1317మంది రైతులను గుర్తించగా, ఇప్పటివరకు 955ఎకరాలలో 297మంది మొకలు నాటారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ విద్యార్థులకు రూ.7. 37కోట్లు, బీసీ విద్యార్థులకు రూ. 16. 50 కోట్లు, మైనార్టీ విద్యార్థులకు రూ.కోటి 28లక్షలు, ఎస్టీ విద్యార్థులకు కోటి 30 లక్షల ఫీజు రీయంబర్స్ చేసినం. ఆరోగ్యలక్ష్మి కింద 76 అంగన్వాడీ సెంటర్ల పరిధిలోని 4071 మంది గర్భిణులు, 4795 మంది బాలింతలు, 7నెలల నుంచి 5 సంవత్స రాల్లోపు వయస్సు గల 27, 333 మంది పిల్లలకు పౌష్టికాహారం అందజే స్తున్నం.
సుల్తానాబాద్లో రూ.70 లక్షలతో రెండు బ్లాకుల్లో వృద్ధాశ్రమాన్ని నిర్మించనున్నం. ప్రసంగానికి ముందు జిల్లా ప్రజలకు, అధికారులు, ఉద్యోగులకు, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ మమతారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, పెద్దపల్లి ఆర్డీవో వెంకట మాధవరావు, అదనపు కలెక్టర్లు వడ్ల లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్, డీసీపీ రూపేశ్ పాల్గొన్నారు.