రాజన్న సిరిసిల్ల, జూన్, 8( నమస్తే తెలంగాణ) : ఈ నెల 12 వ తేదీన జిల్లాలో టెట్ పరీక్ష నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో టెట్ పరీక్ష నిర్వహణపై రూట్ ఆఫీసర్లు, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, చీఫ్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. అభ్యర్థులు, అధికారులు పరీక్షా కేంద్రాల లోపలికి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ సామగ్రి అనుమతించకూడదని స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సులు అన్ని మార్గాల్లో అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, గదుల్లో ఫ్యాన్లు, లైటింగ్, సీసీ కెమెరాలు ఉండేలా చూడాలన్నారు. ప్రతి కేంద్రంలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. టెట్ పరీక్ష నిర్వహణ కోసం జిల్లాలో 29 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 12 వ తేదీన ఉదయం 09.30 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు జరిగే మొదటి పేపర్ పరీక్షకు 6,844 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే రెండోపేపర్కు 5,941 మంది హాజరు కానున్నట్లు కలెక్టర్ తెలిపారు.
అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు నిర్ణీత సమయం కంటే ఒక గంట ముందే చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రం లోపలికి అనుమతించడం ఉండదని, పరీక్ష రాసే అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్, జిల్లా విద్యాధికారి డా.రాధా కిషన్, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ వినోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.