హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): తమకు ఇస్తామన్న పదవుల సంగతి తేల్చాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై సీపీఐ, టీజేఎస్ ఒత్తిడి పెంచుతున్నాయి. సీఎం రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ జనసమితి, సీపీఐ పార్టీల మద్దతు కోరారు. ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని, మిత్రపక్షాలుగా పోటీ చేయడం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని ఆయా పార్టీల కార్యాలయాలకు రేవంత్రెడ్డి స్వయంగా వెళ్లి చర్చలు జరిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఆ రెండు పార్టీలకూ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. సీపీఐకి ఒక ఎమ్మెల్సీ, ఐదు నామినేటెడ్ పదవులు, టీజేఎస్కు కూడా ఒక ఎమ్మెల్సీ, 5 రాష్ట్రస్థాయి చైర్మన్ పదవులు, 5 జిల్లా స్థాయి పదవులు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకొన్నారు. సీపీఐకి ఇచ్చిన హామీ మేరకు ఆ పార్టీ నల్లగొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యంను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నుకొన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్గా కే శ్రీనివాస్రెడ్డిని నియమించారు.
టీజేఎస్ నుంచి కోదండరామ్కు ఎమ్మెల్సీగా, పీఎల్ విశ్వేశ్వరరావును విద్యాకమిషన్ సభ్యుడిగా నియమించారు. ఆ తర్వాత ఈ రెండు పార్టీలను పట్టించుకోవడం మానేశారు. కాంగ్రెస్లోనూ పదవుల విషయంలో తీవ్ర పోటీ నెలకొన్నది. సీనియర్లు, జూనియర్లు, కొత్త, పాత అందరూ పదవులు ఆశిస్తున్నారు. ఒకవైపు మంత్రివర్గ విస్తరణ రేపు-మాపు అంటూ అధిష్ఠానం దాటవేస్తున్నది. ఇటీవల నామినేటెడ్ పోస్టుల పదవీకాలం ముగియగా, ఎవరినీ రెన్యువల్ చేయలేదు. దీంతో కొత్తవారికి అవకాశాలు దక్కుతాయని భావించారు. పలు దఫాలుగా పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీనటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ చర్చలు జరిపి ఓ తుది నిర్ణయానికి వచ్చినట్టు వార్తలొచ్చాయి. కానీ, మళ్లీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా పరిస్థితి మారింది. దీంతో రెండు పార్టీల్లోనూ పదవుల అంశం ఒత్తిళ్లకు దారితీసున్నది.
సీపీఐ విమర్శల బాణం.. అపాయింట్మెంట్ కోసం టీజేఎస్
కాంగ్రెస్ వైఖరిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు డైరెక్ట్గానే విమర్శలకు దిగారు. మొక్కే కదా అని పీకేస్తే.. పీక కోస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘మాతో పెట్టుకుంటే మిమ్మల్ని రక్షించేవాడు ఉండడ’ని హెచ్చరించారు. మరోవైపు, కోదండరామ్పై టీజేఎస్ సీనియర్ నేతలు, ఆశావహులు తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారు. నేరుగా సీఎం కలిసి తాడోపేడో తేల్చుకుందామని ఒత్తిడి తెస్తున్నారు. దీంతో కోదండరామ్ వారి ఒత్తిడి భరించలేక సీఎం అపాయింట్మెంట్ అడిగినట్టు తెలిసింది. సీఎం ఎప్పుడు రమ్మంటారా? అని టీజేఎస్ శ్రేణులు ఎదురుచూస్తున్నప్పటికీ, అక్కడినుంచి స్పందన లేదు. దీంతో కోదండరామ్తో కటీఫ్ చేసుకుందామా? అనే చర్చ తెలంగాణ జన సమితి శ్రేణుల్లో జరుగుతున్నట్టు సమాచారం. అందుకే ఇటీవల కోదండరామ్ పర్యటనలో పార్టీ నేతలు హాజరుకావడం లేదని తెలిసింది.