నాడు చిన్న జ్వరానికి కూడా మందు బిల్ల దొరకని సర్కారు దవాఖానలు, నేడు అపర సంజీవనులుగా మారాయి.. ముఖ్యమంత్రి కేసీఆర్ కాయకల్ప చికిత్స చేయడంతో, ఏ చిన్న రోగమొచ్చినా ‘పద పోదాం బిడ్డా సర్కారు దవాఖానకు..’ అనే రోజులు వచ్చాయి.. ఊహించని విధంగా మార్పులు వచ్చి, ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రైవేట్కు దీటుగా సేవలందుతున్నాయి.. హైదరాబాద్ లాంటి నగరాలకే పరిమితమైన కీలక శస్త్రచికిత్సలు, లక్షల రూపాయల విలువైన ఆపరేషన్లు పూర్తి ఉచితంగా ఇక్కడే జరుగుతున్నాయి.. తాజాగా రాష్ట్రంలోనే మొదటిసారిగా వేములవాడ ఏరియా దవాఖానలో 69 ఏండ్ల వృద్ధుడికి మోకాలు కీలు మార్పిడి విజయవంతమైంది.పది రోజుల క్రితం మోకాలు నొప్పితో వచ్చిన భూంరెడ్డికి అరుదైన శస్త్రచికిత్స చేయడం సర్కారు దవాఖానలపై మరింత నమ్మకం పెంచింది.
వేములవాడ, మే16 : నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. కోట్లాది రూపాయలతో దవాఖానలను బలోపేతం చేశారు. జిల్లా దవాఖాన నుంచి మొదలు పీహెచ్సీల దాకా ఆధునిక సౌకర్యాలు కల్పించారు. దాంతో హైదరాబాద్లాంటి నగరాలకు వెళ్లకుండా స్థానికంగానే అత్యంత ఖరీదైన వైద్యం అందిస్తున్నారు. హైరిస్క్ కేసులకూ చికిత్స అందిస్తున్నారు. రూపాయి ఖర్చు లేకుండా కీలకమైన ఆపరేషన్లు చేస్తున్నారు. ఇన్నాళ్లూ ప్రైవేట్ హాస్పిటళ్లకే పరిమితమైన ల్యాప్రోస్కోపిక్ సర్జరీలను ఇటీవల కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానలో చేశారు. నిజానికి ఈ ఒక్కో సర్జరీకి బయట 60వేల నుంచి లక్ష వరకు అవుతున్నా.. ఇక్కడ మాత్రం పూర్తి ఉచితంగా చేశారు. తాజాగా వేములవాడ ఏరియా దవాఖానలో 69 ఏండ్ల వృద్ధుడికి మోకాలు కీలు మార్పిడి ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు. ఓ ఏరియా దవాఖానలో ఇలాంటి అరుదైన శస్త్రచికిత్స చేయడం రాష్ట్రంలోనే తొలిసారి అని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రేగులపాటి మహేశ్రావు చెబుతున్నారు.
వేములవాడ దవాఖానే ఉదాహరణ..
స్వరాష్ట్రంలో వేములవాడ దవాఖాన పూర్తిగా మారిపోయింది. పీహెచ్సీ నుంచి ఏరియా దవాఖానగా మారి, కార్పొరేట్కు దీటుగా తయారైంది. నాలుగున్నర ఎకరాల్లో వందపడకల వైద్యశాలను నిర్మించారు. దాదాపు 2కోట్లతో సీటీస్కాన్, ఆక్సిజన్ జనరేటర్ప్లాంట్, చిన్నారుల కోసం ప్రత్యేక వార్డు, మాతా శిశుసంరక్షణలో భాగంగా ప్రత్యేకవార్డు, ఇతర అనేక వైద్యసదుపాయాలను కల్పించారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు చేతుల మీదుగా గతేడాది మేనెలలో ఈ దవాఖానను అందుబాటులోకి తీసుకవచ్చారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వేగవంతంగా పనులను పూర్తి చేసి అత్యాధునిక వసతులతో సేవలందించారు. నిత్యం 300 మందికిపైగా రోగులు వస్తుండగా, దాదాపు 10 రకాల విభాగాల్లో సేవలందిస్తున్నారు. ఏడాది కాలంలో దాదాపు 50వేల మంది ఓపీ సేవలు పొందగా, సుమారు 2వేల మంది వివిధ చికిత్సల కోసం అడ్మిట్ అయ్యారు. గడిచిన నాలుగు నెలల్లో 40లక్షల విలువైన వైద్యం అందించారు. గత డిసెంబర్ 3వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించి, ఇప్పటి వరకు 330వరకు ఆపరేషన్లు చేశారు.
కీలు మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం..
కోనరావుపేట మండలం నిమ్మపల్లికి కదిరె భూంరెడ్డి (69) కొన్నేళ్లుగా మోకాళ్లనొప్పితో బాధపడుతున్నాడు. పది రోజుల క్రితం తీవ్రం కావడంతో వేములవాడ ఏరియా దవాఖానకు వచ్చాడు. పరీక్షలు చేసి మోకాలు కీలు మార్పిడి ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పగా, కుటుంబసభ్యులు ఒప్పుకున్నారు. దాంతో వైద్యులు అనిల్కుమార్, శశి, తిరుపతి బృందం శనివారం వృద్ధుడి ఎడమకాలుకు కీలు మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా చేశారు. రెండురోజుల తర్వాత వృద్ధుడిని నడిపించారు. ప్రైవేట్ దవాఖానలో 1.50 లక్షలకుపైగా ఖర్చయ్యే చికిత్సను ఏరియా దవాఖానలో ఉచితంగా చేశామని, ఇది రాష్ట్రంలోనే మొదటిసారి అని సూపరింటెండెంట్ మహేశ్రావు తెలిపారు. ఆపరేషన్లో పాలుపంచుకున్న వైద్యులు, రోగితో కలిసి సోమవారం దవాఖానలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
పైసా ఖర్చు లేకుండా ఆపరేషన్
నేను కొన్నేళ్లుగా మోకాలి నొప్పి తో బాధ పడుతున్న. ఎవుసం చేసు కునేటోళ్లం. ఇప్పుడు ఏ పనీ చేయలేకపోతున్న. పదిరోజల కింద నొప్పి ఎక్కువైంది. వేములవాడ దవాఖానకు వచ్చి డాక్లర్లకు చూపించుకున్న. ఆపరేషన్ చేయాలన్నరు. రూ పాయి ఖర్చు లేకుండా ఆపరేషన్ చేసిన్రు. మరుసటిరోజే నడిపించిన్రు. ప్రైవేట్ దవాఖానల అయితే 2లక్షల వరకు ఖర్చయితుండె. కానీ, పైసా ఖర్చు లేకుండా ఆపరేషన్ అయింది.
-కదిరె భూంరెడ్డి, నిమ్మపల్లి
క్రిటికల్ కేసులు చేస్తున్నాం
కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో అన్ని రకాల క్రిటికల్ కేసులకు సేవలందిస్తున్నం. శస్త్ర చికిత్సలు చేస్తున్నాం. ఇప్పటికే దవాఖానలో ల్యాప్రోస్కోపిక్ సర్జరీలు, చిన్న పిల్లలకు అపెండిక్స్ ఆపరేషన్లు, ఊబకాయంతో ఉన్న గర్భిణులకు ప్రసవాలు చేశాం. పూర్తి స్థాయిలో ప్రైవేట్కు దీటుగా వైద్యం అందిస్తున్నాం.
– డాక్టర్ రాజశ్రీ, అనస్తీషియన్ (కరీంనగర్ ప్రభుత్వ దవాఖాన)
రాష్ట్రంలోనే మొదటిసారి
రాష్ట్రంలోనే మొదటిసారిగా వేములవాడ ఏరియా దవాఖానలో కీలుమార్పిడి శస్త్రచికిత్సను చేశాం. ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సను చేయడం ఆనందంగా ఉన్నది. మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు సహకారంతో దవాఖానలో మెరుగైన సేవలందిస్తున్నాం. ఆరోగ్యశ్రీ ద్వారా అనేక శస్త్రచికిత్స సేవలను పూర్తి ఉచితంగా చేస్తున్నాం.
– రేగులపాటి మహేశ్రావు, వేములవాడ ఏరియా దవాఖాన సూపరింటెండెంట్