రాజన్న సిరిసిల్ల, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ఆడబిడ్డలు మెచ్చినట్టే అనువైన డిజైన్లలో బతుకమ్మ చీరెల తయారీని చేపడుతున్నట్లు టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ పేర్కొన్నారు. బతుకమ్మ చీరెల డిజైన్లపై మహిళల అభిప్రాయ సేకరణలో భాగంగా శుక్రవారం చేనేత జౌళిశాఖ ఆధ్వర్యంలో సిరిసిల్లలోని పంచాయతీరాజ్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సిరిసిల్లతోపాటు ఇతర మండలాల నుంచి 50 మంది మహిళలు పాల్గొన్నారు. 2023లో బతుకమ్మ పండుగ కానుకగా అందించేందుకు తయారు చేసిన చీరెల డిజైన్లను పరిశీలించి, సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీపీటీడీసీ చైర్మన్ మాట్లాడారు. బతుకమ్మ పండుగ కానుకగా ప్రభుత్వం ఆరేళ్లుగా ఆడబిడ్డలకు చీరెలు పంపిణీ చేస్తున్నదని చెప్పారు. ఎప్పటిలాగే మహిళలకు ఇష్టమైన డిజైన్లలోనే చీరెల తయారీ కోసం అభిప్రాయాలు సేకరిస్తున్నామన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగలకు కానుకగా చీరెలు, దుస్తులను అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని కొనియాడారు. ఆయా వస్ర్తాల తయారీ ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు అందించి ఉపాధిని మెరుగుపరిచిన ఘనత మంత్రి కేటీఆర్కు మాత్రమే దక్కుతుందని చెప్పారు. సమావేశంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, టీఎస్సీవో జీఎం యాదగిరి, చేనేత జౌళిశాఖ ఉప సంచాలకుడు అశోక్రావు తదితరులు పాల్గొన్నారు.