రాజన్న సిరిసిల్ల, మే 22( నమస్తే తెలంగాణ): సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లి ఇద్దరు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. సిరిసిల్ల పట్టణం శాంతి నగర్కు చెందిన ఎదురుగట్ల హరిచరణ్ గౌడ్ (17), వేములవాడ మండలం చీర్లవంచ ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన అల్లం మణికంఠ (17 ), తన స్నేహితులతో కలిసి ఈతకోసం సిరిసిల్ల శివారులోని మానేరు వాగులోని నీటిగుంటలోకి దిగారు. ఈతరాకపోవడంతో మణికంఠ, హరి చరణ్ గౌడ్ నీట మునిగి గల్లంతయ్యారు.
భయాందోళనతో తోటి స్నేహితులు కేకలు వేసి స్థానికులకు సమాచారం అందించారు. అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని మణికంఠ, హరిచరణ్ గౌడ్లో మృతదేహాలను వెలికి తీశారు. ఇద్దరు బాలురు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. బాధిత కుటుంబాలను బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి పరామర్శించి ఓదార్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తంగళ్లపల్లి ఎస్ఐ ఉపేంద్ర చారి తెలిపారు.
